Singanamala TDP: కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక శింగనమల టీడీపీలో విభేదాలు తరచూ బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పుడా రాజకీయం కేవలం విమర్శలరు, ఆరోపణలకే పరిమితం కాకుండా.. క్షుద్ర పూజలు, చేతబడుల వరకు వెళ్ళిందనే ప్రచారం కలకలం రేపుతోంది. టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి వర్సెస్ స్థానిక టీడీపీ నేతల మధ్య గ్యాప్ ఏ స్థాయికి చేరిందంటే.. ఒకరిని ఒకరు రాజకీయంగానే కాదు, వ్యక్తిగతంగా కూడా దెబ్బతీసుకోవాలనే స్థాయికి వెళ్ళిందంట. అసలు శింగనమల టీడీపీలో ఏం జరుగుతోంది? బహిర్గతమైన నిమ్మకాయలు, పసుపు, కుంకుమల వెనుక ఉన్న అసలు కథ ఏంటి?
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఎస్సీ నియోజవర్గం శింగనమల టీడీపీలో వర్గ పోరు కొత్తేమీ కాదు. అయితే, ఎన్నికల తర్వాత అది మరింత ముదిరి పాకాన పడింది. శింగనమల ఎమ్మెల్యే శ్రావణి ఒంటెత్తు పోకడలు పోతున్నారని, సీనియర్ నాయకులను, పాత క్యాడర్ను పట్టించుకోవడం లేదనేది ఒక వర్గం ఆరోపణలు చేస్తోంది. పదవుల పంపకంలో పట్టించుకోవడం లేదని, స్థానిక పెత్తనం విషయంలో ఎమ్మెల్యే తన అనుచరులకే ప్రాధాన్యత ఇస్తున్నారని పాత క్యాడర్ గుర్రుగా ఉన్నారు.. దాంతో క్షేత్రస్థాయిలో ఉన్న బలమైన నేతలు ఇప్పుడు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఏకమవుతున్నారు.
ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తితో ఉన్న వారికి అధిష్టానం వద్ద పలుకుబడి ఉన్న కొందరు కీలక నేతల మద్దతు కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్ధితుల్లో కొత్తగా ఎమ్మెల్యే అయిన బండారు శ్రావణి, ఆమె అసమ్మతి నేతల మధ్య సమన్యాయానికి టీడీపీ అధిష్టానం ఎప్పుడో టూ మెన్ కమిటీని నియమించింది. అయితే ఇటీవల టూ మెన్ కమిటీ సమావేశంలో రెండు వర్గాల మధ్య విభేదాలపై ఎలాంటి విషయాలు చర్చకు రాలేదంట… దాంతో అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో క్షుద్ర పూజలు జరుగుతున్నట్లు ప్రచారం కలకలం రేపుతోందంట
రాజకీయ వైరం కాస్తా ఇప్పుడు ‘మూఢనమ్మకాల’ వైపు మళ్ళడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఎమ్మెల్యే శ్రావణిని మానసికంగా, శారీరకంగా దెబ్బతీయడానికి ప్రత్యర్థి వర్గం క్షుద్ర పూజలకు పాల్పడుతోందనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది… ఎమ్మెల్యే నివాసం సమీపంలో లేదా ఆమె వెళ్లే దారుల్లో వింత వింత వస్తువులు, పూజా సామాగ్రి కనిపిస్తుండటం కలకలం రేపుతోంది… ఈ పరిణామాలపై ఎమ్మెల్యే శ్రావణి వర్గీయులు గట్టిగానే స్పందిస్తున్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి నీచమైన పనులకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు, ఇక పార్టీ ఈ అంతర్గత కుమ్ములాటలు, చేతబడి ఆరోపణలు చివరకు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉండటంతో అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది….
రాజకీయం అంటే ప్రజా సేవ.. కానీ శింగనమలలో అది ‘ప్రతీకార సేవ’గా మారుతోందా? శ్రావణి దూకుడుకు బ్రేకులు వేయడానికి సొంత పార్టీ వారే స్కెచ్ వేస్తున్నారా? ఈ ‘మంత్ర-తంత్రాల’ వార్ మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
Also Read:
Story by: Apparao, Big Tv