తెలంగాణ సమగ్రాభివృద్ధి, ప్రజల భవిష్యత్తు పట్ల.. తమ సంకల్పం ఏమిటన్నది గవర్నర్ ప్రసంగం ద్వారా వివరించామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి స్పష్టమైన విధానంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు.. ముఖ్యమంత్రి సవివరంగా సమాధానమిచ్చారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగడానికి రూపొందించిన ప్రణాళికను అసెంబ్లీ వేదికగా ప్రజల ముందు ఆవిష్కరించిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్రాలుకు.. ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు అయ్యే నాటికి సాధించాల్సిన లక్ష్యాలతో.. కేంద్రం వికసిత్ భారత్ ప్రణాళికలు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం క్యూర్, ప్యూర్, రేర్ ప్రణాళికలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించామన్నారు. రాష్ట్రంలో యువత, మహిళలు, రైతు వర్గాల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. ఒకప్పుడు రాక్, లేక్ సిటీగా విలసిల్లిన హైదరాబాద్ నగరానికి పూర్వ వైభవం తేవాలన్న లక్ష్యంతోనే.. మూసీ నది ప్రక్షాళనకు ప్రణాళికలు చేశామన్నారు సీఎం రేవంత్.
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సాధించిన విజయాలు, ఆశయాలు, భవిష్యత్తు లక్ష్యాలను.. సవివరంగా సభ ముందు ఆవిష్కరించారు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా. ఆవిష్కరణల్లో అగ్రగామిగా, బలహీన వర్గాలకు భరోసాగా, ప్రపంచానికి ఆదర్శంగా తెలంగాణను నిర్మించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ప్రపంచంలోనే గుర్తింపు పొందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తెలంగాణ రైజింగ్-2047 విజన్తో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
ఈ దిశగా.. ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రెండేళ్లుగా ప్రజా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. ప్రపంచ పెట్టుబడులకు రాష్ట్రం కీలక గమ్యస్థానంగా నిలిచిందని, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, బయో ఏషియా సమ్మిట్ ద్వారా దాదాపు 6 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించిందన్నారు. తెలంగాణ ఓ చారిత్రక మార్పు దశలో నిలబడిందన్నారు. ప్రజా ప్రభుత్వం ఎంచుకునే ప్రతి పాలసీ, అమలు చేసే ప్రతి కార్యక్రమం, చేపడుతున్న ప్రతి సంస్కరణ ఈ ప్రాంత ప్రజలకు అవకాశాలను సృష్టిస్తుందన్నారు.
రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ జాతి గౌరవం, నిరంతర స్ఫూర్తికి నిలువెత్తు ప్రతిబింబంమైన.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి, రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున.. పునరుద్ధరించిన శాసనమండలి భవనం ఎదురుగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణియన్.. ఈ వారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక
పరిస్థితులను మెరుగుపరిచేందుకు, సుబ్రమణియన్ కీలక సూచనలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చుకుని ప్రణాళికా బద్ధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంపై మాట్లాడారు. ప్రధానంగా విద్యుత్ రంగం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, జీఎస్టీ విభాగాల్లో నమూనా మూల్యాంకనం, జీఎస్టీలో పన్నుల అంచనా లాంటి అంశాలపై సుబ్రమణియన్తో చర్చించారు.
రాష్ట్రంలోని రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఈ వారం శుభవార్త చెప్పింది. ఈ నెల 22 నుంచే పంట పెట్టుబడి కోసం రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి 70 లక్షల మంది రైతులకు ఎకరం వరకు 3 వేల 590 కోట్లు నిధులను రైతుల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి చేతుల మీదుగా బదిలీ అవుతాయి. మరో 20 రోజులకు, 2 వేల 650 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా మిగిలిన రైతులకు వారి ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు. మొత్తంగా కోటిన్నర ఎకరాలకు సంబంధించి.. 9 వేల కోట్ల రైతు భరోసా నిధులు.. రైతుల ఖాతాల్లో జమకానున్నాయి.
అన్ని మతాలకు చెందినవారు సోదరభావంతో కలిసికట్టుగా తెలంగాణని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మైనారిటీల అభ్యున్నతికి సాధ్యమైనంత మేరకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ వారం మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం తరఫున ఎల్బీ స్టేడియంలో ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో సీఎం పాల్గొన్నారు. రంజాన్ మాసం పండుగ మాత్రమే కాదని.. విలువలను గుర్తుచేసే పవిత్ర మాసమని చెప్పారు. రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు.
సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో మైనారిటీలకు భాగస్వాములుగా చేసుకొని ముందుకు నడిపిస్తున్నామన్నారు సీఎం. ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లలో మైనారిటీలకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. మనమంతా కలిసి తెలంగాణ, హైదరాబాద్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. అంతా కలిసి కష్టపడితేనే రాష్ట్రం, దేశం ప్రగతి పథంలో ముందుకు సాగుతాయన్నారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో అందరి సహకారం కావాలని కోరారు.
Also Read: బొత్స సత్యనారాయణకు మళ్ళీ అస్వస్థత.. అసలు ఏమైంది?
Story by: Anup, Big Tv