Vizianagaram: రాజుగారి ఇలాకాలో పొలిటికల్ గేమ్స్. ఇదీ.. ఇప్పుడు విజయనగరం జిల్లాలో జోరుగా వినిపిస్తున్న టాక్. పదవుల కోసం ఏనాడూ పాకులాడని అశోక్గజపతిరాజు జిల్లాలో రాజకీయ క్రీడలంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఇంతకీ.. అలాంటి ఆరోపణలు రావటానికి కారణాలేంటి? జిల్లా అసోషియేషన్లో ఏం జరుగుతోంది. వాచ్ దిస్ స్టోరీ.
క్రికెట్ ఆటకి.. మన దేశంలో ఉండే క్రేజే వేరు. క్రికెట్ను ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కులం , మతం, ప్రాంతాలతో సంబంధం లేకుండా టాలెంట్ ఉన్నవారినే టీమ్లోకి తీసుకుంటారు. ఇంతటి ప్రాచూర్యం కలిగిన క్రికెట్ ఆటను నడిపించాలంటే సమర్ధులైన నాయకులు అవసరం అనేది అందరికీ తెలిసిందే. కొన్నేళ్లుగా ఆటలో కూడా రాజకీయాలు ప్రవేశించడం షరా మూమూలుగా మారింది. విజయనగరం జిల్లాలో జరిగిన ఘటనలు విమర్శలకు దారి తీస్తున్నాయి. BCCI నుంచి జిల్లా క్రికెట్ అసోసియేషన్ వరకూ అందరిదీ ఒకటే పంథానా అనుకునే స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశం.. నేతలతో పాటు అటు ప్లేయర్స్కూ తలనొప్పిగా మారిందట. జిల్లా క్రికెట్ అసోసియేషన్ను విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అసోసియేషన్గా మార్చేశారనే వార్తలు.. జిల్లా వ్యాప్తంగా గుప్పుమంటున్నాయి.
ఐతే.. ఈ విమర్శలు ఆశామాషీగా రావడం లేదని అసోసియేషన్ సభ్యుల పేర్లు పరిశీలిస్తే ఠక్కున తెలిసిపోతుందని కూటమి నాయకులు చెవులు కోరుక్కుంటున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ వారు.. అసోసియేషన్ను తమ చెప్పు చేతల్లో ఉంచుకోవడం సంప్రదాయబద్ధంగా వస్తున్నదే . కానీ ఆ సంప్రదాయం మరీ ఇంత ఘోరంగా ఉంటుందా అన్నట్లుగా పరిస్థితి మారిందని నేతల టాక్. అసోసియేషన్ను ఓసారి పరిశీలిస్తే.. జిల్లా ప్రెసిడెంట్ గా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, వైస్ ప్రెసిడెంట్ వెంకట లక్ష్మీపతిరాజు , కార్యదర్శి సీతారామరాజు, జాయింట్ సెక్రటరీ దంతులూరి సీతారామరాజు , కోశాధికారి సూర్యనారాయణవర్మ, అపెక్స్ మెంబర్గా పిన్నింటి సంతోష్, ప్లేయర్ మెంబర్ కొండపల్లి పైడితల్లి నాయుడు ఉన్నారు.
మొత్తం ఏడుగురు సభ్యులలో.. ముగ్గురు కాపు , నలుగురు క్షత్రియులు ఉన్నారు. ఇందులో ఇద్దరు సంతోష్, పైడితల్లి నాయుడు.. స్వయానా మంత్రి కొండపల్లి బంధువులేననే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మిగిలిన వారిని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు సిఫారసుతో నియమించారట. ఇక్కడవరకూ బాగానే ఉన్నా.. అదితి, మంత్రి కొండపల్లికి తప్ప మిగిలిన ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత లేదా అనే విమర్శలు వస్తుండగా.. సామాజిక న్యాయం అంటూ ఇదేనా అంటూ మరికొందరు పెదవి విరుస్తున్నారట.
Also Read: రవికుమార్ను కాపాడుతున్న వైసీపీ..? తిరుమల దోపిడి ఎలా బయటపడింది?
పదవులు కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్న కొందరు కూటమి నేతలు.. ఒకడుగు ముందుకేసి.. ఎంపీ కలిశెట్టి డమ్మీ ప్రెసిడెంట్ అని ఆరోపణలు చేస్తున్నారట. ప్రెసిడెంట్ను డమ్మీగా ఉంచి.. వైస్ ప్రెసిడెంట్తో.. అసోసియేషన్ కార్యకలాపాలను నడిపిస్తారని చర్చ జోరుగా సాగుతోంది. మచ్చలేని అశోక్ గజపతి ఇలాకాలో ఇలాంటివి జరగడమేంటని కొందరు ప్రశ్నిస్తునారు. వారికి నచ్చిన వారిని పెట్టుకున్నప్పటికీ.. కనీసం సామజిక న్యాయం పాటించకపోవడం దారుణామంటూ ఇంకొందరు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారట. కూటమిలో మిగిలిన పార్టీలకు కనీసం విలువ ఇవ్వలేదనే చర్చ జోరుగా జరుగుతోంది. ఇదంతా.. అశోక్ గజపతికి తెలియకుండా జరిగిందని.. ఎమ్మెల్యే అదితి గజపతిని కొందరు సైడ్ ట్రాక్ పట్టించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏనాడూ పదవుల కోసం వెంపర్లాడని క్షత్రియులు.. వేరొకరికి పదవులు ఇప్పించడం కోసం తామెందుకు చెడ్డపేరు తెచ్చుకుంటున్నారు అనే వాళ్లూ లేకపోలేదు. కాబట్టి.. ఈ వివాదాలకు పెద్దాయన ఎలాంటి పుల్స్టాప్ పెట్టిస్తారనే అంశం ఉత్కంఠగా మారింది. కూటిమిలో తెలుగుదేశం పార్టీతో పాటు ఉన్న జనసేన. బీజేపీ నేతలకూ అవకాశాలు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలూ వినిపిస్తున్న నేపథ్యంలో మార్పు చేర్పులు ఉంటాయా.. లేక.. తాము పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అనే ధోరణిలో ఉంటారా అనేది ఆసక్తిగా మారింది.