Dharmapuri Arvind: నిజామాబాద్ జిల్లా పేరును ఇందూరుగా మార్చాలని ఎంపీ ధర్మపురి అరవింద్ ఎంచుకున్న కొత్త అస్త్రం రాష్ట్రం రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతుంది. అరవింద్ డిమాండ్కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు మద్దతు పలకడంతో రాజకీయవర్గాల్లో దుమారం రేపింది. అయితే పేరు మార్పుతో అభివృద్ధి జరగదు అంటూ కాంగ్రెస్ మన నిజామాబాద్ మన అభివృద్ధి అంటూ ముందుకు సాగుతోంది. ఇక బీఆర్ఎస్ తాము 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిపై కాంగ్రెస్, బీజేపీ సొంత డబ్బా కొట్టుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. .. ఇంతకీ జిల్లా మార్పు డిమాండ్ మున్నుందు ఎలాంటి ప్రభావం చూపించబోతోంది?
నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తామని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గతంలోనే ప్రకటించారు. ఆ వ్యాఖ్యలు ఇటు రాజకీయపక్షాల్లో, అటు నిజామాబాద్ ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తమ జిల్లా పేరు నిజామాబాద్గా పెట్టడం వల్లే దురదృష్టం వచ్చిందని, ఆ పేరులోనే నష్టం ఉందని అరవింద్ సెంటిమెంట్ రగిల్చే పనిలో పడ్డారు, అరవింద్ వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచంద్రరావు కూడా మద్దతు తెలపడం విశేషం. బీజేపీ అధికారంలోకి వస్తే నిజామాబాద్ పేరును ఖచ్చితంగా ‘ఇందూరు’గా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు. చారిత్రమైన ఇందూరు పేరే నిజామాబాద్కు ఉండాలని బీజేపీ పట్టుబడుతోంది.
నిజాం పాలన ఆనవాళ్లను తొలగించి, చారిత్రక వారసత్వాన్ని పునరుద్ధరించడమే తమ లక్ష్యమని బీజేపీ అంటుంటే…. మత తత్వ ప్రచారం చేయడం మంచి సంస్కృతి కాదంటూ కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజనల్లో బీజేపీ కార్పొరేటర్ టికెట్ ఆశావహులు ‘మన ఇందూరు మన మేయర్’ అంటూ గోడలపై రాతలు రాస్తుంటే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ అభివృద్ధి చేస్తామని, బీఆర్ఎస్ ఏమో పదేళ్లలో జరిగిన అభివృద్ధి చూసి ఓట్లు వేయాలని ప్రచారంలో ముందుకు వెళ్తున్నాయి.
ఇక మజ్లీస్ పార్టీ ఈ ఎన్నికలు జరిగేవి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి తప్ప ఇందూరుకు కాదని చెప్పుకొస్తుంది. ఇలా నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్కో పార్టీ ఒక్క నినాదంతో ముందుకు వెళ్తుంటే బిజెపి ఎంచుకున్న నినాదం, కొంత మేర ఒక వర్గాన్ని ఆలోచింపచేస్తోందంట. అదే విధంగా మరో వర్గంలో తీవ్ర వ్యతిరేకత రేకెత్తిస్తోందంటున్నారు. అయతే బీజేపీ పోటీ చేసే 40 స్థానాల్లో ఎక్కువ స్థానాలు గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఇందూరు నినాదం ప్లస్ అవుతుందని లెక్కలు వేసుకుంటోందంట.
ఇక నిజామాబాద్ జిల్లా పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ సొంత జిల్లా. మరోవైపు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కార్పొరేషన్ ఎన్నికల ఇన్చార్జిగా ఉన్నారు. గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కి నష్టం జరుగుతుంది కాబట్టి ఈసారి ఎన్నికల్లో కార్పొరేషన్తో పాటు జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలని వారు ఆర్డర్ పాస్ చేశారట. ఆ క్రమంలో బిజెపి ఎంచుకున్న ఇందూరు నినాదం కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తి రేపుతోంది.
Story by: Apparao, Big Tv