తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో కేబినెట్ బెర్త్ దక్కించుకున్నారు అడ్లూరి లక్ష్మణ్.. ఆ సంతోషం అట్టే కాలం నిలవకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అందరిచేత పాపం అనిపించుకుంటున్నారు. మొదటి నుంచి సౌమ్యుడిగా ముద్రపడిన మంత్రిని కొందరు వెకిలి కామెంట్స్ తో కాల్చుకు తింటున్నారు.. ఇంకొందరు మంచితనంతో నంచుకు తింటున్నారంట. మంత్రి పదవి వచ్చిందన్న ఆనందం కన్నా.. మంత్రి పదవి వచ్చాక అవమానాలే అడ్లూరికి ఎక్కువ అవుతున్నాయంట. అసలు ఇంతకీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అడ్లూరికి ఎదురువుతున్న చేదు అనుభవాలు ఏంటి?
ఏ ముహూర్తాన మంత్రి గా బాధ్యతలు చేపట్టారో గాని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే, సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి అడ్లూరి లక్ష్మణ్కి మనశ్శాంతి కరువైందంట. పండుగ లేదు, పబ్బం లేదు అన్నట్లు ఆయన పరిస్థితి తయారైందంట. తాను గౌరవించేవారు.. తాను మంత్రి కావాలని కోరుకునేవారు తనతో మంచితనంతో ఆడుకుంటుంటే.. తను మంత్రి అవ్వడం జీర్ణించుకోలేనివారు ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవమానాలకు గురి చేస్తున్నారంట. దాంతో ఇప్పుడా మంత్రికి ఏం చేయాలో పాలుపోవడం లేదట. తాజాగా జగిత్యాల జిల్లాలో పొలాస పౌలస్తేశ్వరస్వామి ఆలయంతో పాటు, బీర్పూర్ శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయ కమిటీల ఏర్పాటులో జీవన్ రెడ్డి వర్గానికి, ముఖ్యంగా ఆది నుంచీ కాంగ్రెస్ను నమ్ముకున్నవారికి స్థానం దక్కకుండా .. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినవారికి పదవులు దక్కడంతో జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
తనను గడియకింత హలాల్ చేయకుండా ఒకేసారి చంపుకుతినండంటూ తన ఆవేదనను మంత్రి అడ్లూరి ముందు జీవన్రెడ్డి అవేదన వ్యక్తపర్చారు. ఆ రోజే కాంగ్రెస్ ను వీడదామనుకుంటే శ్రీధర్ బాబు, మీరే ఆపారంటూ.. ఇద్దరు మంత్రులను టార్గెట్ చేస్తున్నారు. జీవన్ రెడ్డి వర్సెస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో ఎవరివైపు ఉండాలో తేల్చుకోలేని ఓ అయోమయ స్థితిలో మంత్రిగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా అడ్లూరి పాత్ర అడకత్తెరలో పోకచెక్కలా తయారైందంట. తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఎవరైతే మీకు ఇబ్బందికరమైన నిర్ణయం తీసుకున్నారో ఆ పాపం వారికే తాకుతుంది సార్ అంటూ అడ్లూరి అన్న మాటలు కూడా.. ఆయన ఎవరి గురించి ఆ కామెంట్స్ చేసి ఉంటారనే చర్చకు తెరలేపింది.
అదలా ఉంటే, అటు తాను ఎదగడం ఇష్టం లేని సహచర మంత్రులు కూడా తనను అవమానించేట్టు మాట్లాడటంపై అడ్లూరి తీవ్ర మనస్థాపం చెందుతున్నారంట. దీంతో మంత్రుల మధ్య పూర్తి డివిజన్ వచ్చేసినట్టే కనిపిస్తోంది. వేములవాడ ఆలయానికొచ్చిన శృంగేరీ పీఠాధిపతి విదుశేఖర భారతీ పర్యటనలో మంత్రి పొన్నంతో కలిసి అడ్లూరి కూడా పాల్గొంటారని ముందు పేర్కొన్నా.. ఆయన వేములవాడకు వెళ్లలేదు. గోదావరిఖనిలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీలోని తన ప్రత్యర్థులు, తనపై కారాలు, మిరియాలు నూరుతున్న సహచర మంత్రులు ఇదంతా శ్రీధర్ బాబే వెనుకుండి.. అడ్లూరిని ముందుంచి.. ఆడుతున్న నాటకంగా చర్చించుకుంటున్నట్టు కూడా ఓ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మంత్రి పదవి వచ్చిన ఆనందం కంటే కూడా.. దానివల్ల తనకు పెరిగిన తలనొప్పులే అడ్లూరికి నిద్రలేకుండా చేస్తున్నాయనే చర్చకు తావిస్తోంది.
కరవమంటే కప్పకు కోపం.. విడవమమంటే పాముకు కోపం అన్నట్టుగా ఇలా జిల్లా పార్టీలోని నాలుగైదు గ్రూపుల మధ్య.. అడ్లూరి పరిస్థితి మద్దెలదరువులా మారిందంటున్నారు. దీంతో తనకుతానే లోలోపల ఆయన మధనపడిపోతున్నారంట . తన ఎదుగుదలకి మొదటినుండి అండదండగా చేదోడు వాదోడుగా ఉన్న జీవన్ రెడ్డి వ్యవహారంలలో ఎటు తేల్చుకోలేకపోతున్నారంట. మరోవైపు జిల్లా కాంగ్రెస్లోని గ్రూపుల తగాదాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు ఇబ్బంది కరంగా మారాయంటున్నారు. మొత్తానికి అడకత్తెరలో పోక చెక్కలా అడ్లూరి పరిస్థితి తయ్యారైందనే టాక్ వినిపిస్తోంది.
Story by Big Tv