Ushasri Charan: వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె ఒక వెలుగు వెలిగారు.. కానీ ఓటమి తర్వాత సీన్ టోటల్గా రివర్స్ అయింది. సొంత పార్టీ శ్రేణులే ఇప్పుడు ఆమెపై కత్తులు నూరుతున్నాయి. కేవలం క్యాడర్ మాత్రమే కాదు.. పార్టీలోని కీలక నేతలతో కూడా ఆమెకు అస్సలు పొసగడం లేదట. ‘ఉంటే ఉంటారు.. పోతే పోతారు’ అన్న రీతిలో సాగుతున్న ఆమె వ్యవహారం ప్రస్తుతం ఆమె ఇన్చార్జ్గా ఉన్న నియోజకవర్గంతో పాటు జిల్లా రాజకీయాల్లో సైతంహాట్ టాపిక్గా మారింది. వలస నాయకురాలైన ఆమెకే అంతుంటే… మాకెంత ఉండాలని ముందు నుంచి వైసీపీని అంటిపెట్టుకుని ఉన్న నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారంట. ఇంతకీ ఎవరా నాయకురాలు? ఏంటా కథ?
మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ .. వైసీపీ అధికారం కోల్పోయాక పెనుగొండ నియోజకవర్గంలో వైసీపీ ఇన్చార్జ్గా చక్రం తిప్పుతున్న ఆమె శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదం అవుతోంది. అంతా నా ఇష్టం అంటూ.. ఆమె ఒంటెద్దు పోకడలు పోతున్నారని వైసీపీ క్యాడర్ అగ్గిమీద గుగ్గిలమవుతోందట. అసలు ఉషశ్రీ చరణ్పై వైసీపీ శ్రేణులు ఎందుకు అంత వ్యతిరేకత పెరిగిపోతుందన్న చర్చ పార్టీలో నడుస్తుందట. గత ప్రభుత్వంలో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించిన ఉషశ్రీచరణ్ను, జగన్ తనదైన మార్పులు చేర్పుల లెక్కలతో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న కళ్యాణదుర్గం నుంచి ఎన్నికల ముందు పెనుగొండకు మారారు.
పెనుగొండకు వచ్చినప్పుడు ఎన్నికల్లో గెలుపుకోసం అందర్నీ కలుపుకుని పోయిన ఉషశ్రీ.. ఓటమి తర్వాత తనలోని మరో కోణం చూస్తున్నారని..కార్యకర్తలు మదనపడుతున్నారు. ఇప్పుడు సమస్య ఓటమి గురించి కాదు.. ఆమె ఏకపక్షంగా వ్యవహారిస్తున్న తీరుతో పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోతోందని, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెనుగొండ నియోజకవర్గంలో మాత్రమే కాదు సత్యసాయి జిల్లాలో కూడా తన మాట వినే నాయకులకు ప్రాధాన్యత ఇస్తూ….పార్టీ కోసం కష్టపడిన పాత కాపులను పట్టించుకోవడం లేదని క్యాడర్ మండిపడుతోంది. ఆ క్రమంలో హిందూపురం పార్లమెంట్ సెగ్మెంట్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వైసీపీలో ఇప్పుడు ‘ఉషశ్రీ వర్సెస్ లోకల్ క్యాడర్’ అన్నట్లుగా యుద్ధం నడుస్తోందంట.
ఉషశ్రీచరణ్ తెలుగుదేశం పార్టీ ద్వారా 2012లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఉన్న సమయంలో 2014లో టీడీపీని వీడి హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. 2014లో తన జన్మస్థలమైన కళ్యాణదుర్గం వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టి, 2019లో అక్కడ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై జగన్ క్యాబినెట్లో కొనసాగారు. కళ్యాణదుర్గం వాస్తవ్యురాలైన ఉషశ్రీపై పెనుగొండలో నాన్ లోకల్ అన్న ప్రచారం రోజురోజుకి ఉద్ధృతమవుతోంది.
స్థానిక నేతలే కాదు.. హిందూపురం పార్లమెంట్ పరిధిలోని కీలక నాయకులతో కూడా ఆమె విభేదాలు కొని తెచ్చుకుంటున్నారకని వైసీపీ శ్రేణులు అధిష్టానానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నాయి. . ముఖ్యంగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్తో ఆమెకు టర్మ్స్ అస్సలు బాలేవన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ఇక ముందు నుంచి పెనుగొండ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకరనారాయణకు, ఉషశ్రీచరణ్ వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో అనంతనపురం లోక్సభ నుంచి పోటీ చేసి ఓడిపోయిన శంకరనారాయణ తిరిగి సొంత సెగ్మెంట్ పెనుగొండకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఉషశ్రీ,, శంకరనారాయణల మధ్య గ్యాప్.. వైసీపీ అధిష్టానం జోక్యం చేసుకున్నా పూడ్చలేనంతగా పెరిగిపోయిందంటున్నారు.
అదలా ఉంటే జిల్లా వైసీపీ అధ్యక్షురాలి హోదాలో తాను చెప్పిన కార్యక్రమాలకు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రావడం లేదని, తన మాటను ఖాతరు చేయడం లేదని ఆమె ఇప్పటికే అధిష్టానానికే ఫిర్యాదు చేశారట. అయితే, కేతిరెడ్డి గురించి పూర్తిగా తెలిసిన అధిష్టానం.. ఉషశ్రీ చరణ్ కంప్లైంట్ను లైట్ తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఇప్పటికే మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ వ్యవహారం తాడేపల్లి వర్గాల దృష్టికి వెళ్ళింది. జగన్ పార్టీని ప్రక్షాళన చేయడానికి చర్యలు తీసుకుంటున్న తరుణంలో.. ఉషశ్రీ చరణ్పై అధిష్టానానికి అందుతున్న వరుస ఫిర్యాదులు ఆమె రాజకీయ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తాయి? ఆమె తన రూటు మార్చుకుంటారా? లేక ఈ వ్యతిరేకత అలాగే కొనసాగుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
Story by: Apparao, Big Tv