Gadwal News: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని 4 మున్సిపాలిటీలలో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఓటర్లు వార్డులలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐదు గంటల లోపు పోలింగ్ కేంద్రంలోకి చేరిన వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. దివ్యాంగులు, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక ర్యాంపుల ఏర్పాటుతో పాటు వీల్ చైర్ లను ఏర్పాటు చేశారు.గద్వాల పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. జిల్లా కలెక్టర్ గద్వాల పట్టణంలోని మూడవ వార్డులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. గద్వాల మాజీ ఎమ్మెల్యే భరత్ సింహారెడ్డి 29వ వార్డులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Also Read: KTR Allegations: ‘మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం’.. కాంగ్రెస్పై విరుచుకుపడ్డ కేటీఆర్
గద్వాల మున్సిపాలిటీలో మొత్తం 37 వార్డులకు గాను 74.57 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక్కడ మొత్తం 65,282 ఓటర్లకు గాను 48,679 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోనే అత్యధికంగా ఐజ మున్సిపాలిటీలో 84.69 శాతం పోలింగ్ నమోదైంది. వడ్డేపల్లి 84.26 శాతం ఓటింగ్ నమోదైంది. అలంపూర్ మున్సిపాలిటీలో 81.18 శాతం ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. గద్వాల మున్సిపాలిటీలో పోలింగ్ ప్రారంభంలో పోలింగ్ శాతం కాస్త మందగించిన క్రమంగా పుంజుకుంది. ఎక్కడ ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాస్ రావు తో కలిసి మున్సిపాలిటీలలో జరిగిన పోలింగ్ పరిశీలించారు. పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం ఇప్పుడు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూములకు తరలించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 13 న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.