Siddipet: డీసీసీ ప్రకటనతో ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అగ్గి రాజుకుంది. ఆ మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్ష పదవి కోసం వేసిన స్కెచ్ ఫలించలేదనే టాక్ ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. ఎంత ప్రయత్నం చేసినా చివరికి మాత్రం ప్రత్యర్థి వర్గ నేత పైచేయి సాధించడంతో మరో వర్గానికి అస్సలు మింగుడు పడటం లేదట? ఇప్పుడు ఆయన వ్యతిరేక వర్గం ఏం చేయబోతోంది? పంచాయతీ ఎన్నికలకి ముందు ఈ గ్రూపుల గోల ఎటువైపు మలుపు తిరగనుంది? ప్రస్తుతం ఇదే టెన్షన్ ఆ జిల్లా కాంగ్రెస్ నేతల్లో మొదలైందట. ఇంతకీ ఆ జిల్లా ఏంటి? ఆ నేతలు ఎవరు?
కొత్తగా డీసీసీలను అనౌన్స్ చేసింది కాంగ్రెస్ హైకమాండ్. పంచాయతీ ఎన్నికల ముందు పదవులు కట్టబెడితే క్రమశిక్షణగా పనిచేస్తారనుకున్నారు అగ్రనేతలు. అయితే చాలా జిల్లాల్లో పదవులు ఆశించి.. దక్కని వారంతా ఇప్పుడు రగిలిపోతున్నారట. ఇప్పుడీ లిస్ట్లో సిద్ధిపేట జిల్లా కూడా చేరినట్టు తెలుస్తోంది. మాములుగానే సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే. కానీ పార్టీలో గ్రూపులు గొడవలు మాత్రం వీధిలో పడి తన్నుకునే స్థాయిలో.. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కే స్థాయిలో ఉన్నాయట. గత కొన్ని నెలలుగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.. వర్గాలుగా పార్టీ విడిపోయి కత్తులు దూసుకునే పరిస్థితి నెలకొందనే టాక్ వినిపితోంది. నర్సారెడ్డిపై సొంత పార్టీ నేతలే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసి కేసులు పెట్టిన పరిస్థితి చూశాం. ఈ గ్రూపు తగాదాలు తీవ్ర స్థాయికి చేరి పిడిగుద్దుల వరకూ వెళ్లింది. డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డే స్వయంగా దాడి చేశారంటూ ఆరోపణలు చేశారు మైనంపల్లి వర్గీయులు. ఏకంగా నర్సారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఈ పంచాయితీ అప్పుడు పీసీసీ వద్దకు చేరింది. క్రమశిక్షణ కమిటీ పలుమార్లు ఈ అంశంపై నర్సారెడ్డితో భేటీ కూడా అయ్యింది.
ఇది కాసేపు పక్కన పెడితే ఈ సారి డీసీసీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే ఏకంగా 128 వచ్చాయట. అయితే వచ్చింది 128 దరఖాస్తులు అయినా పోటీ మాత్రం నర్సారెడ్డి, మైనంపల్లి వర్గాల మధ్యే ఉందనేది ఓపెన్ సీక్రెట్ అంటున్నారు ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు. తమ వర్గాలకు చెందిన నాయకులకు డీసీసీ పోస్ట్ ఇప్పించేందుకు పోటీ పడ్డారట ఈ ఇద్దరునేతలు. ఎట్టి పరిస్థితిల్లోనూ ఈ సారి డీసీసీ పోస్ట్ నర్సారెడ్డికి దక్కొద్దని మైనంపల్లి వర్గం పావులు కదిపినట్లు ప్రచారం జరిగింది. ఈ సారి అధ్యక్ష పదవి కోసం నర్సారెడ్డి కూతురు ఆకాంక్షరెడ్డి, పీసీసీ నేత శ్రావణ్ కుమార్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు విజయ్కుమార్, సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ తీవ్రంగా ప్రయత్నించారట. ఫైనల్గా పదవి మాత్రం ఆకాంక్షరెడ్డినే వరించింది. మహిళ, యువ నాయకురాలు కావడం ఆమెకు కలిసి వచ్చినట్టు తెలుస్తోంది.
నర్సారెడ్డికి డీసీసీ పోస్ట్ ఇవ్వొద్దని మైనంపల్లి వర్గం ఎంత యత్నించినా సఫలం కాలేదట. ఇంతలా వ్యతిరేకించిన పోస్ట్ ఎలా వచ్చిందని మైనంపల్లి వర్గం ప్రస్తుతం డైలమాలో పడిందట. నర్సారెడ్డి ఈ విషయంలో పెద్ద లాబీయింగ్ చేశారని ఆయన వ్యతిరేక వర్గం లెక్కలు వేసుకుంటుందట. ఇక ఇదిలా ఉంటే నర్సారెడ్డిపై అసమ్మతిగా ఉన్న నాయకులు హైదరాబాద్లో సమావేశమై.. మరొకరి పేరు పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారట. సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ, గజ్వేల్ కాంగ్రెస్ నేత బండారు శ్రీకాంత్, కాంగ్రెస్ జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షుడు విజయ్ తో పాటు మరికొంతమంది నాయకులు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది. మొదట ఈ అంశంపై పీసీసీకి ఫిర్యాదు చేయాలనుకుని జిల్లా నుంచి భారీగా జనసమీకరణతో గాంధీ భవన్కి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకు ఓ వాట్స్ఆప్ గ్రూపును కూడా క్రియేట్ చేసి దానికి ఆపరేషన్ ఏ అని పేరు కూడా పెట్టుకున్నారట నేతలు.
నర్సారెడ్డిపై ఎన్ని ఆరోపణలు ఉన్నా మరోసారి డీసీసీ పోస్టు ఆయన కూతురికే దక్కింది. సిద్దిపేట జిల్లా ఏర్పడినప్పటి నుంచి నర్సారెడ్డే ఆ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన కూతురి వంతు వచ్చింది. మరి కొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు. అసలే జిల్లాలో అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఈ గ్రూపు కలహాలు క్యాడర్ని కలవరపెడుతున్నాయట. ప్రతిపక్ష BRS బలంగా ఉన్న జిల్లాలో ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు యత్నిస్తే పార్టీకి తీవ్ర నష్టం తప్పదని క్యాడర్ టెన్షన్ పడుతుందట. కాంగ్రెస్ హైకమాండ్ వెంటనే ఇరు వర్గాలకు సర్దిచెప్పి సయోధ్య కుదురుస్తుందా..?లేదా? అనే ఆందోళన సామాన్య కార్యకర్తలో కనిపిస్తుందట. మరి సిద్దిపేట కాంగ్రెస్ పార్టీలో హైటెన్షన్ మొదలుకాకముందే హైకమాండ్ హ్యాపీ ఎండ్ ఇస్తుందా..? లేదా వేచి చూడాలి.
Story by Vamshi, Big Tv