Party Sidelines: రాఘవ్ చద్దా, అన్నామలై! దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతున్న పేర్లు ఇవి. మొన్నటిదాకా తమ తమ పార్టీల్లో మెరుపులా మెరిశారు ఈ ఇద్దరు యువ నేతలు. రాఘవ్ చద్దా.. ఆమ్ ఆద్మీ పార్టీ గొంతుకగా నిలిస్తే, అన్నామలై.. తమిళనాడులో బీజేపీకి ఊపిరి పోశారనే చర్చ ఉంది. వీళ్లిద్దరూ ఇప్పుడు తమ సొంత పార్టీల్లోనే సైడ్ లైన్ అయ్యారనే చర్చ.. దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. రాజకీయాల్లో వేగం ఎంత ముఖ్యమో, వ్యూహం అంతకంటే ముఖ్యమని వీళ్లిద్దరి పరిస్థితి నిరూపిస్తోంది.
ఢిల్లీ రాజకీయాల్లో అరవింద్ కేజ్రీవాల్కు అత్యంత నమ్మకస్తుడిగా, పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా రాఘవ్ చద్దా ఓ వెలుగు వెలిగారు. ముఖ్యంగా, పంజాబ్ ఎన్నికల్లో పార్టీ విజయం వెనుక అతనిదే కీరోల్ అనే టాక్ ఉంది. కానీ, కొన్నాళ్లుగా పార్టీలో ఆయన ప్రాభవం తగ్గుతూ వస్తోంది. ఏకంగా రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ హోదా నుంచి ఆయన్ని తొలగించడం పెను సంచలనంగా మారింది. ఎందుకంటే, రాఘవ్ చద్దా కొంతకాలంగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు.
సామాన్యుల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. మొబైల్ రీఛార్జ్ విషయంలో ప్రైవేట్ టెలికాం కంపెనీల దోపిడీపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలు.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయ్. జెన్ జీ యువతకు బాగా కనెక్ట్ అయింది. ఇక, మెట్రో నగరాల్లో ట్రాఫిక్ సమస్య, మినిమన్ బ్యాలెన్స్ పేరుతో బ్యాంకుల్లో సామాన్యులకు ఎదురవుతున్న ఇబ్బందులపై రాజ్యసభలో ప్రశ్నలు లేవనెత్తారు. ఈ రకంగా దూసుకుపోతున్న రాఘవ్ చద్దాకు ఆప్ ఒక్కసారిగా షాకిచ్చింది. రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించింది. దాంతో.. అంతా ఆశ్చర్యపోయారు.
రాఘవ్ చద్దా విషయంలో పార్టీ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు రావడంతో.. ఆప్ స్పందించింది. రాఘవ్ కొన్నేళ్లుగా సభలో ప్రధానికి వ్యతిరేకంగా గళమెత్తడానికి వెనుకాడుతున్నారని ఆరోపించింది. పార్టీ కంటే సొంత ఇమేజ్ మీదే ఫోకస్ ఎక్కువైందని తెలిపింది. దేశ సమస్యల గురించి కాకుండా సమోసాల గురించి మాట్లాడుతున్నారని ఆప్ తెలిపింది. గుజరాత్లో ఆప్ కార్యకర్తలను అరెస్ట్ చేస్తే.. దాని గురించి మాట్లాడలేదని, ప్రధాన ఎన్నికల కమిషనర్కు వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానంపై సంతకం చేయడానికి తిరస్కరించారని, పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసినా.. ఆయన సభలోనే ఉంటున్నారని.. ఆప్ విమర్శించింది.
