Hidma: మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా హతం. బీజాపూర్ అడవుల్లో గ్రేహౌండ్స్, కోబ్రా ఆపరేషన్లో మావోయిస్ట్ కేంద్రకమిటీ సభ్యుడు హిడ్మా చనిపోయాడంటూ బ్రేకింగ్ న్యూస్. అన్ని న్యూస్ ఛానెల్స్ లోనూ ఒకేసారి బ్రేకింగ్స్ నడిచాయి. మనకు ఆర్కే తెలుసు, గణపతి తెలుసు.. జంపన్న తెలుసు.. మరి ఎవరీ హిడ్మా? అంటూ ఒక్కసారిగా అటెన్షన్. న్యూస్ ను బట్టి అతనో టాప్ మావోయిస్ట్ అని మాత్రం తెలుస్తోంది. నిజమే. అతను మామూలు మావోయిస్టు కాదు. తక్కువ కాలంలోనే కేంద్రకమిటీ సభ్యుడిగా ఎదిగిన కింగ్ పిన్. గెరిల్లా దాడుల్లో ఆరితేరిన ఇండియన్ ఛేగువేరా. భద్రతాదళాలను ముప్పుతిప్పలు పెట్టిన ఖతర్నాక్ కామ్రేడ్. అతని గురించి తెలిస్తే.. రోమాలు నిక్కబొడవడం ఖాయం.
పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ-PLGA. మావోయిస్టు దళాల్లో స్పెషల్ టీమ్. మనకు NSG, బ్లాక్ క్యాట్, కోబ్రా, గ్రేహౌండ్స్ లాంటి పవర్ ఫుల్ విభాగాలు ఎలాగో.. మావోయిస్టుల్లో గెరిల్లా ఆర్మీ అలా. ఆ PLGAకి కమాండరే హిడ్మా. అంటే అర్థం చేసుకోవచ్చు అతనెంత ఖతర్నాకో.
గెరిల్లా ఆర్మీ సభ్యులు అత్యాధునిక ఆటోమేటిక్ ఆయుధాలను వాడతారు. భద్రతా దళాలపై మెరుపు దాడులు చేయడమే ఈ టీమ్ పని. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకొని.. మోడ్రన్ గన్స్, బాంబ్స్ తో సుశిక్షితులైన గెరిల్లా టీమ్ తో.. చాలాఏళ్లుగా పోలీసులకు, కోబ్రా దళాలకు చుక్కలు చూపిస్తోంది ఈ PLGA. అంతా హిడ్మా డైరెక్షన్ లోనే దాడులు.
ఎక్కడ దాడి చేయాలో.. ఎలాంటి పేలుడు పదార్థాలు ఏ డైరెక్షన్ లో పేల్చాలో.. ఎలా రిట్రీవ్ అవ్వాలో.. ఇలా పకడ్బందీ గెరిల్లా దాడులు రచించి, అమలు చేయడంలో హిడ్మా ఎక్స్ పర్ట్ అని చెబుతున్నారు. పక్కా ప్లాన్డ్ గా దాడులు చేస్తారు కాబట్టే.. హిడ్మా బృందం చేసిన అటాక్స్ లో మావోయిస్టుల వైపు ప్రాణ నష్టం అతితక్కువగా ఉంటుందని అంటారు. హిడ్మా చేసిన దాడుల్లో పలుమార్లు భద్రతా దళాలు భారీగా ప్రాణ నష్టాన్ని చవిచూశాయి. 2017లో చేసిన ఆ దాడిలో ఒకేసారి 23 మంది సీఆర్పీఎఫ్ బలగాలను చంపేశాడు. 2010లో దంతేవాడ మెరుపు దాడితో 76 మంది సీఆర్పీఎఫ్ బలగాలను మట్టుబెట్టడం వెనుక మాస్టర్ మైండ్ కూడా హిడ్మానే అంటారు. 2013లో జీరం వ్యాలీలో అంబుష్ అటాక్ చేసి పలువురు కాంగ్రెస్ సీనియర్ లీడర్లను బలిగొన్నాడు. హిడ్మా తలకు 40 లక్షల రివార్డు ఉంది. అతనిపై 26 కేసులు ఉన్నాయి.
అతని మిలట్రీ ఆపరేషన్స్ కు మెచ్చే.. అత్యంత తక్కువ సమయంలోనే కేంద్ర కమిటీలో హిడ్మాకు స్థానం కల్పించారు మావోయిస్టులు. తెలుగువారు కాకుండా ‘సుక్మా’ ప్రాంతం నుంచి ఈ స్థాయికి ఎదిగిన తొలి వ్యక్తి హిడ్మా. చురుగ్గా ఉండే హిడ్మా.. చదివింది పదో తరగతే అయినా.. మంచి ఇంగ్లీష్ మాట్లాడుతాడని చెబుతారు.
హిడ్మాకు కర్నాటక సరిహద్దు అడవులపై మంచి పట్టు ఉందంటారు. అతని నెట్ వర్క్ ను వీరప్పన్ తో పోల్చుతారు. ఆదివాసి తెగకు చెందిన వాడే కావడంతో.. స్థానికుల నుంచి హిడ్మాకు మంచి మద్దతు ఉండేది. అడవి బిడ్డలతో బలమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకొని.. అతను ఉన్న ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల అవతల భద్రతా దళాల కదలికలు కూడా తనకు తెలిసేలా జాగ్రత్తలు తీసుకునేవాడు. ఛత్తీస్గడ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు ఈజీగా, త్వరగా చేరుకునే కీలకమైన జంక్షన్లో ఉన్న ‘సుక్మా’ అడవులను అడ్డాగా చేసుకుని హిడ్మా ఏళ్ల పాటు భద్రతా దళాలపై గెరిల్లా దాడులకు పాల్పడ్డాడు.
PLGA దాడులతో తీవ్ర ప్రాణ నష్టాన్ని చవిచూసిన భద్రతా బలగాలు.. హిడ్మా కోసం కొంతకాలంగా గట్టి నిఘా వేసి ఉంచారు. ఆనాడు వీరప్పన్ ను ట్రాప్ చేసిన విధంగానే.. ఈసారి హిడ్మా ఆచూకీ పక్కాగా సేకరించారు. అతను ఫలానా ప్రాంతంలో ఉన్నాడని నిర్థారించుకున్నాక.. ఒకేసారి సీఆర్పీఎప్ కోబ్రా టీమ్స్, తెలంగాణ గ్రేహౌండ్స్ దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఆకాశ మార్గాన హెలికాప్టర్లతోనూ వెంటాడి.. వేటాడాయి. మావోయిస్టుల గెరిల్లా ఆర్మీపై.. వారి స్టైల్ లోనే గెరిల్లా దాడి చేశాయి. మోస్ట్ వాంటెడ్ హిడ్మాను హతమార్చామని అనుకున్నాయి. కానీ, ఆ దాడిలో హిడ్మా చనిపోలేదని మావోయిస్టులు ప్రకటించడంతో భద్రతా బలగాల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది. చిక్కడు..దొరకడు టైప్ లో తప్పించుకుంటున్న హిడ్మాను వేటాడటం ఎలా? అనే డైలమాలో పడిపోయింది.