నాటి ఆప్త మిత్రులు.. నేడు బద్ధ శత్రువులు.. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరనే నానుడికి ఇప్పుడు ఉదాహరణగా నిలుస్తున్నారు ఈ నాయకులు. ఫ్యాక్షన్ కే కాకుండా.. రాజకీయాలకి కూడా పెట్టింది పేరైనా కడప జిల్లాలో ఆ నేతల మధ్య ఆర్థికపరమైన రాజకీయ యుద్ధం నడుస్తోండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎవరా నేతలు.. ఏంటా స్టోరీ.
ఆ నేతలు ఇద్దరు ఒకప్పుడు టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత కాలగమనంలో ఇద్దరు పార్టీలు మారారు. ఇప్పుడు ఇద్దరూ బీజేపీలో ఉన్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఒకరు ఎంపీ అయితే .. మరొకరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పైగా ఇద్దరు ఒకే జిల్లాకు చెందినవారు. అయితే సొంత జిల్లాలో ఒక నేత సొంత నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే … మరో నేత ఏకంగా ప్రాంతం మారి మరో లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం దక్కించుకున్నారు. అయితే ఆ ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు వ్యవహారం.. జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఏకంగా కూటమి ప్రభుత్వానికి కూడా సెగ పుట్టిస్తోందట. ఆ ఇద్దరు నేతలు ఎవరో కాదు ? ఉమ్మడి కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి.. మరొకరు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. ఇప్పుడు వారిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందని చర్చ నడుస్తోందట.
సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.. వ్యాపారాలు సహా అన్నీ తానై వ్యవహరిస్తున్నారు అన్నది బహిరంగ రహస్యంగా ఉందట. మద్యం నుంచి ఇసుక వరకు అన్ని విషయాలలోనూ ఆయన వర్గం హవా బాగా పెరిగిపోయిందని అంటున్నారట. జమ్మలమడుగు నియోజకవర్గంలో అదానీ సంస్థ పవర్ ప్లాంట్ నిర్మిస్తోంది. వైసీపీ హయాంలో పురుడు పోసుకున్న ఈ ప్లాంట్ నిర్మాణం.. సబ్ కాంట్రాక్ట్ ను సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుంది. ఈ కాంట్రాక్టు రమేష్ దక్కించుకోవటాన్ని.. ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు, ఆయన అనుచర వర్గం బాగా వ్యతిరేకిస్తున్నారట. ఇప్పుడు అక్కడ పనులు ప్రారంభించిన వారిని ఆదినారాయణ వర్గీయులు బెదిరించి దాడులకు దిగారట.
గత రెండు నెలల నుంచి ఈ గొడవ నడుస్తోందట. ఈ క్రమంలోనే ఇద్దరు నేతలకు సీఎం చంద్రబాబు హెచ్చరించారట. ఆధిపత్య రాజకీయాల వద్దని హితవు పలికారట. ఆదినారాయణ రెడ్డిని చంద్రబాబు పిలిపించుకుని మరి వార్నింగ్ ఇచ్చారట. అయినా కానీ ఆదినారాయణ వర్గం రెచ్చిపోయి మరి దాడులకు దిగడం.. ఇంత జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఎవరు జోక్యం చేసుకోకపోవడం కూటమి కూటమి నేతలకు మింగుడు పడడం లేదట. పైగా ఇద్దరు బీజేపీలో ఉండడంతో.. బీజేపీ పెద్దలు సర్దుబాటు చేయకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారట. గొడవ మరింత ముదిరితే.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు పరిస్థితి అవుతుందని హెచ్చరిస్తున్నారట.
గతంలో ఇదే కాంట్రాక్టు విషయంలో ఆదినారాయణ రెడ్డి తన అన్న కొడుకు భూపేష్ ని కూడా బెదిరించారని కూడా అంటున్నారు. ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరిక విషయంలో గానీ.. బీజేపీ చేరిక విషయంలో గానీ సీఎం రమేష్ కీలక పాత్ర పోషించారట. అంతే కాకుండా స్వర్గీయ వివేకానంద రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడానికి వీరిద్దరే ప్రధాన కారణమని ఆ జిల్లాల పెద్ద టాక్ ఉందట. నిన్న మొన్నటి వరకు మంచి మిత్రులుగా ఉన్న సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి.. నేడు ప్రత్యర్థులుగా మారడం ఏంటని నేతలంతా అయోమయంలో ఉంటున్నారట.
