BJP : తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకూడదని భావిస్తోంది. మరోవైపు బలమైన నేతలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి మర్రి శశిధర్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంది. అలాగే మునుగోడు ఉపఎన్నికల సమయంలో బూర నర్సయ్య గౌడ లాంటి నేతలకు కాషాయ కండువా కప్పింది.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని ఈ మధ్య ప్రచారం బాగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ తీవ్రంగా స్పందించారు. అసలు అలాంటి ఆలోచనే లేదని తేల్చేశారు. రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన కొన్ని రాజకీయ పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. పొత్తు కోసం అర్రులు చాస్తున్నాయని పరోక్షంగానే టీడీపీపై సెటైర్లు వేశారు. గురువారం జరిగిన ఓ అనధికార సమావేశంలో తాను పరోక్షంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా.. చేసినట్లు ఓ సెక్షన్ మీడియా కథనాలు రాసిందని తరుణ్ చుగ్ మండిపడ్డారు. పార్టీకి దురుద్దేశ్యాలు ఆపాదించే లక్ష్యంతోనే ఆ కథనం సృష్టించినట్లు అర్థమవుతోందని అన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ను ఓడించేంత బలం బీజేపీకి ఉందని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో తమ పార్టీనే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. పొత్తు పుకార్లను సృష్టించొద్దంటూ మీడియాకు విజ్ఞప్తి చేశారు.