Power Demand: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో విద్యుత్ వినియోగం మరోసారి రికార్డు స్థాయికి చేరుకుంది. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం 12:44 గంటలకు 11,828 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నమోదైంది. గతంలో నమోదైన డిమాండ్ స్థాయులను అధిగమిస్తూ ఈ కొత్త రికార్డు నమోదైంది. ఇక ఉదయం నుంచే విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఉదయం 10:30 గంటలకే 11,816 మెగావాట్ల డిమాండ్ నమోదవడం ద్వారా మధ్యాహ్నానికి డిమాండ్ మరింత పెరగనున్న సంకేతాలు కనిపించాయి. అనంతరం మధ్యాహ్నం 12:44 గంటలకు 11,828 మెగావాట్లకు చేరుకుంది. అయితే పెరిగిన విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా టీజీఎస్పీడీసీఎల్ అధికారులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించారు.
రికార్డు స్థాయి డిమాండ్ను విజయవంతంగా తీర్చడంతో పాటు వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కొనసాగించారు. విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగినప్పటికీ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా వ్యవస్థను సమర్థంగా నిర్వహించడం టీజీఎస్పీడీసీఎల్ సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచింది. డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు గ్రిడ్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ సరఫరాను స్థిరంగా కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం, వినియోగదారులకు నాణ్యమైన మరియు నిరంతరాయ విద్యుత్ అందించడం తమ ప్రధాన లక్ష్యమని విద్యుత్ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ పాటిల్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే అధికారులు పొలంబాట పట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొని పంట పొలాలను సందర్శించారు. వ్యవసాయ పంపుసెట్ల పనితీరు, వోల్టేజీ స్థాయిలు, విద్యుత్ సరఫరా నాణ్యతను పరిశీలించడంతో పాటు రైతులతో సమావేశమై వారి సమస్యలు, సూచనలు తెలుసుకున్నారు. ఎస్పీడీసీఎల్ పరిధిలోని 11 గ్రామీణ సర్కిళ్లలో విద్యుత్ శాఖ అధికారులు నేడు ఉదయం నుంచే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ మారుమూల గ్రామాలకు వెళ్లి రైతులతో నేరుగా మమేకమయ్యారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతోందా, పంటలకు అవసరమైన నీరు అందుబాటులో ఉందా, విద్యుత్ సరఫరాలో ఏవైనా సమస్యలు ఉన్నాయా అనే అంశాలపై రైతులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
Also read: ఇప్పుడు క్రేజ్ తగ్గినా.. అప్పట్లో అదొక సంచలనం.. 80’s లో మ్యాగీ మేనియా చూసొద్దామా?
ఇబ్రహీంబాగ్ డివిజన్తో పాటు సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, వనపర్తి, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల పరిధిలోని పలు గ్రామాల్లో అధికారులు వ్యవసాయ విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. పలు 33/11 కేవీ సబ్స్టేషన్లలో సరఫరా పరిస్థితిని పర్యవేక్షించి, వ్యవసాయ పంపుసెట్ల వద్ద వోల్టేజీ కొలతలు చేపట్టారు. ఈ సందర్భంగా రైతులకు అందుతున్న విద్యుత్ సరఫరా నాణ్యత, విద్యుత్ అంతరాయాలు, పంపుసెట్ల నిర్వహణ తదితర అంశాలపై అధికారులు ఆరా తీశారు.
రైతులు వెల్లడించిన సమస్యలను అక్కడికక్కడే నమోదు చేసి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. రైతులు మాట్లాడుతూ.. వ్యవసాయానికి నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందుతోందని, విద్యుత్ శాఖ అధికారులు స్వయంగా గ్రామాలకు వచ్చి సమస్యలు తెలుసుకోవడం సంతోషకరమని తెలిపారు. ఇదిలాఉండగా అధికారులు మాట్లడుతూ.. వ్యవసాయ రంగానికి మరింత మెరుగైన విద్యుత్ సేవలు అందించడంతో పాటు రైతుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు టీజీఎస్పీడీసీఎల్ కట్టుబడి ఉందని తెలిపారు.
Also read: వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే..అపనిందలు వస్తాయా? అసలు రహస్యం ఇదే!