Jeevan Reddy: సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి టి. జీవన్రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పెద్దాయన భవిష్యత్ కార్యాచరణ, ఆయన అడుగులు ఎటు అనే అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన గులాబీ బాస్కేసీఆర్తో ఇప్పటికే మంతనాలు సాగించి, గులాబీ కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో బీజేపీ నేతలు జీవన్రెడ్డితో టచలోకి వెళ్లి మంచి ఆఫర్ ఏదో ఇచ్చారన్న ఊహాగానాలు మొదలవ్వడం ఆసక్తి రేపుతోంది. ఇంతకీ ఆ జగిత్యాల సీనియర్ ఏ గూటికి చేరబోతున్నార?
జగిత్యాల కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్రెడ్డి పార్టీకి రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ విధానాలకు విరుద్ధంగా తెలంగాణ కాంగ్రెస్ నడుస్తోందని జీవన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న సంతోషం లేకుండా చేశారని మండిపడ్డారు. 20 నెలలుగా పార్టీలో మానసిక వేదనకు గురైనట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
పార్టీ ఫిరాయింపుల అంశంలో రాహుల్ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర నాయకత్వం ప్రవర్తిస్తోందని టి.జీవన్ రెడ్డి మండిపడ్డారు. హైకమాండ్ తీరు, పార్టీలోకి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను తీసుకున్న కారణంగానే మనస్తాపంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ కష్టార్జితమని.. పదేళ్లు తమను ఇబ్బంది పెట్టిన వారిని తీసుకువచ్చి పార్టీలో చేర్చుకుంటారా? అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయాలు జాతీయస్థాయిలో ప్రభావితం చూపబోతున్నాయని.. ‘జై భీమ్-జై సంవిధాన్-జై బాపు’ నినాదాలకు తూట్లు పొడిచారంటూ విమర్శించారు. కాంగ్రెస్ను వీడటం బాధగా ఉన్నా తప్పడం లేదన్నారు.
జీవన్ రెడ్డి తదుపరి రాజకీయ అడుగు ఏంటన్నది హాట్టాపిక్గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. జీవన్రెడ్డిని జగిత్యాలలో సంజయ్ కుమార్ వరుసగా రెండు సార్లు ఓడించారు. తమను పదేళ్లుగా వేధింపులకు గురిచేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కాంగ్రెస్ కండువా కప్పడాన్ని జీవన్రెడ్డి జీనర్ణించుకోలేకపోయారు. ఆ క్రమంలో గత కొన్ని నెలలుగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ వ్యవహారాలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆయన బహిరంగంగానే విమర్శించారు.
ఇటీవల జరిగిన పురపాలక ఎన్నికలు ఈ అసంతృప్తికి తారాస్థాయిని చేర్చాయి. 50 వార్డులున్న జగిత్యాలలో తన అనుచరులకు కేవలం 17 టికెట్లు మాత్రమే రావడం జీవన్ రెడ్డి అసంతృప్తిని మరింత పెంచింది. పార్టీ కోసం సంవత్సరాలుగా పని చేసిన తమ వర్గీయులకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని, . అంతేకాకుండా, గెలిచిన వారిలో తన వర్గానికి చెందిన వారిని ఛైర్పర్సన్ పదవికి ఎంపిక చేయాలని కోరినా అధిష్ఠానం స్పందించకపోవడం ఆయనను మరింత నిరుత్సాహానికి గురి చేసింది.
కాంగ్రెస్పార్టీ నాయకత్వంపై కూడా జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కంటే పార్టీ మారిన ఎమ్మెల్యేకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన భావించారు. ఈ నేపథ్యంలో పలుమార్లు పార్టీపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆయనతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నం చేశారు. అలాగే మంత్రి శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాలకు వచ్చి పార్టీని వీడవద్దని కోరారు. అయినా జీవన్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
జీవన్ రెడ్డి కాంగ్రెస్ను వీడటానికి ముందు కొంతకాలం స్వతంత్రంగా కొనసాగుతానని సంకేతాలు ఇచ్చారు. అయితే ఇతర రాజకీయ పార్టీలు ఇప్పటికే ఆయనపై దృష్టి సారించాయి. జీవన్రెడ్డి సైతం గులాబీ పార్టీ పెద్దలతో మంతనాలు సాగించారన్న ప్రచారం జరిగింది. బీఆర్ఎస్లో చేరితే మంచి ప్రాధాన్యం ఇస్తామని ఆయనకు హామీ లభించిందంట. కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆయనను భుజాలపై మోసుకొస్తానని ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
జగిత్యాలలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరడంతో, జీవన్రెడ్డి అక్కడ బీఆర్ఎస్కు పెద్దదిక్కుగా మారతారని భావించారు. ఇక ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకోవడం లాంఛనమే అనుకుంటున్న తరుణంలో బీజేపీ నేతలు కూడా జీవన్ రెడ్డిని తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో పడ్డారంట.. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆయన బీజేపీలో చేరితే పార్టీకి లాభమని భావిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్లో మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పని చేసిన జీవన్రెడ్డికి జగిత్యాలతో పాటు ధర్మపురి, చొప్పదండి నియోజకవర్గాల్లో సొంత అనుచరగణం ఉంది. అది తమకు ప్లస్ అవుతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారంట.
ప్రస్తుతం జీవన్రెడ్డి ముందు మూడు ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి. స్వతంత్రంగా కొనసాగడం, బీఆర్ఎస్లో చేరడం లేదా బీజేపీలోకి వెళ్లడం. ఆయన వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తు మాత్రమే కాకుండా, జగిత్యాల ప్రాంతీయ రాజకీయ సమీకరణాలపై కూడా ఆయన నిర్ణయం ప్రభావం చూపనుంది. అయితే ఆయన తుది నిర్ణయం పూర్తిగా అనుచరుల అభిప్రాయాలపైనే ఆధారపడి ఉందంటున్నారు. మొత్తానికి జీవన్ రెడ్డి ఇప్పుడు అటు బీఆర్ఎస్ – ఇటు బీజేపీ నుంచి వచ్చిన ఆఫర్లతో ఎటు వైపు అడుగులు వేస్తారనేది ఆసక్తి కరంగా మారింది.
Also Read: మతం మారినట్లు ఎలా నిరూపిస్తారు? కోర్టులు పరిగణనలోకి తీసుకునే సాక్ష్యాలివే!