TG Municipal Elections 2026: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. మరి కొద్దిగంటల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో అన్ని పార్టీల అభ్యర్ధులు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. ఎన్నికల నిఘా అధికారుల కళ్లుగప్పి మందు, మాంసం, నగదు పంపిణీల పర్వానికి తెరలేపారు. యువతకు పార్టీలు, ఇంటింటికీ ఓట్లను బట్టి నగదు పంపిణీ జోరుగా సాగుతోంది. గూగుల్, ఫోన్ పేలకు డిమాండ్ పెంచేస్తున్నారు. ఇతర ప్రాంతాల ఉన్నవారికి సైతం ఫోన్లు చేస్తూ పోలింగ్ సమయానికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఈ ప్రలోభాల పర్యం కోసం ప్రతి 30 మంది ఓటర్లకు ఒకరిని ప్రత్యేక నియమించిందంట..
రాష్ట్రంలో ప్రచారం ముగియడంతో మున్సిపాలిటీల్లో పోటీచేసే అభ్యర్థులు పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టిసారించారు. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లను ఆకట్టుకోవడంపై దృష్టిసారించాయి. ఎదురుపార్టీ అభ్యర్థి ఎంతఖర్చు చేస్తున్నాడు.. ఓటర్ కు ఎంత ఇస్తున్నాడు..అనేదానిపై ఫోకస్ పెట్టి దానికంటే ఎక్కువగా ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎలాగైనా.. ఎంత ఖర్చుఅయినా ఫర్వాలేదు కానీ గెలిచి తీరాల్సిందేనని అభ్యర్థులు భావిస్తూ కీలకమైన పోల్ మేనేజ్మెంట్పై దృష్టిసారిస్తున్నారంట.
మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లలో గెలిస్తే మేయర్, డిప్యూటీ మేయర్.. కార్పొరేషన్ చైర్మన్ లేదా వైస్ చైర్మన్ వస్తుందని నమ్మకంతో ఉన్న అభ్యర్థులు భారీగా ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదంట. వార్డులు, డివిజన్ల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాగైనా గెలిచి తీరాలని ఓటర్లను పోలింగ్ బూత్లకు రప్పించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు?.. మన పార్టీ పరిస్థితి ఎలా ఉంది?.. ఓటుకు ప్రజలు ఎంత ఆశిస్తున్నారు?.. అవతలి పార్టీ ఎంత ఇద్దామనుకుంటోంది?… మన పార్టీ గెలుపుపై ఏమైనా సందేహాలు ఉన్నాయా?… అని ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ.. ప్రత్యర్థి ఎత్తులను గమనిస్తూ బూత్స్థాయిలో నిఘా పెంచి తాయిలాలు పంచుతున్నారంట.
కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటరును కలిసేలా చర్యలు చేపట్టి గెలుపే పరమాధిగా అన్ని రాజకీయ పార్టీల అభ్యర్ధులు తెగ కసరత్తు చేస్తున్నారు. పోలింగ్కు గంటల సమయం మాత్రమే ఉండడంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందుకే ఇన్ని రోజులు చేసిన ప్రచారం ఒక ఎత్తని భావిస్తూ .. పోల్ మేనేజ్మెంట్పై ఫోకస్ పెడుతున్నాయంట. ఈసారి ఎన్నికలను గతం కంటే చాలెంజ్గా తీసుకుని ఓటుకు ఎంతైనా ఇచ్చి ప్రజలను తమ వైపునకు తిప్పుకోవాలని ప్రధాన పక్షాల క్యాండెట్లు ఉవ్విళ్లూరుతున్నారు.
మున్సిపాలిటీల్లోని వార్డుల్లో ఇప్పటికే పోటీచేస్తున్న అభ్యర్థులు ఓటర్లకు అందజేయాలనుకున్నవి అందజేశేసారంట. చివరి ఘడియలు కావడంతో ఓటరు డైవర్ట్ అవ్వకుండా చూసుకోవడానికి మద్యం, మాంసం అందజేస్తూ… స్థానిక పరిస్థితులను బట్టి మరింత నగదు ఇవ్వడానికి కూడా వెనుకాడటం లేదంట. ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటే ఓటుకు 1500 నుంచి 3వేలవరకు పంపిణీ చేశారంటున్నారు. ఓటర్లు అందుబాటులో లేకుంటే వారికి గూగల్ పే, ఫోన్ పేల ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారంట. అంతేకాదు వారికి సన్నిహితులతో ఫోన్ చేయిస్తూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉంటే వారిని రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి తోడు యువతకు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. కాలనీల వారీగా యువతకు దావత్ లు, సంఘాలు ఉంటే వారికి ఫండింగ్, అభివృద్ధికి హామీలు సైతం గుప్పిస్తున్నారు. అందుబాటులో ఉంటామని హామీలు ఇస్తున్నారు.
