Vijayashanthi: రాములమ్మగా పాపులర్ అయిన విజయశాంతి… సినిమాల్లో క్లిక్ అయినట్లు పాలిటిక్స్ కలిసి రాలేదామెకు.. తెలంగాణా ఉద్యమ సమయంలో సొంత పార్టీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి తర్వాత దాన్ని గులాబీపార్టీలో విలీనం చేసి , అప్పట్లో టీఆర్ఎస్ ఎంపీగా గెలిచారు.. తన స్పీచ్లో పంచ్ డైలాగులు విసురుతూ మంచి పేరే తెచ్చుకున్నారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో పార్టీలు మారి చివరకి హస్తం నీడకు చేరి ఎమ్మెల్సీ పదవి దక్కించుకోగలిగారు. .ఎమ్మెల్సీ పదవి వరించిన నాటి నుంచి ఆమె సైలెంట్గానే ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలను ప్రెస్టేజియస్గా తీసుకుని పావులు కదుపుతున్నప్పటికీ రాములమ్మ ఎక్కడా కనిపించడం లేదు.. కాంగ్రెస్లో చేరినప్పుడు బాధ్యతలు ఇస్తే కదా పని చేయాలనిపిస్తుంది అన్న ఆ లేడీ అమితాబ్.. ఇంకేమైనా పదవి ఆశిస్తున్నారా?
మాజీ ఎంపీ, ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ విజయశాంతి తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించారు… తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశారు..రాష్ట్ర సాధన కోసం పార్టీని అప్పటి టీఆర్ఎస్లో విలీనం చేశారు… కేసీఆర్కు దేవుడిచ్చిన చెల్లెలు అనిపించుకున్న ఆమె ఆ పార్టీ నుంచి మెదక్ ఎంపీగా మొదటి సారి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచారు. అఫ్కోర్సు అదే మొదటి సారి చివరిసారి అనుకోండి .. అది వేరే విషయం.. ఆ తర్వాత గులాబీ పార్టీలోఅనేక అవమానలు భరించి చివరకు బయటకొచ్చారు.. అదేలా ఉన్నా రాజకీయాల్లో ఆమె ఒక ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో లేడీ అమితాబ్ అనిపించుకున్న రాములమ్మ ఆ ఇమేజ్తోనే రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఒక్కప్పుడు ఫైర్ బ్రాండ్ ఏమో కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయ్యాక కూడా ఆమె సైలెంట్గా ఉండటంపై రకరాల చర్చలు జరుగుతున్నాయి.
2023 అసెంబ్లీ ఎన్నికల కంటే రెండు నెలల ముందు రాములమ్మ కమలం పార్టీ విడిచి మరోసారి హస్తం గూటికి చేరారు. స్టార్ క్యాంపెయినర్గా ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ కనిపించలేదు. కనీసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలపై కూడా మాట్లాడలేదు. ప్రతిపక్షాల విమర్శల పై కౌంటర్స్ ఇవ్వలేదు. అయితే ఎలా చక్రం తిప్పారో? రాజకీయాల్లో ఇక ఆమె పనిఅయిపోయిందంటున్న టైమ్లో ఎవరి ఆశీస్సులు దక్కాయో కాని సడన్గా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అయ్యారు…. ఆ సమయంలో ఇన్ని రోజులు మౌనంగా ఉన్నారు, పార్టీకి దూరంగా ఉన్నారేందుకని అడిగితే .. మనకంటూ ఏవైనా బాధ్యతలు అప్పటిస్తే కదా పని చేయడానికి అని డైలాగ్ కొట్టారు. ఇప్పుడు తనకు పార్టీ బాధ్యత ఇచ్చింది కాబట్టి బాధ్యతగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు.
