Medchal: స్వేచ్ఛ బ్యూరో: నిషేధిత బీజీ-III పత్తి విత్తనాల అక్రమ రవాణాను మేడ్చల్ పోలీసులు భగ్నం చేశారు. పక్కా సమాచారం మేరకు శుక్రవారం మేడ్చల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్-6 సమీపంలో పోలీసులు, ఎస్ఓటీ కుత్బుల్లాపూర్ బృందం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి మహీంద్రా బొలెరో వాహనం (AP39VE4038)ను అడ్డగించారు.
వాహనంలో సుమారు 3000 కిలోల నిషేధిత బీజీ-III పత్తి విత్తనాలను తరలిస్తున్నట్లు గుర్తించి చెవుల నర్సింహులు, తలారి రమేష్ లను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న విత్తనాల విలువ రూ.30 లక్షలు, వాహనం విలువ రూ.8 లక్షలు కలిపి మొత్తం రూ.38 లక్షలుగా పోలీసులు తెలిపారు. పోలీసుల తనిఖీలకు తప్పించుకోవడానికి నిందితులు విత్తనాల బస్తాలను క్యాబేజీ బస్తాల కింద దాచినట్లు వెల్లడైంది.
కర్నూలు జిల్లా నుంచి మహారాష్ట్రలోని నాగ్పూర్కు ఈ సరుకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో ప్రధాన సరఫరాదారు మగులూరి సాంబశివరావు పరారీలో ఉండగా, అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ ఆపరేషన్ను కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ కోటిరెడ్డి ఐపీఎస్ పర్యవేక్షణలో, అదనపు డీసీపీ విశ్వప్రసాద్, ఏసీపీ శంకర్రెడ్డి, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్, మేడ్చల్ డీఐ కిరణ్ బృందం విజయవంతంగా నిర్వహించింది. నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజలు కూడా సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ఐదుగురి పరిస్థితి అత్యంత విషమం!