Panchayat elections: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది. తొలి రెండు విడతల్లో సుమారు 56 బశాతం స్థానాలను గెలిచిన కాంగ్రెస్ మూడో దశలోనూ అదే అధిక్యాన్ని కొనసాగించింది. పాతిక శాతం సీట్లు దక్కించుకున్న గులాబీ పార్టీ పల్లెపోరులో అంతో ఇంతో ఉనికి చాటుకుంది. బీజేపీ కనీసం నాలుగంకెల సర్పంచ్ స్థానాలు కూడా దక్కించుకోలేక పరువు పోగొట్టుకుంది. కొన్ని జిల్లాల్లో ఇతరులు కాషాయపార్టీ కంటే తక్కువ సీట్లు దక్కించుకుని ఉంటే ఉన్నామన్నట్లు తయారైంది.
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బుధవారం మొత్తం 4,159 స్థానాలకు మూడో విడత ఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారులు 2,286 స్థానాలు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరులు 479 సానాల్లో విజయం సాధించారు. ఇతరుల్లో సీసీఐ మద్దతుదారులు , సీపీఎం వారు ఉనికి చాటుకోగలిగారు. మూడో విడత ఎన్నికల్లో సిద్దపేట మినహా మిగిలి 30 జిల్లల్లో కాంగ్రెస్ ఆధిపత్యం స్పష్టంగా ప్రస్పుటమైంది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,719 గ్రామపంచాయతీలకు మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 7,093 స్థానాల్లో గెలిచి చాంపియన్గా నిలిచింది. 3,488 సీట్లతో బీఆర్ఎస్ ఉనికి చాటుకోగా.. బీజేపీ 699 స్థానాలతో రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే ఉన్నామన్నట్లు తయారైది.. బుధవారం జరిగిన మూడో దశ ఎన్నికల్లోనూ సగానికిపైగా స్థానాల్లో (2,301 చోట్ల) గెలుపుతో.. హస్తం పార్టీ తన విజయపరంపరను కొనసాగించింది. బీఆర్ఎస్ పార్టీ సైతం పాతిక శాతానికి పైగా (1,145) స్థానాలు దక్కించుకుంది. బీజేపీ కూడా తొలి, మలి విడతల మాదిరిగానే.. మూడో విడతలోనూ 200 పైచిలుకు స్థానాలను దక్కించుకుంది.
వాస్తవానికి పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తర్వాత అత్యధిక స్థానాలు దక్కించుకున్న స్వతంత్రులు, ఇతరులు బీజేపీని వెనక్కి నెట్టారు. స్వతంత్రులే సుమారుగా 10శాతం సీట్లను గెలుచుకున్నారు. వారిలోనూ 80 శాతం మంది కాంగ్రెసకు చెందినవారే. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నిర్ణయంలో మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రముఖ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అనేక గ్రామాల్లో వారు స్థానిక కార్యకర్తల అభీష్టానికి భిన్నంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. దాంతో ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలే రెబల్స్గా బరిలోకి దిగి.. సొంత పార్టీ అభ్యర్థులపైనే గెలిచారు. ప్రమాణ స్వీకారం నాటికి వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వీరందరినీ కలిపితే పంచాయతీల్లో 64 శాతం కాంగ్రెస్ ఖాతాలోకే చేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
పంచాయతీ ఎన్నికలను సీఎం రేవంత్రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులూ ఈ ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి పనిచేశారు. పంచాయతీలు ఏకగ్రీవం కావడంలోనూ అభ్యర్థులకు అన్ని రకాలుగా సహకరించారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సరిగా చేరాలంటే అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తేనే మంచిదన్న ప్రచారం గ్రామాల్లో జోరుగా నడిచింది. అంతిమంగా కాంగ్రెస్ వ్యూహం ఫలించి అత్యధిక స్థానాలను దక్కించుకోగలిగింది. ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, తాజాగా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాలతో సీఎం రేవంత్ గ్రాఫ్ పెరిగి పోయిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అధికార కాంగ్రెస్ పార్టీ కంటే చాలా తక్కువ సీట్లే వచ్చినా.. ఒక రకంగా పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ఊరటను కలిగించాయని చెప్పొచ్చు. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి.. వరుసగాఎన్నికల్లో ఓటమిపాలవుతూ వస్తున్న బీఆర్ఎస్.. తాజాగా ఇంటి పోరునూ ఎదుర్కొంటోంది. లోక్సభ ఎన్నికల్లో సున్నా సీట్లు వచ్చి, ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీట్లూ కోల్పోయిన నేపథ్యంలో.. పంచాయతీ ఎన్నికల్లో 27.4 శాతం సీట్లను గెలుచుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో తన ఉనికిని చాటుకున్నట్టయింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా గ్రామీణ నియోజకవర్గాల్లోనే దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీ.. ఇంకా గ్రామాల్లో పుంజుకోలేదని పంచాయతీ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక బీజేపీ.. మూడు విడతల్లోనూ కలిపి 5.5 శాతం సీట్లను దక్కించుకుంది. గెలుచుకున్న సీట్లలో సింహభాగం.. పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లోనే ఉన్నాయి. కేటీఆర్ నియోజకవర్గం ఉన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎట్టకేలకు ఆధిక్యత సాధించింది. తొలి, మలి దశ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. మూడో విడతకు వచ్చే సరికి బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. మూడో విడతలో బీఆర్ఎస్ ఎక్కువగా సీట్లు గెలుచుకున్న జిల్లాల్లో ఆదిలాబాద్, మెదక్, గద్వాల జిల్లాలున్నాయు. కేసీఆర్, హరీశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో తొలి రెండు విడతల్లో బీఆర్ఎస్ ఆధిక్యంతో ఉన్న సంగతి తెలిసిందే. మూడో విడతలో మాత్రం కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది.
నూతనంగా గెలిచిన సర్పంచ పదవీ ప్రమాణస్వీకారం ఈ నెల 22కి వాయిదా వేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులచ్చింది. ముందుగా నిర్ణయించిన 20న ముహూర్తం సరిగ్గా లేదని కొత్త సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు కోరడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
Story By Ramireddy, Big Tv