CM Revanth vs PM Modi: తెలంగాణ పాలిటిక్స్ కులం చుట్టు తిరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. మోడీ పుట్టుకతో బీసీ కాదు అని కామెంట్ చేయడాన్ని కమలం నేతలు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. మా నాయకుడిని అంత మాటంటావా అంటూ బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇంతకీ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యల్లో నిజమెంత? బీజేపీ నాయకుల రియాక్షన్ ఏంటి?
నిన్నటివరకు సర్వేపై సమరం..
ఇప్పుడెమో కులం కామెంట్స్ పై కుస్తీలు..
కలిపిందే మీరంటున్న కమలం నేతలు
ఇది తెలంగాణలో ప్రస్తుతమున్న పొలిటికల్ పంచాయితీ.
ఒక్కసారిగా ఉలిక్కపడ్డ బీజేపీ నేతలు
ఎమ్మెల్సీ ఎన్నికల ముంగింట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాంబ్ పేల్చారు. బీసీ కులగణనపై నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సీఎం.. మోడీ క్యాస్ట్పై మాట్లాడి తెలంగాణలో పొలిటికల్ వెదర్ను హీటెక్కించారు. మా నాయకుని కులంపైనే మాట్లాడుతావా? అంటూ బీజేపీ నేతలు.. అంతా ఒక్కటే.. ఎవరైతే ఏంటి అంటూ కాంగ్రెస్ నాయకులు మాటకు మాట ఇచ్చుకుంటున్నారు. ఇంతకీ సీఎం రేవంత్రెడ్డి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.
సీఎం కామెంట్స్ను ఖండించని కాషాయనేతలు
మోడీ లీగల్లీ కన్వర్టడ్ బీసీ. చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నానని సీఎం రేవంత్ రెడ్డి నొక్కి మరీ చెప్పారు. ప్రధానమంత్రి కులంపై.. ఓ రాష్ట్ర సీఎం ఓపెన్గా మాట్లాడటంతో బీజేపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇన్నాళ్లూ రాష్ట్రంలో ఎవరికీ పెద్దగా తెలియని విషయాన్ని సీఎం అందరికీ తెలిసేలా చేశాడు. దాంతో కమలం నేతలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై కౌంటర్ ఎటాక్కు దిగారు. అయితే సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ను మాత్రం కాషాయ నేతలు ఖండించడం లేదు. అదే టైంలో ఎస్.. మోడీ కులాన్ని ఓసీ నుంచి బీసీలోకి మార్చినమాట వాస్తవమేనని అంగీకరిస్తున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఒకే విషయాన్ని చెబుతున్నారు.
1994 జులై 25న బీసీల్లో చేర్చిన ప్రభుత్వం
ప్రధాని మోడీ కులాన్ని.. 1994 జులై 25న గుజరాత్ గవర్నమెంట్ బీసీల్లో చేర్చిందంటున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి షబీల్ దాస్ మెహతానే ఈ పనిచేసిందని గుర్తుచేస్తున్నారు. మోడీ కులాన్ని బీసీల్లో చేర్చారు అని ఒప్పుకుంటున్నారు తప్ప.. మోడీ ఓసీ కాదు బీసీ అని గట్టిగా చెప్పలేకపోతున్నారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మూతోడ్ జవాబిచ్చారు. మోడీ పుట్టుకతో బీసీ కాదు.. లీగల్లి కన్వర్టెడ్ బీసీ అనేది నిజం కదా అని ప్రశ్నించారు. obc ముసుగు వేసుకుని ఉన్నాడు తప్పితే బీసీ లకు చేసింది లేదన్నారు.
లీగల్లి కన్వర్టెడ్ బీసీ అనేది నిజం కదా అని ప్రశ్నలు
మరో కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్ సైతం.. కిషన్ రెడ్డి మాటలను కాస్త అటుఇటుగా మార్చి మీడియా ముందు చెప్పి వెళ్లిపోయారు. 1994లో కాంగ్రెస్ ప్రభుత్వమే మోడీ కులాన్ని ఓసీ నుంచి బీసీలోకి మార్చిందన్నారు. అంతేకానీ రేవంత్రెడ్డి కామెంట్స్ మాత్రం తప్పు అని చెప్పలేకపోయారు. ఇక మోడీ కులం కన్వర్ట్ గురించి డేట్లతో సహా చెబుతున్న బీజేపీ నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధీటుగా కౌంటర్ ఇచ్చారు. 1994లో కులం మారిందా.. లేక మోడీ సీఎం అయ్యాక మారిందా అనేది పక్కనబెడితే మోడీ మాత్రం పుట్టుబీసీ కాదు అనేది వాస్తవమన్నారు.
