India vs Pakistan China: పాకిస్తాన్, చైనా సైన్యంతో ఘర్షణ వాతావరణం ఏర్పడిన సందర్భాల్లో తరచుగా పీవోకే, ఎల్వోసీ, ఎల్ఏసీ అనే పేర్లు వినిపిస్తుంటాయి. చాలా మందికి వీటి గురించి అంతగా తెలియదు. ఇంతకీ ఈ పేర్ల వెనుక ఉన్న అర్థం ఏంటి? ఇవి ఏ ప్రాంతాల్లో, ఏ దేశాల నడుమ ఉంటాయి? ఇంతకీ ఇవి ఎలా ఏర్పాడ్డాయి? అనే పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ముస్లీంలు అంతా పాకిస్తాన్ కు వెళ్లిపోగా, హిందువులు భారత్ లోకి వచ్చారు. పాకిస్తాన్ మత ప్రాతిపదికన ఏర్పడింది. 1947లోనే జమ్మూకాశ్మీర్ లోని కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించింది. ఆ తర్వాత దాన్ని రెండు భాగాలుగా విభజించింది. వాటికి ఆజాద్ కాశ్మీర్, గిల్గిట్ బాల్టిస్తాన్ అనే పేర్లు పెట్టింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సుమారు 52 లక్షల మంది జనాభా ఉన్నారు. నిజానికి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అనేది కాశ్మీర్ లో ఒక భాగం. దీనికి వాయవ్య పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్, ఆప్ఘనిస్తాన్ వఖాన్ కారిడార్, చైనా జిన్జియాంగ్ ప్రాంతం, తూర్పున భారత కాశ్మీర్ సరిహద్దులుగా ఉన్నాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో స్వయం పాలన శాసనసభ ఉందని చెప్తున్నప్పటికీ, ఇదంతా పాకిస్తాన్ నియంత్రణలో ఉంది. దేశం మీద ఉగ్రదాడులు చేసే ఉగ్రమూకలు అన్నీ ఈ ప్రాంతంలోనే ఉంటాయి. వారికి పాక్ సైన్యం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి.
⦿ నియంత్రణ రేఖ (LOC)
దీనిని లైన్ ఆఫ్ కంట్రోల్(LOC) లేదంటే నియంత్రణ రేఖ అంటారు. ఇది పాకిస్తాన్, భారత్ మధ్య ఉన్న సరిహద్దుగా పరిగణిస్తారు. 1947- 1948 ఇండియా, పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఇది ఏర్పడింది. ఇది అధికారిక సరిహద్దు కాకపోయినా తాత్కాలిక బార్డర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నియంత్రణ రేఖ అనేది 740 కిలో మీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను జమ్మూ కాశ్మీర్ నుంచి వేరు చేస్తుంది. ఈ రేఖ పొడవునా భారత ప్రభుత్వం ఓ కంచెను ఏర్పాటు చేసింది. నియంత్రణ రేఖకు ఇటు వైపు భారత సైన్యం, అటు వైపు పాకిస్తాన్ నియంత్రణ పోస్టులు ఉంటాయి. వాస్తవానికి దీనిని మొదట కాల్పుల విరమణ రేఖ అని పిలిచే వాళ్లు, జులై 3, 1972 సిమ్లా ఒప్పంద తర్వాత నియంత్రణ రేఖగా పేరు మార్చారు.
⦿ వాస్తవ నియంత్రణ రేఖ (LAC)
వాస్తవ నియంత్రణ రేఖ (LAC) జమ్మూకాశ్మీర్, చైనాకు మధ్య ఉన్న సరిహద్దు. 1962 ఇండియా, చైనా మధ్య యుద్ధం తర్వాత దీనిని ఏర్పాటు చేశారు. లద్దాఖ్, చైనా ఆక్రమించిన ఆక్సాచిన్ మధ్యలో ఉంది. ఇది కూడా అధికారిక సరిహద్దు కాదు. ప్రస్తుతానికి మిలటరీ కంట్రోల్ లైన్ గా పరిగణించబడుతుంది. ఇప్పటికే భారత ప్రభుత్వం మాత్రం పాకిస్తాన్, చైనా ఆక్రమించిన ఆజాద్ కాశ్మీర్, గిల్టిట్ బాల్టిస్తాన్, అక్సైచిన్ ప్రాంతాలను ఇండియాలో భాగంగా పరిగణిస్తున్నది.
Read Also: ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం అలర్ట్, కాశ్మీర్ రైల్వే లింక్ భద్రత కట్టుదిట్టం!