BigTV English

Crop Loss In Telangan: రైతన్నకు.. తీరని శోకం

Crop Loss In Telangan: రైతన్నకు.. తీరని శోకం

వర్షాలతో దెబ్బతిన్న పంటలు
– 6 జిల్లాల్లో తీవ్ర ప్రభావం
– ఒక్క ఖమ్మం జిల్లాలోనే 4 లక్షల ఎకరాల్లో పంట నష్టం
– రైతుల్ని ఆదుకోవాలని హరీష్ రావు డిమాండ్
– ఒక్కో ఎకరానికి రూ.10వేలు ప్రకటించిన ప్రభుత్వం
– వరద అంచనాలో ప్రభుత్వం ఫెయిలైందని పువ్వాడ విమర్శలు


Crop Loss In Telangan: భారీ వర్షాలు రైతుల్ని నిండా ముంచేశాయి. పలుచోట్ల వాగులు, చెరువులు ఉప్పొంగి పొలాల్లోకి నీరు చేరాయి. దీంతో వరి, పత్తి, మిరప, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వనపర్తి, ములుగు, నాగర్ కర్నూల్ జిల్లాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 4 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. మున్నేరు వాగు మహోగ్ర రూపం దాల్చడంతో పరివాహక ప్రాంతాల్లోని పొలాలు నీట మునిగాయి. మహబూబాబాద్‌లో రెండున్నర లక్షల ఎకరాల్లో పంటలపై ప్రభావం పడింది. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది.

రైతుల్ని ఆదుకోవాలి!


వరదల నేపథ్యంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు సహాయక చర్యల కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్నారని, ఇంట్లో వరద నీరు, కంట్లో ఎడతెగని కన్నీరు, వరద సృష్టించిన విలయాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని అన్నారు. ప్రభుత్వం కొంతకాలం శుష్క రాజకీయాలు, కూల్చివేతలను ఆపి బాధితులను ఆదుకోవడంపై సంపూర్ణంగా దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. ఇప్పటికే తక్షణ సహాయ చర్యలు అందలేదని జనం తమ ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వం బాధ్యతాయుతంగా మనసుపెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలన్న ఆయన, విద్యుత్ సరఫరాను పునర్దరించాల్సిన చోట వేగంగా చర్యలు తీసుకోవాలని, ఆహారం నీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. అసలే రాష్ట్రం విష జ్వరాలతో విలువిలలాడుతున్నదని, వరదల వల్ల మరింత విజృంభించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని శాఖలు అప్రమత్తం కావాలని, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరానికి పది వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Also Read: ఖమ్మంలో వరద ముంచెత్తిన ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

పది వేలు ప్రకటించిన ప్రభుత్వం

వర్షాలు, వరదలపై హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్‌తోపాటు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి పాల్గొన్నారు. వరదల కారణంగా చనిపోయిన వారికి ఇచ్చే ఎక్స్‌గేషియా 4 లక్షలను 5 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. అలాగే, దెబ్బతిన్న పంటలకు ఒక్కో ఎకరానికి పది వేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు సీఎం. ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు తక్షణ సాయంగా రూ.5 కోట్లు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అంచనాలో ప్రభుత్వం విఫలం

ఖమ్మం జిల్లా కాకరవాయిలో 52 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వరదల నేపథ్యంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ మున్నేరు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉందంటూ విమర్శలు చేశారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఉపయోగం లేదని, వరదను అంచనా వేయడంలో సర్కారు పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. వాతావరణ శాఖ ముందే హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోలేదన్న పువ్వాడ, ప్రజలకు సహాయక చర్యలు అందించడంలోనూ ఫెయిల్ అయ్యిందని అన్నారు.

Related News

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

Big Stories

×