Siddipet Elections: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాల్లో సిద్ధిపేట్ ఒకటి. దశాబ్దాలుగా ఒకే కుటుంబం, ఒకే పార్టీ కనుసన్నల్లో నడుస్తున్న సిద్ధిపేట్ కోటపై ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగరేయాలని అధికార పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. రాబోయే సిద్ధిపేట్ మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏలాగైనా సరే ఈసారి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుని, గులాబీ కోటను బద్దలు కొట్టాలని పక్కా ప్లాన్తో అడుగులు వేస్తోంది.ఈ మేరకు ఇటీవల హైదరాబాద్లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ‘గాంధీభవన్’ లో సిద్ధిపేట్ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులతో అధిష్టానం అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు.ముఖ్యంగా, సిద్ధిపేట్లో దశాబ్దాలుగా తిరుగులేని పట్టున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేతను రాజకీయంగా బలహీనపరచడమే (వీక్ చేయడమే) ఏకైక లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి స్వయంగా పార్టీ శ్రేణులకు సూచించినట్లు సమాచారం. ఆయనకున్న ప్రజాధారణను, క్యాడర్ బలాన్ని దెబ్బతీస్తేనే సిద్ధిపేట్లో కాంగ్రెస్ గెలుపు సులువవుతుందని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది.
సిద్ధిపేట్ మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం భారీ స్కెచ్ వేసింది. ఇక్కడి స్థానిక సమీకరణాలను మార్చగల సత్తా ఉన్న కీలక నేతలకు ఈ ఎన్నికల పూర్తి బాధ్యతలను అప్పగించింది. ఆర్థిక, అంగబలంతో పాటు వ్యూహాలు రచించడంలో దిట్ట అయిన మంత్రి వివేక్కు ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు.అంతేగాక దూకుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన మైనంపల్లిని రంగంలోకి దించడం ద్వారా బీఆర్ఎస్ క్యాడర్ను ఆకర్షించడంతో పాటు, స్థానికంగా పార్టీకి కొత్త జోష్ తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ నేతలంతా కలిసి సిద్ధిపేట్ మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డుపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. బీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలను కాంగ్రెస్ లోకి లాగడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడమే వీరి టార్గెట్.
Also read: కేంద్రం కొత్త కసరత్తు.. బ్యాంకు ఉద్యోగులకు పండగే, అంతా డిజిటల్ మయం
గత కొంతకాలంగా సిద్ధిపేట్లో వన్ సైడ్ పాలిటిక్స్ నడుస్తుండగా.. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండటం, వ్యూహాత్మకంగా భారీ నేతలను రంగంలోకి దించుతుండటంతో రాబోయే మున్సిపల్ సమరం రసవత్తరంగా మారనుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఈ మున్సిపల్ ఎన్నికలు సిద్దిపేటకు సెమీఫైనల్గా మారినన్నాయి. దీంతోనే కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకున్నది. మరోవైపు సిద్దిపేట్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిని చేస్తామంటూ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఓ బహిరంగ సభలో ఓపెన్ ఆఫర్ చేశారు .మరి కాంగ్రెస్ వేస్తున్న ఈ “టార్గెట్ సిద్ధిపేట్” స్కెచ్ ఎంతవరకు పారుతుందో, మాజీ మంత్రి తన కోటను కాపాడుకుంటారో లేదో చూడాలి.
Also read: Yoga Day Celebrities: యోగా డే స్పెషల్.. హీరోయిన్ల యోగ పోజులు..