రాఘవ్ చద్దా ప్రవర్తనతో.. కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పింది. ఇక, పార్టీ కోటా నుంచి రాఘవ్ చద్దాకు సభలో మాట్లాడే సమయం కేటాయించొద్దని కూడా ఆప్ రాజ్యసభ సెక్రటేరియట్కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఆప్ సంక్షోభంలో ఉన్నప్పుడు రాఘవ్ చద్దా వ్యూహాత్మక మౌనం పాటించడం, కేజ్రీవాల్ జైలు నుంచి రిలీజయ్యాక.. బహిరంగ సభలకు దూరంగా ఉండటం పార్టీ అధిష్టానానికి నచ్చనట్లు తెలుస్తోంది. పార్టీలోని ఇతర నేతలు బీజేపీపై విమర్శలు ఎక్కుపెడుతుంటే, రాఘవ్ మాత్రం పార్లమెంటులో కేవలం సాఫ్ట్ ఇష్యూస్ మీదే మాట్లాడుతున్నారని, మోడీ ప్రభుత్వంపై గతంలో ఉన్నంత దూకుడు చూపడం లేదని పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.
తనపై ఆప్ నేతలు చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలనీ రాఘవ్ చద్దా చెబుతున్నారు. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకొస్తాయన్నారు. ప్రజల పన్ను డబ్బులతో నడిచే పార్లమెంటుకు ఆ ప్రజల సమస్యలు లేవనెత్తడానికే తాను వెళతానని, గొడవలు పెట్టుకోడానికి కాదని చెప్పారు. తనను టార్గెట్ చేసి ఓ ప్లాన్ ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఆప్ నేతలు తనపై చేసిన ఆరోపణలన్నింటిని.. రాఘవ్ చద్దా ఖండించారు.
ఎవరూ లేవనెత్తని సమస్యలను.. రాఘవ్ చద్దా రాజ్యసభలో మాట్లాడటంతో.. జనం దృష్టిలో హీరోలా కనిపించాడు. ఎంపీ అంటే ఇలా ఉండాలిరా? అనే ఇమేజ్ వచ్చింది. దాంతో.. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయ్యారు. ప్రజల్లో సహజంగానే కొన్ని విషయాల్లో ఉంటే అసహనాలనే.. రాఘవ్ చద్దా ఆయుధాలుగా మార్చుకొని కొంతకాలంగా ప్రశ్నలు కురిపిస్తూ వస్తున్నాడు. ఈ కొత్తదనమే అందరినీ ఆకర్షించింది. రాఘవ్ చద్దా లేవనెత్తిన అంశాలను.. ఏ పార్టీ ఎంపీ కూడా గతంలో లేవనెత్తిన సందర్భాలు లేవు కాబట్టే.. అతను న్యూట్రెండ్ లీడర్గా ఎక్స్పోజ్ అయ్యాడు. అతను రైజ్ చేసిన ప్రశ్నలన్నీ.. జెన్ జీని ఆకర్షించేవే. అతని పొలిటికల్ టార్గెట్ కూడా జెన్ జీని ఆకట్టుకోవడమే కావొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
ఏ పొలిటికల్ లీడర్.. ఏం చేసినా తన పాపులారిటీ కోసమే! అందులో.. పబ్లిక్ ఇంట్రస్ట్, ఫేవర్ కూడా ఉంటే.. పాపులారిటీ చాలా తక్కువ టైమ్లోనే వచ్చేస్తుంది. నిజానికి, రాఘవ్ చద్దా.. ఆమ్ ఆద్మీ పార్టీ లైన్ కన్నా, తన లైన్లో మాట్లాడటం, పార్టీ ఎక్స్పోజర్ కన్నా.. సెల్ఫ్ ఎక్స్పోజర్కే ప్రాధాన్యత ఇస్తున్నాడని అనిపించడం సహజమే. అయితే, పార్టీ కమిట్మెంట్ కన్నా, జనం పట్ల అతనికి ఉన్న కమిట్మెంట్కే ప్రశంసలు వస్తున్నాయ్. అందుకే.. ఆప్ అంతే వేగంగా డెసిషన్ తీసుకుంది. పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి సైడ్ చేసేసిందనే చర్చ జరుగుతోంది. ఇకపై.. ఆమ్ ఆద్మీ పార్టీకి, రాఘవ్ చద్దాకు మధ్య సంబంధాలు ఎలా ఉంటాయనేది కూడా ఆసక్తి రేపుతోంది.
