మంత్రాలకు చింతకాయలు రాల్తాయా? రాలుతాయి. రాలవు. గతంలో రాలాయి. మనం చూశాం. ఇప్పుడు రాలడం మానేశాయి.. కానీ రాలాలని ఎందుకు కోరుకోవడం.. చింతకాయలు రాలగొట్టినా అవి నీవు తినవు కదా..? ఎందుకు మరి చింతకాయలు రాలేలా మంత్రాలు చేపిస్తున్నావు? ఇది నీకు తగునా? ఆ మంత్రాలు చింతకాయలు రాలేందుకు కాకుండా.. మంచి పనికి వాడొచ్చు కదా? అయినా మేమేం భయపడం.. నువ్వు ఎన్ని మంత్రాలు చేసినా.. చింతకాయలు రాల్చినా.. వెనక్కి తగ్గం! కానీ కానీ చింతకాయలు రాలవు కదా! రాల్తాయంటారా? ఏమో రాలొచ్చు.. రాలకపోవచ్చు.. రాలినా ఆశ్చర్యం లేదు. అయినా మాకు భయం లేదు….!
ఇదేం వార్తరా బాబూ…! నీ మీద కూడా మంత్రాలు ఏమైనా ప్రయోగం చేశారా? ఆ రాలిన చింతకాయలేమైనా తిన్నావా?. తిట్టకుర్రి జర. అర్థమయ్యేటట్టు చెబుతా కొంచెం ఓపిక పట్టుర్రి. పైన చెప్పిన మంత్రాలు, చింతకాయల ప్యారాగ్రాఫ్లో మీకు ఒక్క ముక్క కూడా అర్థం కానట్టుంది కదా! లేదా అర్థమయి అర్థం కానట్టుందా? నేనేం చెప్పాలో నాకే క్లారిటీ లేక ఏదేదో చెబుతున్నానన్నట్టుగా ఉందా? అసలు నాకేం తెలియదు.. ఆ తెలియనితనాన్ని కవర్ చేసుకునేందుకు ఈ తలతిక్క వాదన చేస్తున్నట్టుగా కూడా అనిపిస్తుందా? అనిపించడంలో తప్పులేదు. తిట్టడంలోనూ తప్పులేదనుకో. కానీ అలా మాట్లాడింది నేను కాదు.. చెప్పింది నేను కాదు! మన మహేశుడు. అదే టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ గారు.
హరీశ్రావు కర్ణాటక, తమిళనాడు వెళ్లి క్షుద్రపూజలు చేసి వచ్చాడు. తెలంగాణలో వర్షాలు పడొద్దు..కరువు రావాలి.. ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడాలని… అని అన్నాడు మహేశ్. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని .. ఏవో పేపర్లు పట్టుకుని వచ్చి గాంధీభవన్లో ప్రెస్మీట్ పెట్టిర్రు అధ్యక్షుల వారు. హరీశ్రావు దీనిపై పరువు నష్టం దావా వేస్తానని లీగల్ నోటీసు పంపాడు ఇది వరకే. సామల రామ్మోహన్రెడ్డి, అద్దంకి దయాకర్ ఇద్దరూ దీనిపై మాట్లాడారు ఇప్పటి వరకు . ఇప్పడు అధ్యక్షుల వారు కూడా ఎంట్రీ ఇచ్చారు.
ఈ చీప్ పాలిటిక్స్కు ఆయన కొంచెం దూరంగా ఉండి హుందాగా కనిపిస్తే బాగుండేది. కానీ క్షుద్ర పూజల రంగంలోకి ఆయన కూడా దిగాడు. లీగల్ నోటీసులు కాదు.. నువ్వు నిజంగానే తిరుచ్చి, శివమొగ్గలో పూజలు చేశావా లేదా? అవి క్షుద్రపూజలకే ప్రసిద్ధి. లేదని యాదగిరి గుట్ట మీదెక్కి ప్రమాణం చేసి చెప్పు. లేదా తప్పైందని జనాలకు క్షమాపణ చెప్పు అన్నాడు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరిందని తేలిపోయింది.
మహేశ్.. హితబోధ చేయాల్సింది. మీరెన్ని మంత్రాలు చేసినా మాకేం కాదు.. జనాలు నమ్మరు. మీ మీద మీకు నమ్మకం లేక.. ఇలా పక్కదారి పడుతున్నారు. మీరంత బలహీనంగా ఉన్నారు. మేము స్ట్రాంగ్గా పరిపాలన చేస్తున్నాం.. ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.. అని చెప్పి వదిలేయాల్సింది. కానీ దీన్ని ఇప్పుడప్పుడే వదిలేలా లేదు కాంగ్రెస పార్టీ. తొందరలో సీఎం రేవంత్ కూడా బహిరంగ వేదికల మీద ఈ క్షుద్రపూజల టాపిక్ను తీసుకురావడం ఖాయమని తేలిపోయింది.
దీని ద్వారా కేసీఆర్ను, హరీశ్ను, కేటీఆర్ను ముగ్గురినీ టార్గెట్ చేయొచ్చని కాంగ్రెస్ భావిస్తోంది.
పాపం.. హరీశుడు ఇలా బుక్కయ్యాడు. బహుశా వీళ్లు చెప్పినట్టుగా ఆ గుళ్లకు పోయే ఉంటాడు. వీళ్ల దగ్గర ఆ ఆధారాలు కూడి ఉండి ఉంటాయి. మహేశ్ చేతిలో ఆ పేపర్లు అవే కావొచ్చేమో? నిజంగానే ఆ గుళ్లకు పోయేది అందుకేనేమో? సరే, ఇవన్నీ ప్రశ్నలు, అనుమానాలు ఎందుకు గానీ.. నిజంగానే హరీశ్ వెళ్లాడనుకుందాం. (కేసీఆర్ చెబితేనే వెళ్తాడని మనం ఇంతకు ముందే చర్చించుకున్నాం.) వెళ్తే .. పూజలు చేపిస్తే.. కవిత మీద చేపిస్తారు గానీ.. కాంగ్రెస్ మీదనో, తెలంగాణ మీదనో చేపించరు.. ఎందుకంటే.. వారికి ఇప్పుడు కంటిలో నలుసు కవితే. మీరు కాదు.
ఎందుకంటే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. అన్ని వర్గాల్లో. ఇందులో డౌట్ లేదు. ఇదిలాగే కొనసాగితే ఓడటం తథ్యం. అది ఫామ్హౌజ్లో కూర్చున్న కేసీఆర్కూ తెలుసు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం ఈ టర్ములో కాంగ్రెస్తో కానిపని. కేసీఆర్ బయటకు వచ్చి.. మేం చేస్తాం.. చేసి చూపిస్తామని కాలికి బలపం కట్టుకుని తిరిగితే అటువైపు జనం మొగ్గు చూపడానికి పెద్దగా సమయం పట్టదు. ఇదీ ఇక్కడ లాజిక్.
కానీ మహేశ్ చెప్పిన వాదన చూసిన తరువాత రేపు ఎల్నినో వల్ల వర్షాలు పడకపోయినా.. హరీశ్ క్షుద్రపూజల ఫలితమే అంటారేమో కాంగ్రెసోళ్లు. నమ్మనన్నాడు కదా? అంటారా? ఏమో ఆయన మాటలు ఎటూ అర్థం కాకుండానే ఉన్నాయి.. మరి.