Ponguru Narayana: ఒకప్పుడు బడిలో పిల్లల్ని బెత్తం పట్టుకుని కొడితే సైలెంట్ అయ్యేవారు. మారిన కాలంలో పిల్లలు ఇప్పుడు ఊరకుండడం లేదు. అలాంటిది రాజకీయ నేతలు గమ్మున ఎలా ఉంటారు. ప్రస్తుతం అదే జరుగుతుందంట మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు సిటీ నియోజకవర్గంలో. మంత్రి తన పక్కన ఉంటూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న నేతలకు పెట్టే చివాట్లతో వారు భగ్గుమంటున్నారంట. అయిదేళ్లు అష్టకష్టాలు పడ్డాం, అధికార పార్టీలో ఉంటే కాస్త సంపాదించుకోవచ్చు అనుకుంటే ఆ మంత్రి క్లాసులు ఏంటిరా బాబూ అని తెగ ఇదైపోతున్నారంట. నారాయణపై లోలోన కస్సుబుస్సులాడుతున్నారంట. ఇంతకీ మంత్రి నారాయణ ఇలాకాలోని టీడీపీలో ఏం జరుగుతోంది?
ఏపీ మున్సిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణ. ఆయన వ్యాపారవేత్త కూడా. విద్యారంగంతో నారాయణ సంస్థలతో అడుగుపెట్టిన ఆయన ఆ రంగాన్ని శాసించే స్థాయికి ఎదిగారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడిగా మారి రాజకీయాల్లో రాణిస్తూ రెండో సారి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో నారాయణ కీరోల్ పోషిస్తూ ప్రభుత్వంలోనే కీలకంగా మారారు. అంత ప్రాధాన్యత సంతరించుకున్న ఆయనపై సొంత నియోజకవర్గం నెల్లూరు సిటీ టీడీపీ శ్రేణులు చిర్రుబుర్రులాడు తున్నాయంట. ఆయన వైఖరి పార్టీలోని నేతలకు మింగుడు పడడం లేదనే టాక్ నియోజకవర్గంలో నడుస్తోందట. ఇటీవల ఆయన వరుసగా టెలీ కార్ఫరెన్సులు నిర్వహిస్తూ.. తన వెంటే ఉంటూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న సొంత పార్టీ నేతలకు క్లాసులు పీకుతున్నారట. దాంతో తెలుగు తమ్ముళ్లు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారట.
ఇటీవల కాలంలో తరుచూ నియోజకవర్గంలోని నేతలతో మంత్రి నారాయణ టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఒకటి, రెండుసార్లు కాదు పదుల సంఖ్యలో కాన్ఫరెన్స్ లతో నేతలు బేజారెత్తిస్తున్నారట. ఇసుక మాఫియాతో తెలుగు దేశం పార్టీ నేతలకు సంబంధాలు ఉన్నాయని ఇటీవల మంత్రి దృష్టికి వెళ్లినట్లు సమాచారం. దీంతో ఆయన తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టారంట. మీ సంగతి అంతా నాకు తెలుసు, పక్కా సాక్షాలు ఉన్నాయి, అవినీతికి పాల్పడితే సహించేది లేదంటూ లెక్చర్ ఇచ్చారట.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో గత అయిదేళ్లు ఆ పార్టీకి దూరంగా ఉన్న నేతలతో పాటు, వైసీపీ నేతలు కూడా సైకిల్ ఎక్కేందుకు క్యూలు కట్టారు. వారిలో కొందరిని భేషరతుగా, మరికొందరిని కండిషన్లతోనూ నారాయణ పార్టీలోకి తీసుకున్నారు. దాంతో ఒకప్పుడు వైసీపీ అయినా పసుపు కండువాలు కప్పుకోవడంతో అందరూ తెలుగు తమ్ముళ్లగానే మారిపోయారు. వారిలో కొందరు నేతలు ఏ పార్టీ అధికారంలోకి ఉంటే మనకేంటి అన్నట్లు, డబ్బు సంపాదనకు ప్రాధాన్యత ఇస్తూ అందిన కాడకి సంపాదించుకుంటున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయట. ఇసుక మాఫియా, రేషన్ వ్యవహారంలో కూడా వారు తలలు దూర్చుతున్నారంట. పోలీస్ స్టేషన్లలో పంచాయతీలు, సిటీ పరిధిలోని డివిజన్లలో సెటిల్మెంట్లు .. ఇలా అన్ని వ్యవహారాల్లో తామే అయి వ్యవహరిస్తున్నారంటున్నారు. వైసీపీ నుంచి వచ్చిన వారే అత్యధికంగా ఇలాంటి పంచాయతీలకు సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని మంత్రి నారాయణ దృష్టికి రావడంతో ఆయన దిద్దుబాటు చర్యలకు దిగారనే చర్చ నడుస్తోంది.
తమదైన సైలిలో వ్యాపారంతో పాటు రాజకీయాలను కూడా విజయవంతంగా నిర్వహించే మంత్రికి ఇలాంటి నేతలతో పెద్ద తలనొప్పి వచ్చి పడిందన్న టాక్ వినిపిస్తోంది . అయితే క్లాస్ పీకించుకుంటున్న నేతలు లోలోన మదన పడటంతో పాటు, మంత్రి నారాయణ వైఖరిపై గుర్రుగా ఉన్నారట. రాష్ట్రంలో అధికారం మారగానే తాము పార్టీ మారింది నాలుగు రాళ్లు వెనకేసుకోవడానికే కదా అని సహచరులతో ఓపెన్గానే చెప్తున్నారంట. ఇలాంటి విషయాలు కూడా మంత్రి దృష్టికి రావడంతో సున్నితంగా మందలిస్తూ మంత్రి తనదైన శైలిలో నేతలకు డిసిప్లీన్ నేర్పించే ప్రయత్నం చేస్తున్నారంట. అయితే సదరు నేతలు మాత్రం ఇప్పుడు కాకపోతే .. ఇంకెప్పుడు అన్నట్లు వ్యవహరిస్తున్నారంట. మొత్తానికి మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్సులతో ఇస్తున్న క్లాసులు నెల్లూరు సిటీలో హాట్ టాపిక్గా మారాయి.
Also Read: ల్యాబ్లో మంటలు.. కేసుల్లో గుబులు.. ఫోన్ టాపింగ్ రిపోర్టుల పరిస్థితి ఏంటి?