Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన బాధ్యతలను కుమారుడు, మంత్రి నారా లోకేశ్కు బదిలీ చేస్తున్నారా? అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే డిఫాక్టో సీఎంగా లోకేశ్ వ్యవహరిస్తున్నారని విపక్షం వైసీపీ ఆరోపిస్తోంది. పేరుకే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారని, కానీ ప్రభుత్వ పాలన అంతా లోకేశ్ కనుసన్నల్లోనే జరుగుతోందని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. అయితే వైసీపీ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ, ఇటీవల పరిణామాలు గమనిస్తే ప్రభుత్వంలో లోకేశ్ ప్రాధాన్యం బాగా పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో మంత్రి నారా లోకేశ్ పోషస్తున్న యాక్టివ్ రోల్పై విస్తృత చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి 11న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 14న రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మార్చి ఏడు వరకు సెషన్స్ నిర్వహించనున్నారు. అసెంబ్లీ, కౌన్సిల్ లో ప్రతిరోజూ బడ్జెట్తో పాటు వివిధ పై అంశాల వారీగా చర్చిస్తున్నారు. ఎప్పటిలాగే వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల జగన్ టీమ్ శాసనసభకు ముఖం చాటేస్తోంది. శాసనమండలిలో వైసీపీకి మెజార్టీ ఉండటంతో అక్కడ ప్రతిపక్ష సభ్యులు తిరుమల కల్తీ నెయ్యి విషయమై హడావుడి చేస్తున్నారు.
శాసనసభ, మండలిల్లో చర్చలు కొనసాగుతున్నా, చర్చల్లో పాల్గొనాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం అసెంబ్లీకే పరిమితమవుతున్నారు. ఈ దఫా సమావేశాల్లో ఒక్క రోజు కూడా ఆయన శాసనమండలిలో కనిపించలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం మండలి సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్య నేతలు ఇద్దరూ శాసనసభ సమావేశాలకు పరిమితం అవుతుండగా, మంత్రి నారా లోకేశ్ మాత్రం ఇటు అసెంబ్లీ, అటు మండలి సమావేశాలకు హాజరవుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
ముఖ్యంగా శాసనమండలిలో సభా నాయకుడు, సీఎం చంద్రబాబు గైర్హాజరుతో ఆ స్థానంలో లోకేశ్ అన్నీతానై చక్రం తిప్పుతున్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభమైన నుంచి లోకేశ్ ఎక్కువగా శాసనమండలి చర్చల్లోనే పాల్గొంటున్నారు. అంతేకాకుండా మండలిలో లోకేశ్తో పాటు ఆర్థిక శాక మంత్రి పయ్యావుల కేశవ్ మాటల దాడికి విపక్షం సైతం సైలెంటు అయిపోతూ, ఎప్పటికప్పుడు వాకౌట్ అస్త్రాన్ని ప్రయోగిస్తూ చర్చల్లో పాల్గొనకుండా తోక ముడుస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా కొన్ని అంశాలపై సీనియర్ నేత, వైసీపీ శాసనమండలి పక్ష అధ్యక్షుడు బొత్స సత్యనారాయాణతో ఢీ అంటే ఢీ అనేస్థాయిలో లోకేశ్ డైలాగ్ వార్ చేస్తుండటం విశేషం.
Also Read: కుప్పం పోలీసుల మెరుపు దాడి.. అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్!
ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి అరెస్టును మండలిలో లోకేశ్ సమర్థించుకున్న తీరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో విపక్షానికి మండలిలో మాత్రమే బలం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మొత్తం మండలి సభ్యుల్లో మూడొంతుల మంది వైసీసీ వారే. టీడీపీ కూటమికి కేవలం పది మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. వీరితోపాటు మరో పది మంది మంత్రుల సాయంతో లోకేశ్ ప్రభుత్వం తరఫు న సమర్థవంతమైన వాదనలు వినిపిస్తున్నారని చెబుతున్నారు.
గత కొంతకాలంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం అంశం ఆంధ్రప్రదేశ్ లో పెను రాజకీయ దుమారం రేపుతోంది. దీనిపై అధికార తెలుగుదేశం కూటమి, వైసీపీ మధ్య మాటల యుద్ధం ఎడతెగకుండా కొనసాగుతోంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక సిట్ లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై దర్యాప్తు చేసి.. కల్తీ వాస్తవమేనని ధృవీకరించింది. అయితే వైసీపీ మాత్రం కల్తీ విషయం అలా ఉంచండి.. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో చంద్రబాబు చెప్పినట్లుగా జంతువుల కొవ్వు లేదుగా అంటూ నానా హంగామా చేస్తోంది. చంద్రబాబు అవాస్తవాలను ప్రచారం చేశారని ఎదురుదాడి మొదలుపెట్టింది. అక్కడితో ఆగకుండా హెరిటేజ్ కు లబ్ధి చేకూర్చడం కోసమే చంద్రబాబు లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వినియోగం అంటూ ఆరోపణలు గుప్పించారంటూ విమర్శలు మొదలు పెట్టింది. ఇందాపూర్ డెయరీతో కలిపి హెరిటేజ్ పై ఆరోపణలు మొదలుపెట్టింది.