అధికార కాంగ్రెస్ కూడా ఫోల్ మేనేజ్మెంట్ కోసం ప్రత్యేకంగా టీమ్లు ఏర్పాటు చేసుకుందంట. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత ఓటింగ్ పై ప్రభావం చూపకుండా వ్యూహారచన చేస్తున్నారట. మరోవైపు పార్టీలోని అంతర్గత విబేధాలతో నష్టం కలగకుండా చర్యలు చేపడుతున్నారట. బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీలు సైతం 30 మంది ఓటర్లకు ఒకరిని ఇన్ చార్జ్గా నియమించి వారిని ఆకట్టుకునే ప్రయత్నం గట్టిగా చేస్తున్నాయంట. ప్రతి ఓటర్ ను పోలింగ్ బూత్ కు తీసుకొచ్చేవరకు వారికే బాధ్యతలు అప్పగించారట.
ఇక బీజేపీ కూడా తన వంతు ప్రయత్నంగా ప్రలోభాల పర్వంలో దూసుకుపోయే ప్రయత్నం చేస్తోందంట. ఓటర్ల అభీష్టం మేరకు వారి మంచిచెడ్డా చూసే బాధ్యతలు చూడటానికి పార్టీ శ్రేణులకు బాధ్యతలు కట్టబెట్టిందంట. ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉంటే వారు వచ్చేందుకు రవాణా ఖర్చులు.. పది మంది ఉంటే వాహనం ఏర్పాటు చేస్తున్నారు. ఓటు వేసి తిరిగి వారి నివాస ప్రాంతాలకు చేర్చే బాధ్యతను తీసుకుంటున్నారు. ఓటుకు ఇంతా అని చెప్పి అది సఫరేట్ గా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇతర ప్రాంతాల్లో ఉండే ఓటర్ల కోసం సెపరేట్గా కొందరికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
పోలింగ్ గడువు దగ్గర పడటంతో ముఖ్య నేతలకు పంపకాల బాధ్యతను చేపట్టారు. ఇప్పటికే వార్డులేదా డివిజన్ లోని ప్రతి ఓటర్ ను రెండుమూడు సార్లు కలిశారు. అయితే మళ్లీ ఒక్కొక్కరుగా గడపగడపకు వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఇతర పార్టీల అభ్యర్థులపైనా దృష్టిసారించారు. పలు చోట్లు ఆయా కుంటుంబాల అవసరాలను బట్టి ఎల్ఈడీ టీవీలు, వాషింగ్ మెషిన్లు, ఫ్రిజ్లు వంటి గృహోపకరణాల పంపిణీ యధేచ్చగా సాగిపోయిందంట. మహిలకు ఖరీదైన పట్టుచీరలు, వెండి బహుమతులు ఇప్పటికే చేరవేశారంట.
సాధారణంగా ఎన్నికలంటే.. మద్యం, డబ్బు, బిర్యానీ, చికెన్, మటన్.. ఇంటింటికీ తిరిగి పంచేవారు. కానీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఇళ్లళ్లోకి కావాల్సిన ఖరీదైన వస్తువులను ఇచ్చేస్తున్నారు. టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు, మిక్సీలు, రైస్ కుక్కర్లు, ప్రెజర్ కుక్కర్లు, డిన్నర్ సెట్లు, కూలర్లు.. ఇలా ఒక్కటేంటీ రకరకాల వస్తువులను పంచుతున్నారు. అలాగే తమ వార్డు, డివిజన్ల పరిధిలో ఉన్న పేదల ఇళ్లల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు జరిగితే వారికి ఆర్థిక సాయం అందిస్తామని హామీలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా పుట్టే ఆడబిడ్డల పేరు మీద కూడా డబ్బులు ఇస్తామని పేర్కొంటున్నారు. ఇంకా కొందరు బాండ్ పేపర్ల మీద హామీలు రాసిస్తుండగా.. మరికొందరు ఓటర్ల నుంచి ప్రమాణాలు తీసుకుంటున్నారంట. ఏది ఏమైనా అన్నిపార్టీలకు చెందిన అభ్యర్థులు, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నవారంతా పోల్ మేనేజ్ మెంట్ పైనే దృష్టి సారిస్తుండటంతో ఓటర్ల పంట పండుతోందంట.
Also Read: రూ.50వేలు లంచం తీసుకుంటూ.. రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఎస్ఐ, ఎక్కడో కాదు ఏకంగా పీఎస్లోనే..?
Story by: Apparao, Big Tv