Telangana BJP: తెలంగాణలో కాషాయ దళం.. అధికారమే లక్ష్యంగా భారీ వ్యూహాలతో అడుగులు వేస్తోందా..? టార్గెట్ 2028 అనే నినాదంతో పని చేయాలని… కేంద్ర నాయకత్వం నుంచి రాష్ట్ర నాయకులకు సంకేతాలు అందుతున్నాయా..? ఢిల్లీ నుంచి తరుచూ రాష్ట్రానికి వస్తున్న నాయకులు తెలంగాణ కమల కార్యకర్తలకు ఎలాంటి లక్ష్యాలను నిర్దేశిస్తూ…కర్తవ్వబోధ చేస్తున్నారు.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాషాయ పార్టీ పావులు కదుపుతోంది. 2028లో గద్దెనెక్కడమే లక్ష్యంగా పనిచేయాలనే దిశగా బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారట. కేంద్రం నుంచి వస్తున్న పెద్దలు..వరుసగా కీలక సమావేశాలు నిర్వహిస్తూ అందరి మైండ్లో టార్గెట్ను ఫిక్స్ చేస్తున్నారట. పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో వరుసగా భేటీలు నిర్వహిస్తూ…రానున్న రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ఎలా పనిచేయాలని నేతలకు స్పష్టంగా దిశానిర్దేశం చేస్తున్నారట.
ఇటీవల తెలంగాణలో పర్యటించిన బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్..2028లో విజయమే టార్గెట్గా పెట్టుకుని పనిచేయాలని కమలదళానికి ఆదేశించారట. ఎంపీలు, ఎమ్మెల్యేలతో విడి విడిగా సమావేశమైన ఆయన.. కలిసికట్టుగా ముందుకు సాగాలని సూచించారు. ఎవరికి వారుగా వెళ్తే, పార్టీకే కాదు, వ్యక్తిగతంగా నేతలు కూడా నష్టపోతారని ఆయన కఠినంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘోర ఓటమిపై తీవ్ర నిరాశ చెందారట బీఎల్ సంతోష్. ఈ ఫలితాలపై నేతలు ఆత్మసమీక్ష చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. పార్టీకి కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు.. కేవలం కార్యాలయాలకు పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో జనంలోకి వెళ్లాలని ఆదేశించినట్లు సమాచారం. నేతలు తమ పనితీరుతో పార్టీ పదవులకు వన్నె తీసుకురావాలని హితవు పలికినట్లు చెబుతున్నారు.
మరోవైపు కష్టపడి పనిచేసే నేతలకు తీపికబురు చెప్పారు అధిష్టానం దూత. పార్టీ బలోపేతం కృషి చేసేవారికి కేంద్ర పార్టీ ఖచ్చితంగా గుర్తింపు, అవకాశాలు ఇస్తుందని భరోసా ఇచ్చినట్లు సమాచారం. పార్టీ అప్పగించిన పని చేస్తూ పోతే వారికి ఎలా న్యాయం చేయాలో హైకమాండ్ చూసుకుంటుందని హామీ ఇచ్చారట.
ఇక పార్టీపైనే విమర్శలు చేసేవారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. పార్టీ లైన్దాడి ప్రవర్తిస్తే..ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకుంటామన్నారట. అధ్యక్షుడు రామచందర్రావుకు గౌరవం ఇవ్వకపోయినా..ఆయన్ను లైట్ తీసుకున్నా..ఊరుకోబోమని చెప్పినట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రణాళికా బద్దంగా ముందుకుపోవాలని బీఎల్ సంతోష్ సూచించారట. గ్రామాల్లో పట్టు సాధించేలా పార్టీ క్యాడర్ను బలోపేతం చేయాలని.. వారిని లీడర్లుగా తయారు చేసుకోవాలని సలహా ఇచ్చారట. ఇక సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని, అయితే దానిని మాత్రమే నమ్ముకోవద్దని చెప్పారట. జనంలోకి వెళ్లి వారి విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. జనంలోకి వెళ్లకుండా, గాలి మాటలు చెప్పే వారు పదవుల నుంచి తప్పుకోవాలంటూ సంతోష్ తీవ్ర హెచ్చరిక చేసినట్లు సమాచారం. ఫ్లెక్సీల్లో ఫోటోల వరకే పరిమితం కాకుండా జనం గుండెల్లో స్థానం సంపాదించండని నేతలకు కేంద్ర నాయకత్వం నుంచి సంకేతాలు పంపిందట.
మరి 2028లో తెలంగాణలో అధికారంలోకి రావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కాషాయ పార్టీ ఢిల్లీ పెద్దలు…వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తూ.. ఇక్కడి నేతలకు దిశానిర్దేశాలు చేస్తున్నారు. అనుసరించాల్సిన వ్యూహాలను వివరిస్తున్నారు. మరి ఈ వ్యూహాలు ఎంతమేరకు ఫలిస్తాయి? ? ఎవరిదారి వారిదే అన్నట్లు ఉన్న తెలంగాణ బీజేపీ నేతలు..ఒక్కతాటిపైకి వచ్చి హస్తిన నాయకుల సూచనలు ఎంతమేరకు పాటిస్తారో చూడాలి.
Story by Kishan, Big Tv