Telangana Politics: కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఇన్చార్జిగా ఉన్నారు. దివంగత ధర్మపురి శ్రీనివాస్ ఉన్నప్పుడు ఆ జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగినప్పటికీ, అప్పట్లో డీఎస్ గులాబీ కండువా కప్పుకోవడంతో కాంగ్రెస్ పట్టు తప్పింది. కాంగ్రెస్ క్యాడర్ భవిష్యత్తుపై నమ్మకం లేక ఇతర పార్టీల్లో చేరడంతో వరుస పరాజయాలు మూటగట్టుకుంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో జిల్లాలో రాజకీయ సమీకరణలు మార్చాలని పట్టుదలగా ఉంది. జిల్లాలో కాంగ్రెస్కు పునర్వైభవం తేవడానికి నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పొలిటికల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి స్కెచ్ గీస్తోందంట. అందులో భాగంగానే డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఉత్తమ్ను కార్పొరేషన్ ఎన్నికల ఇన్చార్జ్గా నియమించారంట. మరి అంత స్పెషల్గా నిజామాబాద్ వచ్చిన ఆ నల్గొండ జిల్లా నేత విజయం కోసం ఎలా వర్కౌట్ చేయబోతున్నారు?
నిజామాబాద్ జిల్లా లో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి పట్టున్న జిల్లా. అయితే నేతల మధ్య సమన్వయ లోపంతో కాంగ్రెస్ పార్టీ కష్ట కాలంలో పడిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల నుంచి అధికారంలోకి వచ్చేవరకు వరుస ఓటములు చవిచూస్తూనే ఉంది. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే కేవలం నాలుగు చోట్ల విజయం సాధించింది. గత నిజామబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు గతంలో జరిగిన ఎన్నికల్లో కేవలం ఇద్దరు ఆంటే ఇద్దరు కార్పొరేటర్లు గెలుపొందారు. అయితే అప్పట్లో కాంగ్రెస్కు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఆ ఇద్దరు గెలవడం విశేషమే.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పరాజయం పాలైంది. ఇవన్నీ గమనిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు అరా తీస్తున్నారంట జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల్లో సమన్వయ లోపాన్ని గుర్తించి.. అది సరిదిద్దడానికి రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగి, నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి నిజామాబాద్ ఆ జిల్లా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారట. ఆ క్రమంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం మంత్రి ఉత్తమ్, టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు విజయమే లక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారట. పార్టీ నేతలను సున్నితంగా వార్నింగులు ఇచ్చారంట. దాంతో ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల్లో పెద్ద చర్చ మొదలైందంటున్నారు. పీసీసీ చీఫ్ది నిజామాబాదే సొంత జిల్లా అవ్వడం గమనార్హం.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలను క్లీన్ స్వీప్ చేయాలని, అందుకు ఇప్పటి నుంచే వర్కౌట్ చేయాలని స్పష్టం చేశారంట. అందుకే కార్పొరేషన్ ఎన్నికల్లో కమిటీలు వేసి గెలిచే వారికి మాత్రమే టికెట్ ఇవ్వాలని, రికమండేషన్లకు తలొగ్గకూడదని నిశ్చయించారంట. గెలుపు గుర్రాల కోసం సర్వేలు సైతం పూర్తి అయ్యయట. ఆ క్రమంలో మున్సిపల్ ఎన్నికట్లో విభజిత నిజామాబాద్ జిల్లాలోని కార్పొరేషన్తో పాటు మూడు మున్సిపాల్టీ పీఠాలను కైవసం చేసుకోవడమే ఉత్తమ్కుమార్ టార్గెట్గా పెట్టుకున్నారంట. చూడాలి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్చార్జి గా ఉన్న నిజామాబాద్ జిల్లా పీసీసీ చీఫ్ సొంత జిల్లా అవ్వడంతో వారు ఏ మేరకు ఫలితాలు సాధిస్తారో?
Story by: Anup, Big Tv