New Bride Suicide: హైదరాబాద్ లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పెళ్లి జరిగి కేవలం మూడు నెలలే గడవకముందే ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రొద్దుటూరుకు చెందిన చందన జ్యోతికి కొత్తగూడెంకు చెందిన యశ్వంత్తో.. మూడు నెలల క్రితం వివాహం జరిగింది. వివాహానంతరం యశ్వంత్ ఉద్యోగరీత్యా హైదరాబాద్లోని మూసాపేటలో నివాసం ఉంటుండగా, చందన జ్యోతి కూడా అతనితో కలిసి అక్కడే ఉంటోంది. యశ్వంత్ మెడ్ప్లస్ (MedPlus) అనే ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
అయితే ఇటీవల కాలంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. చిన్న చిన్న విషయాలకే మనస్పర్థలు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ గొడవల కారణంగా చందన జ్యోతి తీవ్ర మనస్తాపానికి గురైందని పోలీసులు అనుమానిస్తున్నారు.
గత రాత్రి ఇంట్లో బెడ్రూమ్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. చాలా సేపటికి కూడా ఆమె బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన భర్త యశ్వంత్ తలుపులు తట్టినా స్పందన రాలేదు. వెంటనే 108కు ఫోన్ చేసి సహాయం కోరాడు. తలుపులు తెరిచి చూడగా చందన జ్యోతి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.
తక్షణమే ఆమెను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో యశ్వంత్ తో పాటు ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, వారి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇది ఆత్మహత్యా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
Also Read: టెట్ పరీక్ష రాసేందుకు వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి
చందన జ్యోతి కుటుంబ సభ్యులు మాత్రం వివాహం అనంతరం.. తమ కుమార్తె మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాకే మృతికి గల అసలు కారణం తేలుతుందని అధికారులు తెలిపారు.