PM Modi: తెలంగాణ ఎంపీల నిర్లక్ష్య వైఖరిపై ప్రధాని మోడీ సీరియస్ అయ్యారంట. తెలంగాణలో పార్టీ ఎందుకు వెనుకబడుతోందని బీజేపీ నేతలకు ప్రధాని మోడీ క్లాస్ పీకారంట. 8 మంది ఎంపీలున్నా ప్రధాన ప్రతిపక్షంగా ఎదగలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారంట. తెలుగు ఎంపీలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ సందర్భంగా మోడీ ఫుల్ సీరియస్ అయినట్లు చెప్తున్నారు. ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నా తెలంగాణలో వెనకబడటంపై ప్రధానిఅసంతృప్తి వ్యక్తం చేశారంట. ఇకనైనా విబేధాలు వీడి ఉమ్మడిగా పనిచేయాలని హితవు పలికారంట..
తెలంగాణ బీజేపీ ఎంపీల తీరుపై మోడీ అసంతృప్తి
తెలంగాణలో బీజేపీ ఎంపీలు అనుసరిస్తున్న తీరుపై ప్రధాని మోడీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఢిల్లీ టాక్. పార్లమెంటు జరుగుతున్న సమయంలో వివిధ రాష్ట్రాల ఎంపీలతో ప్రధాని మోడీ సమావేశమవుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకొని పార్టీ ఎంపీలు వ్యవహరించాల్సిన తీరుపై మార్గనిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలతోను ప్రధాని భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించట్లేదని ఎంపీలపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
పార్టీ నేతలు సరిగా పనిచేయట్లేదని తీవ్ర అసహనం
దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో తెలంగాణలో బీజేపీ బలహీనంగా ఉందనే భావనను ప్రధాని వ్యక్తం చేసినట్లు కమలం నేతలు మాట్లాడుకుంటున్నారట. తెలంగాణలో పార్టీకి మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ.. పార్టీ నేతలు సరిగా పనిచేయట్లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారంట. నేతల మధ్య విభేదాలు పెరిగాయనే విషయాన్ని ఎంపీల దృష్టికి తీసుకువచ్చినట్లు టాక్. 8 మంది ఎంపీలున్నా కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారంటున్నారు. తన అంచనా ప్రకారం బీజేపీ పట్ల తెలంగాణ ప్రజల్లో ఎంతో ఆదరణ ఉన్నా.. నాయకులు పనిచేయకపోవడం వల్లనే పార్టీ పరిస్థితి దారుణంగా తయారైందని ప్రధాని అభిప్రాయపడ్డారంట.
నాయకత్వ తీరుపై ఇంకేంత అసంతృప్తిగా ఉన్నారో?
తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయనే విషయాన్ని ఎంపీలకు గుర్తి చేశారట ప్రధాని. కానీ తెలంగాణాలో ఎందుకు వెనుకబడిపోతున్నారని ప్రశ్నించారట. తెలంగాణలో పార్టీ గ్రాఫ్ పెరిగేందుకు మంచి అవకాశం ఉన్నా.. అందిపుచ్చుకోవడంలో పార్టీ నాయకులు విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారంట. ఎంపీల పనితీరుపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేయడం బీజేపీలో హాట్ టాపిక్గా మారింది. ఎంపీలపైనే ఇంత సీరియస్గా ఉంటే….నాయకత్వ తీరుపై ఇంకేంత అసంతృప్తిగా ఉన్నారనే చర్చ పార్టీ నేతల్లో నడుస్తుందట.
రాష్ట్రంలో పరిస్థితుల నిశితంగా పరిశీలిస్తున్న ఢిల్లీ పెద్దలు
ఎన్నికల తర్వాత రాష్ట్ర బీజేపీలో నడుస్తున్న పరిణామాలు చర్చకు దారితీస్తున్నాయి. నేతల మధ్య సమన్వయం లేకపోవడం…తరుచూ నేతలు పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించినట్లు చేస్తున్న వ్యాఖ్యలపై పార్టీలో రచ్చ జరుగుతుంది. కొంత కాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై అధిష్టానం పెద్దలు అసంతృప్తిగా ఉన్నారనే విషయాన్ని ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చిన నాయకులు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. నేతల మధ్య గల్లీలో జరుగుతున్న కుమ్మలాటను కూడా ఢిల్లీ పెద్దలు గమనిస్తున్నారనే విషయాన్ని కూడా సృష్టంగా చెప్పారు. పార్టీలో జరుగుతున్న ప్రతి విషయాన్ని అధినాయకత్వం ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉందని చెబుతూ వస్తున్నారు. అయినా నేతల తీరు మారడంలేదనే చర్చ నడుస్తుందట.
Also Read: ఎట్టకేలకు తగ్గుతున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?
ఎంపీలపై గుస్సా అయిన మోడీ గుస్సా.. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉండగా మీపెత్తనం ఏంటి.. అధ్యక్షుడంటే లెక్కలేదా..? అని వారిపై మండిపడ్డారంట. ఆ క్రమంలో సెల్ఫ్ పబ్లిసిటీ రాజకీయాలు, ప్రసంగాలు మానుకోవాలని ఢిల్లీలో మోడీ క్లాస్ పీకిన తర్వాత కూడా….ఉమ్మడి కరీంనగర్లో జిల్లాలో బండి సంజయ్, ఈటల రాజేందర్ల మధ్య ఫైట్ చర్చకు దారితీస్తోంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ వేదికగా బండి, ఈటెల వర్గీయులు దుమ్మెత్తి పోసుకున్నారు. మోడీనే కాదు ఎవరు చెప్పినా తమ తీరు మారదన్నట్లు వ్యవహరిస్తున్నారు. మరి తాజాగా నేతలకు బీఎల్ సంతోష్ ట్రీట్మెంట్.. మోడీ ట్రీట్మెంట్లతో నేతలు మారతారా..? లేదో చూడాలి.
Story By Rami Reddy, Bigtv