Cabinet Expansion: ఎప్పటినుంచో పదవుల కోసం ఎదురు చూస్తున్న కేంద్ర మంత్రివర్గ ఆశావాహులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతోందనే ప్రచారం హాట్ టాపిక్గా మారింది. మంత్రివర్గ విస్తరణకు ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మేనెలలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటున్నారు. ఈ సారి విస్తరణలో కొంతమందికి శాఖల మార్పులు, కొత్తవారికి అవకాశం, మరికొంతమందికి ఉద్వాసన ఉండే అవకాశం ఉందని జరుగుతున్న ప్రచారం ఉత్కంఠ రేపుతోంది.
ఎన్డీఏ కూటమి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చి రానున్న జూన్తో రెండేళ్లు పూర్తికానుంది. ఈ తరుణంలో కేంద్ర కేబినెట్ విస్తరణ, మార్పులు,చేర్పులపై జోరుగా ప్రచారం మొదలైంది. దీంతో కూటమిలో మంత్రివర్గ ఆశవాహుల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. మొదటి మంత్రివర్గ విస్తరణలో భంగపడిన వారు ఈసారైనా తమకు అవకాశం కల్పించాలని ఆదిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారట.
దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీలకి ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి అవ్వగానే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి భారీ ఎత్తున మంత్రివర్గ విస్తరణ చేపడుతోందనేది ఢిల్లీ వర్గాల నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. బీహార్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వంటి సీనియర్ నేతకి కేబినెట్లో చోటివ్వడం ఖాయం అంటున్నారు. ఈ మొత్తం కసరత్తులో ఏపీకి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ వినిపిస్తోంది. కేంద్రంలోని ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో మార్పులు చేర్పులుంటాయనే చర్చ కూడా ఉంది.
మంత్రుల పనితీరు, రాబోయే రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రక్షాళన చేయనున్నారనే టాక్ నడుస్తోంది. 2029 ఎన్నిలే లక్ష్యంగా పార్టీలో ప్రభుత్వంలో కీలక మార్పులు దిశగా ప్రధాని మోడీ కసరత్తు చేస్తున్నారట. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.
మోడీ సర్కార్ 3.0లో తెలుగు రాష్ట్రాలపై కేంద్రం ఫుల్ ఫోకస్ పెట్టింది. తెలుగు రాష్ట్రాలకు మంత్రివర్గంలో సముచిత స్థానం లభించింది, తెలంగాణ నుంచి ఇద్దరికీ, ఏపీ నుంచి ముగ్గురికి కేంద్ర క్యాబినెట్ లో చోటు దక్కింది. దీనికి అదనంగా ఏపీ తెలంగాణ నుంచి కొత్తవారికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేస్తున్నారట. ఏపీలో ఎన్నికల తర్వాత బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురందేశ్వరిని తప్పించి …మాధవ్కు రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పగించారు. ఆ సమయంలోనే బీజేపీ సీనియర్ నేత పురందేశ్వరిని కేబినెట్లోకి తీసుకుంటారనే ప్రచారం జోరుగా నడిచింది. అయితే పొత్తుల లెక్కలు, రకరకాల ఈక్వేషన్స్తో పురందేశ్వరికి కేబినెట్ బెర్త్ దక్కలేదు. అయితే ఈసారి జరిగే విస్తరణలో పురందేశ్వరికి కేబినెట్ బెర్త్ కన్ఫామ్ అనే సంకేతాలు ఢిల్లీ నుంచి వస్తున్నాయట.
రాజమండ్రి బీజేపీ ఎంపీగా ఉన్న పురందేశ్వరీతో పాటు టీడీపీ, జనసేనలకు కూడా కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కే చాన్స్ ఉందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తుంది. టీడీపీ నుండి సీనియర్ నేత, లోక్సభ స్పీకర్గా పనిచేసిన జిఎంసి బాలయోగి కుమారుడు అమలాపురం యువ ఎంపీ హరీష్ బాలయోగికి అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్డీఏ అధికారంలో ఉన్నసమయంలోనే బాలయోగి లోక్సభ స్పీకర్గా పనిచేశారు. బాలయోగి సేవలను పరిగిణలోకి తీసుకుని ..హరీష్ కేబినెట్లో తీసుకునే చాన్స్ ఉందంటున్నారు. ఇక జనసేనకు కూడా క్యాబినెట్ లో చోటు కల్పించాలనే డిమాండ్ ఆ పార్టీ శ్రేణుల నుంచి వినిపస్తోంది. ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ను దృష్టిలో పెట్టుకుని .. ఆ పార్టీ నుంచి ఒకరిని కేబినెట్లోకి తీసుకునే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందట.
కేంద్ర మంత్రివర్గంలో బ్యూరోక్రాట్లే ఎక్కువగా ఉన్నారని ప్రతిపక్షాలనుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోడీ వారందరిని తప్పించే అవకాశం ఉందని కమలనాథులు అంటున్నారు. 2029 ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని తన టీం ని ప్రధాని మోడీ సిద్ధం చేసుకున్నట్లు ఢిల్లీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్ర కేబినెట్ విస్తరణలో మంత్రివర్గంలో ఉన్న వారి శాఖల్లో కూడా మార్పులు ఉంటాయంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కేంద్ర మంత్రులకు సంబంధించి శాఖల మార్పులుంటాయన్న ఉహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు శాఖలు మారుస్తారన్న ప్రచారం సాగుతోంది. ఇక ప్రస్తుతం కేంద్రసహాయ మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ కు ప్రమోషన్ దక్కబోతుందని, స్వతంత్ర హోదా పోర్ట్ పోలియోను కేటాయించే అవకాశం ఉందంటున్నారు.
ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్న రెడ్డి సామాజికవర్గం నుంచి నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి పేరు కూడా ఫోకస్ అవుతోంది. మరి మోడీ టీంలో ఎవరికి అవకాశం దక్కుతుంది, ఎవరు ఉద్వాసనకు గురవుతారు, ఎవరి శాఖల్లో మార్పులు జరుగుతాయి, ఏ రాష్ట్రానికి మంత్రివర్గంలో పెద్దపీట వేస్తారో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Also Read: ఎండలో బయటకు వెళ్తున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Story by: Apparao, Big Tv