వెయ్యి రోజుల పాటు అసెంబ్లీకి రాకుండా ఫామ్హౌజ్లోనే ఉంటున్నారని ఓ మాజీ సీఎంను అధికార పార్టీ నిరసిస్తున్న తీరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు వస్తోంది. కేసీఆర్ రాజీనామా చేయాలనే డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది. బీఆరెస్ .. వెయ్యి రోజల పాలన ఫెయిలయిందనే అంశాన్ని జనాల వద్దకు తీసుకుపోయేందుకు డిసైడ్ కావడం.. అధికార పార్టీని రెచ్చగొట్టినట్టైంది.
అందుకే కేసీఆర్ను టార్గెట్ చేశారు రేవంత్. అందుకే పోటాపోటీగా నిరసనలకు దిగారు. ఇద్దరిదీ ఒకే కాన్సెప్ట్. వెయ్యి రోజులు. ఒకరిదేమో పాలన ఫెయిల్. మరొకరిది ప్రధాన ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావడం లేదనే కారణం. అయితే కేసీఆర్ మధ్యలో ఓ సారి బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారంతే. ఆ తరువాత అటువైపు రాలేదు.
తాజాగా కేటీఆర్.. ఇకపై తన తండ్రి, కేసీఆర్అసెంబ్లీలో అడుగే పెట్టరని, సీఎంగానే ఎంట్రీ ఇస్తారనే ప్రకటించేశారు. అంటే.. ఇక్కడ కేసీఆర్ బదులు.. కేటీఆర్ తన తండ్రి తరపున అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారన్నమాట. తమిళనాడు, తెలుగు రాష్ట్రాల రాజకీయాల చరిత్రను చూస్తే.. మాజీ సీఎంలు అసెంబ్లీని బహిష్కరించి వెళ్లిపోయిన దాఖలాలు.. శపథం పూని, తిరిగి సీఎంగా ఎంట్రీ ఇచ్చిన సందర్బాలే ఉన్నాయి.
నాడు (1989) ఎన్టీఆర్ కూడా రెండోసారి ఓడినప్పుడు.. అసెంబ్లీలో తనకు అవమానం జరిగిందని ఐదేండ్ల పాటు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. ఆ తరువాత ఆయన అసెంబ్లీకి రాలేదు. కానీ ఆయన చైతన్య రథం ద్వారా జనాల్లో తిరిగి మళ్లీ టీడీపిని అధికారంలోకి తెచ్చారు. సీఎంగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ఆ తరువాత చంద్రబాబు కూడా అసెంబ్లీలో (2021) తనకు జరిగిన అవమానానికి రోధించారు. అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. 960 రోజుల మిగిలిన జగన్ పాలనలో ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. శపథం చేసినట్టుగానే తిరిగి సీఎంగా అసెంబ్లీకి వచ్చారు. బాబు చేతిలో ఘోర పరాభవం పాలై 11 సీట్లకే పరిమితమైన మాజీ సీఎం జగన్ కూడా అసెంబ్లీలో తనకు ప్రతిపక్షహోదా ఇవ్వలేదనే కోపంతో సమావేశాలను బహిష్కరించారు. ఇప్పటి దాకా ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. దాదాపుగా 780 రోజులుగా సాగుతున్న కూటమి పాలనలో జగన్ అసెంబ్లీలో అడుగు పెట్టలేదు.
జయలలితది వీరందరికీ భిన్నం. ఆమె అప్పటికి సీఎంగా లేరు. డీఎంకే సీఎంగా ఉన్న కరుణానిధి నేతృత్వంలో మార్చి 25 1989న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఓ డీఎంకే ఎమ్మెల్యే ఆమెపై దురుసుగా ప్రవర్తించారు. దాడికి తెగబడి, చీరలాగే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె చెరిగిన జుట్టు, చిరిగిన చీరతో బయటకు వచ్చి భీష్మ ప్రతిజ్ఞ చేశారు. కౌరవ సభను తలపించే ఆ అసెంబ్లీకి సీఎంగానే అడుగు పెడతానని ప్రతిజ్ఞ చేసి, మాట నిలబెట్టుకున్నారు. అఖండ విజయం సాధించి సీఎంగా గెలిచారు. ఆ తరువాత ఆమె ఆరు సార్లు తమిళనాడు సీఎంగా చేశారు.
ఇప్పుడు కేసీఆర్ ఇలాంటి తరహాలో బహిష్కరణ, ప్రతిజ్ఞలేవీ చేయకున్నా.. కేటీఆర్ మాత్రం కేసీఆర్కు ఇలాంటి పరిస్థితిని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ హుందా రాజకీయాలు చేయడం లేదని, అందుకే ఆయన రావడం లేదన్న కేటీఆర్.. సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతారని చెప్పడం.. ఓ రకంగా ఆయన ప్రతిపక్ష నేతగా ఇక అసెంబ్లీకి రాడనే సూచనే చేసినట్టయ్యింది..