Vanamahotsavam: ప్రస్తుత ప్రభుత్వం ప్రతి ఏటా వన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు హరితహారం పేరుతో కార్యక్రమం నిర్వహించింది. ఈ రెండు కార్యక్రమాల లక్ష్యం.. తెలంగానలో పచ్చదనాన్ని పెంచడమే. కానీ ఈ రెండు పథకాల అమలు తీరుపైనే ఇప్పుడు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందనే చర్చ మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణలో భారీగా మొక్కల పెంపకాన్ని ప్రారంభించారు. అంతేకాదు సీడ్ బాంబింగ్ పేరుతో కార్యక్రమాలు కూడా నిర్వహించారు. మరి ఈ కార్యక్రమాల వల్ల జరిగిన లబ్ధి ఏంటి? అనే ప్రశ్నకు సమాధానం మాత్రం ఇప్పుడు దొరకడం లేదు.
అందుకే ప్రస్తుత ప్రభుత్వం జవాబుదారీతనాన్ని పెంచేలా కొన్ని నిర్ణయాలను తీసుకుంది. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేంటో చూద్దాం.. ఆ తర్వాత అసలు హరితహారం కార్యక్రమంలో ఏం జరిగింది? ఎన్ని కోట్లు ఖర్చు చేశారు? ఆ నిధులతో ఎన్ని చెట్లు ఎదిగాయి? ఆ డబ్బు ఎక్కడికి చేరిందనే విషయాలను బిగ్ టీవీ.. మీ ముందు ఉంచుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నర్సరీలు, ప్లాంటేషన్ల పనులపై ఫోకస్ పెట్టింది. మొక్కలు నాణ్యతతో ఉండేలా చర్యలు చేపడుతున్నది. ఇందుకోసం అధికారులు పర్యటించి అక్కడి పరిస్థితులపై ప్రతివారం నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నారు. ఎవరైనా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే రిపోర్ట్ ఇస్తే వారిపై సైతం చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతోంది. ఈ ఏడాది 10.18కోట్ల మొక్కలు పెంచేందుకు జిల్లాలోని డీఆర్డీవోలు ప్రణాళిక పంపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
నిజానికి మొక్కలు నాటాలి అనే దానిపై ఉన్న దృష్టి.. అసలు ఎలాంటి మొక్కలు నాటాలి? నాటే మొక్కలు ఎంత క్వాలిటీగా ఉంటున్నాయి? అనే దానిపై గతంలో ఎప్పుడూ దృష్టి సారించలేదు. కానీ ఇక నుంచి అలా కాదు అంటోంది ప్రభుత్వం. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద నర్సరీలు, ప్లాంటేషన్ల పనులు చేపడుతున్నారు. నర్సరీల్లో క్వాలిటీ మొక్కలు పెంచుతున్నారా..? ప్లాంటేషన్ పనులు నిబంధనల ప్రకారం చేస్తున్నారా? లేదా అనే దానిపై గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2025-26 నాటి పనులతో పాటు 2026-27 సీజన్ కు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఆ పనుల పర్యవేక్షణకు క్వాలిటీ కంట్రోల్ బృందాలు ఏర్పాటు చేసింది. ఈ నెల 11వ తేదీ నుంచి అన్ని జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.
Also read: క్రికెట్ క్రేజ్తో నార్త్ ఇండియాను చుట్టేయబోతున్న ‘పెద్ది’ టీమ్.. అసలు ప్లాన్ ఇదే..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 వేల 750 గ్రామ పంచాయతీ నర్సరీల్లో ప్రస్తుతం 10.18 కోట్ల మొక్కలను పెంచుతున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కమ్యూనిటీ, అవెన్యూ ప్లాంటేషన్లతో పాటు ఈత, తాటి, ఉద్యాన వన మొక్కలు, పండ్ల మొక్కలు ఇంటింటికీ పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తనిఖీల సమయంలో కూడా ఏదో మమ అనిపించేలా కాకుండా.. క్వాలిటీ కంట్రోల్ విషయంలో ఓ చెక్లిస్ట్ను ప్రభుత్వం రిలీజ్ చేసింది. అసలు నర్సరీలో ఎన్ని మొక్కలు ఉన్నాయి? కొత్తగా పెంచినవి ఎన్ని? కవర్ల సైజు మార్పిడి సరిగ్గా జరిగిందా? షేడ్ నెట్, నీటి సౌకర్యం ఉందా? రిజిస్టర్లు అప్డేట్గా ఉన్నాయా? అనేది అధికారులు పరిశీలించనున్నారు. అదేవిధంగా ఎన్ని గుంతలు తీశారు? ఎన్ని మొక్కలు నాటారు? వాటిలో ఎన్ని బతికాయి? వాచర్ను నియమించారా? నీళ్లు పోస్తున్నా రా? వంటి అంశాలను ప్రతి ప్లాంటేషన్ వద్ద అధికారులు రికార్డ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా పనులకు సంబంధించి ఎస్టిమేషన్ ఎంత? ఇప్పటి వరకు కూలీలకు, మెటీ రియల్కు ఎంత ఖర్చు చేశారనే వివరాలను కూడా చెక్ చేయనున్నారు.
జిల్లాల్లో పర్యటించే అధికారులు నర్సరీలు, ప్లాంటేషన్ల నాణ్యతను పరిశీలించి ప్రతి వారం ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపాల్సి ఉంటుంది. నర్సరీల వారీగా మొక్కల వివరాలు అందజేయనున్నారు. ఈ తనిఖీల ప్రక్రియను పర్యవేక్షించాలని జిల్లా గ్రామీణా భివృద్ధి అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో నర్సరీల్లో నాణ్యమైన మొక్కలు పెంచకపోవడం, గుంతలు సరిగ్గా తీయకపోవడంతోనే మొక్కలు నాటిన కొద్దిరోజులకే ఎండిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం మూణాళ్ల ముచ్చటగా గతంలో మొక్కల పెంపకం అంటూ హడావుడి జరిగింది కానీ.. అంతిమ లక్ష్యం మాత్రం నెరవేరలేదు. అందుకే ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అనేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్వాలిటీ డ్రైవ్లో మరో కీలక నిర్ణయం ఏంటంటే.. గతంలో నాటిన మొక్కల పరిస్థితిని కూడా అధికారులు పరిశీలించనున్నారు. అందుకు సంబంధించిన నివేదికను సైతం అందజేయాలని అధికారులకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇది పైకి నార్మల్గా కనిపిస్తున్నా కానీ.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకలను బయటికి తీసే పనిలా కనిపిస్తోంది.
Also read: కొత్త స్థలం.. కొత్త గ్రామం.. చెంచుల కోసం ప్రభుత్వం అందిస్తున్న డబుల్ ప్యాకేజీలు ఇవే..?