DGP Shivadhar Reddy: బుధవారం మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిసాలిటీలకు ఎన్నికలను పురస్కరించుకుని భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. సమస్యాత్మకమైనవిగా గుర్తించిన పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరిస్తున్నామని తెలిపారు. దాంతోపాటు సీసీ కెమెరాలతో నిఘా పెట్టామని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తరువాత జరిపిన తనిఖీల్లో ఇప్పటివరకు 3.09 కోట్ల రూపాయల నగదు, వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.
హైదరాబాద్ లోని తన కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పోరేషన్లు, 116 మున్సిపాలిటీలకు నేడు ఎన్నికలు జరుగనున్నాయని తెలిపారు. 8,203 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్టు చెప్పారు. వీటిలో 1,302 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా, 1,926 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. వీటి వద్ద అదనపు బలగాలను మోహరిస్తున్నట్టు తెలిపారు. శాంతిభద్రతలకు చిన్నపాటి విఘాతం కూడా కలగకుండా చూసేందుకు 3 వేల మంది అదనపు బలగాలను రప్పించినట్టు చెప్పారు. వీరిలో టీజీఎస్పీతో పాటు అటవీ, ఎక్సైజ్, సీఐడీ, లీగల్ మెట్రాలజీ విభాగాల సిబ్బంది కూడా ఉన్నట్టు వివరించారు.
ఎన్నికల్లో పారదర్శకత కోసం అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. దీని వల్ల ఆయా పోలింగ్ కేంద్రాల లోపల ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడవచ్చన్నారు. ఇక, పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో 20 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు జిల్లాల్లో 55 చెక్ పోస్టులు పెట్టినట్టు తెలిపారు. దాంతోపాటు 181 ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, 167 స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలు విధుల్లో ఉంటాయన్నారు.
ఎన్నికల నేపథ్యంలో 1,183 లైసెన్స్ డ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ చెప్పారు. సమస్యలు సృష్టించగలరని భావించిన 4,318 మందిని బైండోవర్ చేసినట్టు తెలిపారు. 398 నాన్ బెయిలబుల్ వారెంట్లను జారీ చేసినట్టు పేర్కొన్నారు. అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వెలుపల కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తామని తెలిపారు. విజబుల్ పోలీసింగ్ ను పెంచి గస్తీని ముమ్మరం చేసినట్టు చెప్పారు.
గతనెల 27వ తేదీన ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి విస్తృతస్థాయిలో తనిఖీలు జరిపి 3.09 కోట్ల రూపాయల నగదు, వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.దీంట్లో 1.28కోట్ల రూపాయల నగదు, 1.21కోట్ల రూపాయల విలువైన మద్యం, 15.07లక్షల విలువ చేసే మాదక ద్రవ్యాలు, 28.69లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయన్నారు.
Also Read: Best Air Cooler Under Rs 5000: బడ్జెట్లో బెస్ట్ ఎయిర్ కూలర్స్.. ఏసీని తలపించే కూలింగ్ భయ్యా!
ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 142 ఎఫ్ఐఆర్ లు నమోదైనట్టు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల నిర్వహణపై క్షేత్రస్థాయిలో పని చేసే అధికారులు, సిబ్బందికి పూర్తి స్థాయిలో ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలు…భయానికి లోనుకాకుండా స్వేచ్ఛగా తమ రాజ్యాంగబద్దమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో శాంతిభద్రతల అదనపు డీజీపీ మహేశ్ భగవత్ పాల్గొన్నారు.