ఢిల్లీలో రాఘవ్ చద్దా వెనుక రాజకీయం అలా ఉంటే.. తమిళనాడులో అన్నామలై చుట్టూ తిరుగుతున్న రాజకీయం మరోలా ఉంది. ఇది.. తమిళనాడునే కాదు, మొత్తం ఇండియానే ఆశ్చర్యపరిచింది. తమిళనాడులో సింగంగా పేరు తెచ్చుకున్న అన్నామలై.. అక్కడ బీజేపీకి ఊహించని మైలేజ్ తెచ్చారు. ద్రవిడ రాజకీయాల మధ్య కాషాయ జెండాను ఎగరేసిన ఆయన.. ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో లేకపోవడమే అందరినీ అవాక్కయ్యేలా చేసింది. తమిళ గడ్డపై బీజేపీని ఓ లైన్లోకి తెచ్చిన అన్నామలైని.. పార్టీ సడన్గా ఎందు సైడ్ లైన్ చేసింది?
తమిళనాడు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగి, సింగం అని పిలిపించుకున్న అన్నామలై.. ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ద్రవిడ కోటలో కాషాయ జెండాను రెపరెపలాడించిన నాయకుడు, బీజేపీకి నమ్మకస్తుడైన అన్నామలై.. ఉన్నట్టుండి ఎందుకు సైడ్ లైన్ అయ్యారు? దీని వెనుక ఉన్న రాజకీయ కోణాలేంటి? అనేది.. ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే, తమిళనాడులో బీజేపీని ఓ శక్తిగా నిలబెట్టిన అన్నామలై, ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. దీనిపై సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ అనేక చర్చలు నడుస్తున్నాయి. మరెన్నో కారణాలున్నాయ్.
గతంలో అన్నామలై దూకుడు వల్ల.. అన్నాడీఎంకే-బీజేపీ మధ్య పొత్తు చెడిపోయింది. అన్నామలై నేరుగా జయలలిత, అన్నాదురై లాంటి నేతలపై విమర్శలు చేయడంతో.. అన్నాడీఎంకే ఆగ్రహించింది. కానీ, ఈ ఎన్నికల్లో అధికార డీఎంకేని ఓడించాలంటే.. అన్నాడీఎంకేతో కలవడం కంపల్సరీ అని బీజేపీ అధిష్టానం భావించింది. దాంతో.. అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి, అన్నామలై నాయకత్వంలో పొత్తుకు ఒప్పుకోనట్లు తెలుస్తోంది. ఆయన దూకుడు తగ్గిస్తేనే.. పొత్తు కుదురుతుందనే సంకేతాలిచ్చారు. దాంతో.. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా, అన్నామలైని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి, మెతగ్గా ఉన్న నైనార్ నాగేంద్రకు బాధ్యతలు అప్పగించింది బీజేపీ హైకమాండ్.
అన్నాడీఎంకేతో కుదిరిన సీట్ల సర్దుబాటు విషయంలోనూ అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. బీజేపీకి కేటాయించిన 27 సీట్లు పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో లేవని, గెలిచే అవకాశం ఉన్న చోట్ల అన్నాడీఎంకే తన అభ్యర్థులనే నిలబెట్టిందనే చర్చ కూడా జరుగుతోంది. 30 ఏళ్లుగా అన్నాడీఎంకే బలంగా ఉన్న సింగనల్లూర్ నియోజకవర్గం నుంచి అన్నామలై ఈసారి పోటీ చేద్దామనుకున్నారు. పొత్తులో భాగంగా ఈసారి సింగనల్లూర్లో బీజేపీ నుంచి అన్నామలై గెలుపు ఖాయమని అంతా భావించారు. కానీ, ఈ సీటు అన్నాడీఎంకేకే వెళ్లింది.
ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోనని.. తానే స్వయంగా అధిష్టానానికి లేఖ రాసినట్లు తెలిపారు. గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత.. పార్టీలో అన్నామలై మీద అభిప్రాయాలు మారాయి. అతనిపై వచ్చిన ఇంటర్నల్ రిపోర్ట్స్, ఇతర కారణాలతో.. ఎన్నికల నుంచి అతన్ని తప్పించారని.. పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. మరోవైపు.. క్యాస్ట్ ఫ్యాక్టర్ కూడా అన్నామలైని దెబ్బకొట్టిందనే చర్చ వినిపిస్తోంది. తమిళ రాజకీయాల్లో.. గోండర్ కులం చాలా కీలకం. అన్నామలైది, అన్నాడీఎంకే చీఫ్ పళని స్వామిది కూడా గోండర్ కులమే. దాంతో.. పళని స్వామే.. అన్నామలైని సైడ్ లైన్ చేసేలా పావులు కదిపి ఉంటారనే చర్చ కూడా జరుగుతోంది.
మరోవైపు.. అన్నామలై లాంటి స్టార్ క్యాంపెయినర్ ఒకే నియోజకవర్గానికి పరిమితమైతే.. అతని ప్రభావం తగ్గిపోతుందని, ఆయన్ని రాష్ట్రవ్యాప్తంగానూ, పొరుగు రాష్ట్రాలైన కేరళ, పుదుచ్చేరిలోనూ స్టార్ క్యాంపెయినర్గా వాడుకోవాలని బీజేపీ ప్లాన్ చేసింది. తన తండ్రి అనారోగ్య కారణాల వల్ల.. తాను పూర్తి సమయం కేటాయించలేనని చెప్పినా, బీజేపీ అతన్ని ఒక క్రౌడ్ పుల్లర్గా ప్రచారానికే పరిమితం చేసిందంటున్నారు. అన్నామలైని పక్కన పెట్టడం వల్ల బీజేపీకి జరిగే నష్టం ఎక్కువే ఉంటుందంటున్నారు.
సింగం ఇమేజ్తో యువతని బీజేపీ వైపు తిప్పిన అన్నామలై బరిలో లేకపోతే, ఆ ఓట్లు విజయ్ టీవీకే పార్టీకి మళ్లే అవకాశం ఉందనే అంచనాలున్నాయ్. పార్టీ క్యాడర్లోనూ ఉత్సాహం తగ్గే అవకాశాలున్నాయ్. అన్నాడీఎంకేతో పొత్తు కోసం.. అన్నామలై లాంటి ఫైర్ బ్రాండ్ లీడర్ని సైడ్ చేయడం వల్ల.. తమిళనాడులో సొంతంగా ఎదగాలనే బీజేపీ ఆశయానికి గండి పడొచ్చంటున్నారు. ఏదేమైనా, అన్నామలైని సైడ్ చేయడమనేది.. బీజేపీ తీసుకున్న బిగ్ రిస్క్. పొత్తు కోసం పవర్ఫుల్ లీడర్ని సైడ్ చేసిందా? భవిష్యత్తులో ఆయనకు ఢిల్లీ స్థాయిలో పెద్ద పీట వేయబోతోందా? అనేది.. త్వరలోనే తేలుతుంది.
అటు ఢిల్లీలో రాఘవ్ చద్దా, ఇటు తమిళనాడులో అన్నామలై.. కథలు వేరైనా.. రాజకీయం అనేది ఓ చదరంగం లాంటిదని మరోసారి ప్రూవ్ అయింది. వీళ్లిద్దరూ సొంత తప్పిదాలతో పార్టీకి దూరమయ్యారా? పార్టీలే వీళ్లని పక్కనపెట్టాయా? అనేది తేలడానికి పెద్దగా సమయం పట్టదంటున్నారు. పార్టీ ప్రయోజనాల కోసం అధిష్టానం ఎంతటి కఠిన నిర్ణయమైనా తీసుకుంటుందని ప్రూవ్ అయింది.
Also Read: ఎట్టకేలకు బయటకు వచ్చిన ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ.. నేరుగా వార్ రూమ్లోకి ఎంట్రీ, ఏఐ అంటూ..
Story by: Anup, Big Tv