SC Reservations: హైదరాబాద్ బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఎస్సీ ఉప కులాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో.. రాష్ట్రంలోని పెరిగిన జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్లను పెంచాలని.. అదే విధంగా ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోని ప్రభుత్వం తీర్మానం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్ధిక, కుల గణనలో రాష్ట్రంలో ఎస్సీల జనాభా 15 శాతం నుండి 18 శాతానికి పెరిగినట్లు స్పష్టమైందని కవిత పేర్కొన్నారు. పెరిగిన జనాభాకు న్యాయం జరగాలంటే రిజర్వేషన్లను కూడా 18 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. కేంద్ర జనగణన పూర్తయ్యాకే రిజర్వేషన్లు పెంచుతామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. తక్షణమే అసెంబ్లీలో దీనిపై తీర్మానం చేయాలని ఒత్తిడి తెచ్చారు.
ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలు కేవలం విద్య, ఉద్యోగ రంగాలకే పరిమితం కాకూడదని.. రాజకీయ రంగంలోనూ ఉప కులాలకు తగిన రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసే క్రమంలో అన్ని ఉప కులాలకు సమాన అవకాశాలు దక్కాలని, అప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
ఎస్సీ ఉప కులాల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా కుల ధ్రువీకరణ పత్రాల జారీలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలిగించేందుకు తెలంగాణ జాగృతి కృషి చేస్తుందని ఆమె హామీ ఇచ్చారు. దళిత సంఘాలను కలుపుకొని రిజర్వేషన్ల పెంపు కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో దాదాపు 20 ఎస్సీ ఉప కులాలకు చెందిన ప్రతినిధులు పాల్గొని తమ సమస్యలను వివరించారు.
Also Read:అంబర్పేట ఫ్యామిలీ సూసైడ్ మిస్టరీ వీడింది.. నలుగురు ‘వడ్డీ’ రాక్షసులు అరెస్ట్!
ఎస్సీ ఉపకులాల నేతలతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భేటీ
జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ లు పెంచాలి
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ మేరకు తీర్మానం చేయాలి
ఎస్సీ ఉప కులాలకు రిజర్వేషన్ ఫలాలు దక్కాలి
విద్య, ఉద్యోగాల్లోనే కాదు ఉప కులాలకు రాజకీయ రిజర్వేషన్లు సైతం… pic.twitter.com/pzODwsEk3V
— BIG TV Breaking News (@bigtvtelugu) March 2, 2026