2014లో బీసీల్లో మొదలైన పొలరైజేషన్
మోడీ కులం గురించి ఇప్పుడు ఎందుకు అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే 2014లో NDA ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ ఖాయం అయ్యారో దేశవ్యాప్తంగా బీసీల్లో పొలరైజేషన్ మొదలైంది. ప్రధాని అభ్యర్థిగా బీసీ నేత.. అనే నినాదం బాగా వర్కవుట్ అయింది. మోడీకి అనుకూలంగా దేశవ్యాప్తంగా మెజార్టీ బీసీలు ఆయనకు అండగా నిలబడ్డారు అనడంలో నో డౌట్. అందుకే మోడీ క్యాస్ట్ గురించి అందరికీ తెలియాలి అన్నదే కాంగ్రెస్ ఎజెండాగా తెలుస్తోంది. అదేగనుక జరిగితే మోడీ.. బీసీ ముసుగు తొలుగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈలోగా డ్యామేజ్ కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో బీజేపీ నేతలు సీఎం రేవంత్రెడ్డిపై ఫైర్ అవుతున్నారు.
అగ్రనేత ఆదేశాలతోనే రేవంత్ ఇదంతా చేస్తున్నారా?
ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డి మోడీ కులాన్ని ఎందుకు హైలెట్ చేశారు? అగ్రనేత ఆదేశాలతోనే రేవంత్ ఇదంతా చేస్తున్నారా? ఇలా అనేక ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. కానీ ఏదిఏమైనా ముఖ్యమంత్రి కామెంట్స్ తో ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. మోడీ పుట్టుకతో బీసీ కాదు అన్న అంశాన్ని జనాల్లోకి బాగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ ఎందుకు అనుకుంటుంది. నెక్స్ట్ స్టోరీలో చూద్దాం.
మోడీ బీసీనా.. కాదా?
తెలంగాణలో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు అయిపోయాయి. త్వరలో ఎమ్మెల్సీ.. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే మిగిలాయి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో ప్రజాపాలన ఏడాదికిపైగా నడుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రేవంత్ సర్కార్ బీసీ కులగణనను సక్సెస్ ఫుల్గా నిర్వహించింది. ఆల్ ఆఫ్ సడెన్గా సీఎం రేవంత్ రెడ్డి మోడీ కుల ప్రస్తావన ఎందుకు తీసుకువచ్చారు అనేది చర్చనీయాంశంగా మారింది.
బీసీ ముసుగు తొలగించే పనిలో హస్తం పార్టీ
ఒక్క దెబ్బతో రెండు పిట్టలు. కులగణన సర్వే తప్పుల తడక అంటున్న బీఆర్ఎస్.. బీజేపీ నేతల నోళ్లకు సీఎం రేవంత్ రెడ్డి తాళం వేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోనే ఢీలాపడిపోయిన బీఆర్ఎస్.. ఎంపీ ఎన్నికలతో పూర్తిగా జీవచ్ఛవంలా మారిపోయింది. ఉనికి కాపాడుకోవడం కోసమే బావబామ్మర్దులు ఇద్దరూ జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీకి ఉపిరి పోయాలని చూస్తున్నారు. కానీ అవేవి వర్కవుట్ కావడం లేదు. పదేళ్లపాటు రాష్ట్రంలో చక్రం తిప్పిన పార్టీ.. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాల్సిన స్థితికి చేరింది. స్థానిక ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ను చావు దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పావులు కదుపుతోంది.