ఈ వ్యవహారం అంతా ఒక వైపు నడుస్తుంటే.. మరోవైపు కడపలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఫ్లైయాష్ వివాదం రోజురోజుకీ మరింత ముదురుతోంది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ – RTPP నుంచి తాడిపత్రి నియోజకవర్గంలోని ఎల్ అండ్ టీ కంపెనీకి ఫ్లైయాష్ తరలించే కాంట్రాక్ట్ కోసం రెండు వర్గాలు పట్టు పడుతున్నాయి. ఈ కాంట్రాక్ట్ కోసం పోటీ పడుతున్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వార్ నడుస్తోంది. కాంట్రాక్ట్ తమకే దక్కాలని ఇద్దరు నాయకులు పోటీ పడుతున్నారు. ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు భూపేష్ రెడ్డి వర్గీయులు తమ వాహనాలను అడ్డుకుంటున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ఎమ్మెల్యే ఆది వర్గీయుడైన భూపేశ్రెడ్డి ఈ విషయంలో దూకుడుగా ఉన్నారు. కానీ, ఈ ప్రతిపాదనకు జేసీ అంగీకరించకపోవడంతో.. ఇరు వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇప్పటికే చాలా సార్లు అడ్డుకున్నారన్న ప్రభాకర్ రెడ్డి.. ప్రతీసారి తాము సంయమనం పాటించామని అన్నారు. వాళ్లు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై జేసీ ప్రభాకర్ రెడ్డి కడప ఎస్పీకి నిన్న లేఖ రాశారు. అక్టోబర్ 15న తమ వాహనాలను భూపేశ్ రెడ్డి అడ్డుకున్నారని, దీనిపై కడప ఎస్పీ, జమ్మమడుగు డీఎస్పీలకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు. దీంతో 23న కడప నుంచి వస్తున్న సిమెంట్, ఇసుక లారీలను నిలిపేసినట్లు తెలిపారు. ఎస్పీ అభ్యర్తన మేరకు మళ్లీ అనుమతించామన్నారు. తమ లారీలను లోడింగ్కు అనుమతిస్తామని తాడిపత్రి పోలీసులు.. తర్వాత నో పర్మిషన్ అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవాళ్టి నుంచి తమ వాహనాలను ఆపితే తేలిగ్గా తీసుకోమని, ఆది నారాయణరెడ్డి వర్గం దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని అన్నారు. లేఖపై స్పందించిన ఎస్పీ విద్యాసాగర్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. దీంతో RTPP దగ్గరికి ఇరు నేతల వర్గీయులు భారీగా చేరుకుంటారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఎలాంటి ఉద్రిక్తత తలెత్తకుండా జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వర్లు స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. RTPP దగ్గరికి వస్తున్న ఆదినారాయణరెడ్డి వర్గీయులను వెనక్కి పంపిస్తున్న పోలీసులు… జేసీ ప్రభాకర్రెడ్డి కూడా అక్కడికి ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉందని అలెర్ట్గా ఉన్నారు. RTPP దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
Also Read: పవన్ ఢిల్లీ టూర్ సక్సెస్.. ప్రధాని మోడీతో సుధీర్ఘ భేటీ.. చర్చ సాగింది అందుకేనా?
నాడు దోస్తీ దోస్తీ అన్న నేతలు.. నేడు నయ్ నయ్ అనడానికి కారణాలు ఏంటని కూటమి నేతలంతా తల పట్టుకుంటున్నారట. ఇప్పటికే ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ వ్యవహారం తలనొప్పిగా మారిన తరుణంలో.. ఇప్పుడు కొత్తగా ఆదినారాయణ రెడ్డి, జేసీ వ్యవహారం మరో రచ్చకు దారితీస్తుందని ఆందోళన చెందుతున్నారట. మరి ఈ వ్యవహారంపై బీజేపీ పెద్దలు, సీఎం చంద్రబాబు ఏం యాక్షన్ తీసుకుంటారో అని జోరుగా చర్చ జరుగుతుంది.