దీనిపై శాసనమండలిలో చర్చకు సిద్ధం అని వైసీపీ సవాల్ విసిరింది. ఆ సవాల్ ను స్వీకరించిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. చర్చ మండలిలో కాదు.. మొదట అసెంబ్లీలో చేద్దామంటూ ఈ నెల 24ని ముహూర్తంగా నిర్ణయించింది. అందుకు తగ్గట్లే ప్రభుత్వం వ్యూహాత్మకంగా శాసనసభలో ఆ అంశాన్ని చర్చకు పెట్టింది. దమ్ముంటే సభకు వచ్చి చర్చలో పాల్గొనాలని వైసీపీకి సవాల్ కూడా విసిరింది. అయితే శాసనభలో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి వైసీపీ ముందుకు రావకపోవడంతో లడ్డూ ప్రసాదం తయారీలో వైసీపీ చేస్తున్న వాదనలకు, ఆరోపణలకు విశ్వసనీయత లేకుండా పోయిందంటున్నారు.
11 మంది ఎమ్మెల్యేలే ఉండటంతో అసెంబ్లీకి ముఖం చాటేస్తున్న వైసీపీ… కల్తీ నెయ్యి ఇష్యూపై తమకు తగినంత బలం ఉన్న శాసనమండలిలో చర్చకు పట్టుపట్డింది. దానికి అధికారపక్షం సిద్దమైతే వైసీపీ ఎమ్మెల్సీలు లేనిపోని హడావుడి చేసి సభ జరగకుండా చేశారు. సాధారణంగా ప్రభుత్వం ప్రకటన తర్వాత సభలో లఘుచర్చ ప్రారంభమవుతుంది. అయితే ప్రతిపక్షం మొదటగా మాట్లాడాలని బొత్స పట్టుబట్టారు. మండలి చైర్మన్ కూడా.. ప్రతిపక్షం మొదట మాట్లాడాలన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్..అసలు వివాదంపై ప్రభుత్వం ప్రకటన చేయకుండా ఎలా చర్చిస్తారని సభా నిబంధనలు ప్రస్తావించారు.
దాంతో ఇదే సందనుకుని వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేసి సభ వాయిదా పడేలా చేశారు. సభ వాయిదా తర్వాత బొత్స సత్యనారాయణ కల్తీ నెయ్యిపై చర్చించే వరకూ ఆందోళన చేస్తామని గొప్పగా ప్రకటించారు. ఆ క్రమంలో మండలిలో వైసీపీ సభ్యులు వెంకన్న స్వామి ఫోటోలతో ఆందోళనకు దిగారు. చెప్పులు, బూట్లు వేసుకుని స్వామి వారి ఫోటోలు పట్టుకుని వైసీపీ సభ్యలు మహాపచారం చేశారని కూటమి సభ్యులు ధ్వజమెత్తారు. దాంతో బొత్స తమ వారు అప్పుడు పాదరక్షలు వేసుకోలేదని,దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. దానిపై వెంటనే రియాక్ట్ అయిన లోకేశ్ సంబంధిత వీడియో తన సోషల్ మీడియా వేదికలో రిలీజ్ చేసి వారికి సౌండ్ లేకుండా చేయగలిగారు.
సాధారణంగా సభా నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు మండలిలో అయినా విపక్షం ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సివుంటుంది. అయితే సీఎం గైర్హాజరీలో లోకేశ్ తనదైన వాగ్దాటితో విపక్షాన్ని కంట్రోల్ లో పెడుతున్నారని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంశం ఏదైనా సరే సమగ్ర వివరాలతో లోకేశ్ చర్చించడం ఆకట్టుకుంటోందని అంటున్నారు. అనర్గళంగా ఎటువంటి తడబాటు లేకుండా లోకేశ్ మాట్లాడుతుండటం చూస్తూ విపక్షం సైతం ఆశ్చర్యపోతోందంట.
Also Read: కవిత డిమాండ్.. ఎస్సీ రిజర్వేషన్లపై సర్కార్కు డెడ్ లైన్!
Story by: Apparao, Big Tv