Rajagopal Reddy: కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదటి సారి సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. మునుగోడు లో ఇటీవల జరిగిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపనలో సీఎం రేవంత్రెడ్డిని ఆకాశానికెత్తారు. ఎప్పుడూ సీఎంపై విరుచుకుపడే రాజగోపాల్రెడ్డి ఒక్కసారిగా రేవంత్ ని పొగడటంతో సభలో ఉన్న వారంతా కేరింతలు కొట్టారు. అసలు మొన్నటి వరకు సీఎం ని అంతగా తిట్టిన రాజగోపాల్ రెడ్డి సడన్గా వాయిస్ మార్చడం వెనుక లెక్కలేంటి?.
ఉమ్మడి నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి. జిల్లా కాంగ్రెస్ కీలక నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్లో ఒకరైన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో నుంచి కాంగ్రెస్లో తిరిగొచ్చారు. ఆ రీఎంట్రీ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రి పదవి గ్యారెంటీ అని పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు చిన్న కోమటిరెడ్డికి క్యాబినెట్లో చోటు దక్కలేదు.
తర్వాత లోక్సభ ఎన్నికల సమయంలో భువనగిరి సీలు గెలిపించుకుని వస్తే అమాత్య పదవి గ్యారెంటీ అని రాజగోపాల్కు మరోసారి హామీ లభించిందంట. దాంతో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ సామల కిరణ్ కుమార్ రెడ్డి విజయంలో తన వంతు పాత్ర సమర్ధంగా పోషించిన రాజగోపాల్రెడ్డి క్యాబినెట్ బెర్త్పై చాలా ఆశలే పెట్టుకున్నారు. అయితే తర్వాత జరిగిన మంత్రి వర్గ విస్తరణలోనూ ఆయనకు చోటు దక్కలేదు. ఆ ప్రభావంతో ఆయన కాంగ్రెస్ ముఖ్యనేతలను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఆయా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై సైతం తన అక్కసు వెళ్లగక్కారు.
అలాంటిది సడన్గా మునుగోడులో ఇటీవల జరిగిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపనలో సీఎం రేవంత్రెడ్డిని ఆకాశానికెత్తేస్తూ పొగడ్తలతో ముంచెత్తి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేనా మొన్నీమధ్య కోమటిరెడ్డి సోదరుని మనవరాలు పెళ్లిలో కూడా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజా మంత్రి జానారెడ్డి, ఆయన కుమారుడు సాగర్ ఎంపీ రఘువీర్తో కూడా చాలా సరదాగా మాటలాడుతూ అందరినీ అబ్బురపరిచారు.
గతం లో జానారెడ్డిని ధృతరాష్ట్రుడు అని, తనకు మంత్రి పదవి రాకుండా లెటర్ రాశారని రాజగోపాల్ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటాయనమొదటిసారి జానారెడ్డి కుటుంబసభ్యులతో చాలా సేపు ముచ్చటించడం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక మొన్నమొన్నటి వరకు మునుగోడు తన ఇలాఖా అంటూ.. మంత్రులెవరూ పర్మిషన్ లేకుండా తన నియోజకవర్గంలో అడుగుపెట్టలేరన్నట్లు రాజగోపాల్రెడ్డి వ్యవహరించారు.
అయితే నల్లగొండ జిల్లాకే చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆయన తెగ ప్రశంసించడం మొదలుపెట్టారు. ఉత్తమ్ ఇరిగేషన్ మంత్రిగా ఉండటం వల్లే డిండి ప్రాజెక్ట్ టెండర్ లు పిలిచి పనులు వేగవంతం అవుతున్నాయని, డిండి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేలా ఇరిగేషన్ మంత్రికి అన్ని విధాలా సహకరిస్తానని చెప్పుకొచ్చారు. ఇలా సీనియర్ నేతల పట్ల పాజిటివ్ దృక్పథంతో ఉండటం రాజగోపాల్రెడ్డి కి జిల్లాలో ఇమేజ్ మరింత పెంచుతోందని ఆయన అనుచరులు సంబరపడి పోతున్నారు.
అలాగే మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి, మంత్రులందరినీ కలిసి అధిక నిధులు తీసుకొస్తానని ఆయన చెప్పడంతో మునుగోడు కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ కనపడుతుంది. గతంలో రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నా , బీఆర్ఎస్ అధికారం లో ఉండటం తో ఎలాంటి పనులు జరగలేదు.ఇపుడు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నా ప్రభుత్వంపై విమర్శలు చేయడం, మంత్రి పదవి కోసం తాపత్రయం తప్ప అభివృద్ధి జరగటం లేదని ప్రజలంతా చర్చించుకున్నారు.
దాంతో రూటు మార్చిన రాజగోపాల్ రెడ్డి అందరితో మంచిగా ఉంటూ, పని చేసుకుంటూ పోతే మంత్రి పదవి దానంతట అదే అవస్తుందని, విమర్శల్ని పక్కన పెట్టి రూటు మార్చారంటున్నారు. రాజగోపాల్రెడ్డి కి మంత్రి ఇస్తానని ఇవ్వలేదు, కచ్చితంగా మంత్రి ఇవ్వాల్సిందే అనే విధంగా జిల్లా నేతలందరితో సమన్వయం చేసుకునే చేసుకునే పనిలో పడ్డారంట. అందులో భాగంగానే ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులతో ఎలాంటి విభేదాలు లేవని రుజువు చేసుకోవడానికి ప్రయత్తిస్తున్నారంట. చిన్న కోమటిరెడ్డి సడన్గా రూటు మార్చి సీఎం రేవంత్రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తుండటంతో అయనకు జిల్లా ఎమ్మెల్యేల మద్దతుకూడా పెరుగుతోందంట. ఇక మీదట కూడా ఆయన ఇలాగే కొనసాగితే… మంత్రి పదవి దక్కడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Also Read: పవన్ నమ్మకం.. బాలినేని ‘రివర్స్’ గేమ్! ప్రకాశం మొదలైన అసలు కథ ఇదే!
Story by: Apparao, Big Tv