సర్వేను తప్పులతడక అంటున్న రెండు పార్టీలు
ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి మోడీ కులాన్ని హైలెట్ చేసి.. రాష్ట్రంలో చక్రం తిప్పుదామనుకుంటున్న బీజేపీని డైరెక్ట్గా ఢీకొట్టారు. సీఎం మాటలతో బీజేపీ నేతలు ఒక్కసారిగా రేవంత్ రెడ్డిపై ఫోకస్ పెట్టారు. అలా వారి అటెన్షన్ ను ముఖ్యమంత్రి డైవర్ట్ చేశారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇదంతా కూడా రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన బీసీ కులగణన సర్వేతోనే ప్రారంభమైంది. వాస్తవానికి ఆ సర్వేలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కవిత పాల్గొని.. కేసీఆర్, హరీశ్, కేటీఆర్ ను ఇరకాటంలో పడేసింది. సర్వేలో కవిత మినహా మరెవ్వరూ పాల్గొనలేదు. అందుకే సర్వేను తప్పులతడకగా ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఆ పార్టీకి వంత పాడుతున్న బీజేపీ నేతలకు కళ్లెం వేయడానికి రేవంత్ ఎంచుకున్న అస్త్రమే మోడీ కులం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
MLC ఎన్నికలకు దూరంగా గులాబీపార్టీ
ఈ ఇష్యూలో ఇక బీఆర్ఎస్ ఎలాగూ ఎంటర్ కాలేదు కాబట్టి… జరుగుతున్న పరిణామాలను సైలెంట్గా పరిశీలిస్తోంది. బీజేపీ మాత్రం.. ఇతర పనులు వదిలి రేవంత్ రెడ్డికి కౌంటర్లు ఇచ్చే పనిలో పడ్డారు. మరోవైపు కులగణన సర్వేలో ఎమ్మెల్సీ కవిత పాల్గొనడంపై ఆ పార్టీలోనే భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కవితను చూసైనా కేసీఆర్ అండ్ కో బుద్ది తెచ్చుకోవాలంటున్నారు మంత్రి కోమటిరెడ్డి. బీసీ రిజర్వేషన్లపై చట్టం చేసి పార్లమెంట్ కు పంపిస్తామని.. బీసీ పీఎం అని చెప్పుకుంటున్న మోడీ దాన్ని స్వాగతించాలంటున్నారు.
ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ
కేంద్రంలో ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాన్నాళ్లుగా వినిపిస్తోంది. కానీ మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మోడీ నిజంగానే పుట్టకతో బీసీ అయితే ఓబీసీల కోసం ఏం చేశాడో చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఓసీ మనసత్వం కలిగిన మోడీ ఓబీసీలను తొక్కాలనే చూస్తున్నారని ఆరోపిస్తోంది. అయితే ఇలాంటివాటిపై ఫోకస్ చేయాల్సిన తెలంగాణ బీజేపీ నేతలు.. కేవలం రేవంత్ కామెంట్స్ పైనే దృష్టి పెట్టడాన్ని తెలంగాణ సమాజం అంగీకరించడం లేదు. ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని విమర్శించే హక్కు బీజేపీ నేతలకు లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు.
1994లో ఓసీ నుంచి బీసీలోకి మోడీ కులం
కాంగ్రెస్ స్ట్రాటజీ వర్కవుట్ అవుతోంది. మోడీ బీసీ కాదు అన్న అంశాన్ని జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్న ప్లాన్ ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ విషయంలో రేవంత్ వేసిన వలలో బీజేపీ నేతలు పడ్డారు. వారిచేతనే మోడీ పుట్టు బీసీ కాదు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పించారు. 1994లో మోడీ కులాన్ని ఓసీ నుంచి బీసీలో కలిపారని ఆ పార్టీ నేతలు అంగీకరించే పరిస్థితి నెలకొంది. మోద్ ఘాంచి అనే కులంలో మోడీ పుట్టారని బీజేపీ నేతలు చెబుతున్నారు. మోడీ పుట్టినప్పుడు ఆయన కులం ఓసీ జాబితాలోనే ఉంది.
మండల్ కమిషన్ సిఫారసుతో బీసీలోకి
కానీ.. మండల్ కమిషన్ సిఫారసుతో మోద్ ఘాంచి కులాన్ని గుజరాత్ ప్రభుత్వం ఓబీసీల జాబితాలో చేర్చిందంటున్నారు. వాస్తవానికి మోడీ క్యాస్ట్పై ఇప్పుడు జరుగుతున్న చర్చ కొత్తదేం కాదు. జాతీయస్థాయిలో ఈ రగడ ఎప్పుడో జరిగింది అని చెప్పుకోవాలి. మోడీ కన్వర్టడ్ బీసీ అని రాహుల్గాంధీతో పాటు BSp చీఫ్ మాయావతి కూడా గట్టిగా గళం వినిపించినవారే. కులగణన సర్వే చర్చలోకి అనూహ్యంగా రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ క్యాస్ట్ ను తీసుకురావడంతో డిబేట్ సరికొత్త టర్న్ తీసుకొంది. మరి ఇది ఎవరికి మైలేజ్ ఇస్తుంది అంటే జస్ట్ వెయిట్ అండ్ సీ అని మాత్రమే చెప్పగలం.