Congress Political: ఆ జిల్లాలోఎన్నికైన నేతల కన్నా ఓడిపోయిన నాయకుడికే అధికారం ఎక్కువగా ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.. ఓడిన నాయకుడు, గెలిచిన మరో నేత కలిసి పాలనను తమ చెప్పుచేతుల్లో పెట్టుకుంటున్నారంట.. అధికార యంత్రాంగం పూర్తిగా వారి గుప్పెట్లోకి వెళ్లిపోయిందని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.. అధికారి పోస్టింగ్ అయినా మరే నిర్ణయం అయినా ఈ ఇద్దరి అనుమతి తప్పనిసరి అంటున్నారట. ఆ జిల్లా పాలనను అంతగా నియంత్రిస్తున్న నాయకులు ఎవరు? ఇంతకీ ఏదా జిల్లా..?
జోగులాంబ గద్వాల జిల్లాలో మల్లు రవి, సంపత్ కుమార్ హవా
జోగులాంబ గద్వాల జిల్లా.. ఈ జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతల ఆధిపత్యమే కొనసాగుతోందని పొలిటికల్ సర్కిల్స్లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వారిలో ఒకరు ప్రస్తుత ఎంపీ మల్లు రవి, మరొకరు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. ఇప్పుడు ఆ జిల్లాలో వారి మాటే అధికారులకు శాసనంగా మారిందట. పాలనలో కీలక నిర్ణయాలు, అధికారుల బదిలీలు, కీలక పోస్టింగ్లు అన్నీ వారి సిఫార్సుతోనే జరుగుతున్నాయంట. వారి మాట పట్టించుకోకుండా వ్యవహరించిన అధికారులకు తక్షణమే బదిలీ ఉత్తర్వులు సిద్ధమవుతున్నాయంట. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉంటూ వీరి మాటలను శిరసావహించక తప్పని పరిస్థితి ఏర్పడిదంట.
సంపత్కుమార్ పెత్తనంపై గుర్రుగా ఉన్న అధికారులు
ఆ ఇద్దరు నేతల్లో మల్లు రవి ఎంపీ హోదాలో ఉన్నారు. ఎంపి హోదాలో ఉన్న మల్లు రవి మాట చెల్లుబాటు అవుతుందంటే అర్థం ఉంది. అయితే ఏ హోదా లేని మాజీ ఎమ్మెల్యే సంపత్ పెత్తనంపై అధికారులు గుర్రుగా ఉన్నారంట. ఇక్కడ ప్రజా పాలన చేయకుండా పవర్తో పాలన చేస్తున్నారన్న చర్చలు జిల్లాలో ఊపందుకున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఈ జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి అలంపూర్, మరొకటి గద్వాల. అయితే, ఈ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు ఉన్నా, అసలు అధికారం ఎవరి చేతిలో ఉంది? అధికార యంత్రాంగాన్ని నడిపిస్తుంది ఎవరు? అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోందట.
ఇద్దరు కనుసన్నల్లోనే కొనసాగుతున్న జిల్లా పాలన
ఒకరు గెలిచి పదవిలో ఉన్నా, మరొకరు ఓడిపోయినా, ఇద్దరి హవా మాత్రం ఏ మాత్రం తగ్గలేదన్న మాట అందరి నోట వినిపిస్తోంది. పాలన వీరి కనుసైగలతోనే సాగుతుందన్న వాదన రోజురోజుకు బలపడుతోందట. అధికారుల నియామకాలు, బదిలీలు, జిల్లాలో ముఖ్యమైన అన్ని నిర్ణయాలు వీరి అనుమతితోనే జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఇక్కడ పని చేయాలంటే, ఈ ఇద్దరిలో ఒకరి ఆమోదముద్ర తప్పనిసరి అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందని స్థానికంగా చర్చ నడుస్తోందట. వీరిద్దరూ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులుగా ఉండటంతో, అధికార యంత్రాంగం వారి దిశానిర్దేశంలోనే పనిచేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరి మాటను పట్టించుకోని అధికారులపై వెంటనే బదిలీ వేటు పడుతోందంట.
Also Read: ఏ తోడు లేక.. ఎటేపమ్మ ఒంటరి నడకా?
డమ్మీలుగా మారిపోయిన గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు
గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉండగా.. అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఉన్నారు. అయితే, ఎంపీ మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హవా కొనసాగుతుండటంతో.. గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో డమ్మీలుగా మారిపోయారని టాక్. అధికారులు వారికి పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదట. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచిన కొద్దిరోజులకే అధికార కాంగ్రెస్ పార్టీలో చేరినా.. ఆయన పార్టీలో పూర్తిగా ఇమడలేకపోతున్నారంట.
పాలన వ్వవహారాల్లో ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ జోక్యం
ఒకే పార్టీలో ఉన్నప్పటికీ, మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత – బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్య వర్గ పోరు నడుస్తూనే ఉంది. దీంతో పాలన వ్యవహారాల్లో ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ జోక్యం ఎక్కువైందనే చర్చ నడుస్తోంది. వారు చెప్పిందే అమలు కావడంతో.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా లేనట్టే తయారైందని ఆయన అనుచరులు వాపోతున్నారు. గద్వాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధికార పార్టీ కాంగ్రెస్లో చేరినప్పటికీ, పరిస్థితులు ఒక్కటంటే ఒక్కటి కూడా అనుకూలించడం లేదంట.