వాస్తవానికి విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టినప్పుడు కాంగ్రెస్లోనే అనేక విమర్శలు వచ్చాయి.. ఏఐసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ 2017 నుండి పార్టీ లో ఉన్నవారికే పదవులని బాధ్యతలు తీసుకున్నప్పుడే ప్రకటించారు. ఇప్పటికి పార్టీ కార్యవర్గాల ఏర్పాటులో అదే లైన్ ఫాలో అవుతున్నారంటున్నారు. అయితే రాములమ్మ 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి కమలం గూటికి వెళ్ళారు. గులాబీ పార్టీలో మెదక్ ఎంపీగా గెలిచిన ఆమెను తర్వాత కేసీఆర్ పక్కన పెట్టేయడంతో కాంగ్రెస్ పంచకు చేరారు. తర్వాత కాషాయకండువా కప్పుకుని కేసీఆర్ని గద్దె దించడమే తన లక్ష్యమని, అది బీజేపీతోనే సాధ్యమని భారీ స్టేట్మెంట్లు ఇచ్చారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో అంత సీన్ లేదని తేలిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకేముంది రాములమ్మ ప్లేట్ ఫిరాయించారు. యూటర్స్ తీసుకుని తిరిగి హస్తం నీడకు చేరారు. మరి ఆమెకు కాంగ్రెస్లో ఎమ్మెల్సీ పదవి ఎలా ఇచ్చారన్నదని సమాధానం లేని ప్రశ్నగానే మిగిలింది. పార్టీ కోసం పని చేస్తున్న అనేకమంది సీనియర్లు ఉన్నా.. వారిని కాదని రాములమ్మని శాసనమండలికి ఎంపిక చేయడంపై ఇప్పటికీ కాంగ్రెస్ వర్గాల్లో చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
ఎలాగొలా పదవి దక్కించుకున్నారు సరే… పోనీ ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాతైనా రాములమ్మ యాక్టివ్ అయ్యారా అంటే అదీలేదు. ఎమ్మెల్సీ పదవి వరించిన తర్వాత బీఆర్ఎస్ నాయకుల విమర్శలకు విజయశాంతి గట్టి కౌంటర్స్ ఇస్తారని అందరు భావించారు. గులాబీనేతలకు రాములమ్మ ఐతే బారాబర్ కౌంటర్లు ఇస్తారని కాంగ్రెస్ శ్రేణులు భావించాయి. గులాబీపార్టీలో ఎదుర్కొన్న అవమానాలు గుర్తు చేసుకునైనా ఆమె బదులు తీర్చుకుంటారనుకున్నారు. కేసీఆర్ను రాజకీయంగా దగ్గర నుంచి చూసిన వ్యక్తి కాబట్టి ఆయన్ని టార్గెట్ చేయడం ఖాయమని అందరూ భావించారు. అయితే ఆమె నోరు విప్పలేదు. ఆఖరికి బీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ కాంగ్రెస్ను టార్గెట్ చేసినా… ఎమ్మెల్సీ రాములమ్మ తనకు సంబంధం లేనట్లు ఉండిపోవడం తీవ్ర విమర్శల పాలైంది.
పహాల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత సర్కార్ నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో మాత్రం అటెండెన్స్ వేయించుకున్నారు. బీసీ జిల్లును గవర్నర్ ఆమోదించి రాష్ట్రపతికి పంపిన తరుణంలో బీసీ నాయకులు గవర్నర్కి ధన్యవాదాలు తెలపడానికి వెళ్ళిన సమయంలో కనిపించారు. అంతే పార్టీపై ప్రత్యర్ధుల విమర్శలను తిప్పకొట్టడం, ప్రభుత్వ పథకాల ప్రచారాం వంటి వాటితో టచ్ మీ నాట్ అన్నట్లే వ్యవహరిస్తున్నారు. కనీసం ఎమ్మెల్సీ పదవి వచ్చాకైనా ప్రతిపక్షాలపై ఘాటు కామెంట్స్ చేస్తూ సర్కార్ కి సపోర్ట్ గా ఉంటారనుకుంటే ఆది లేదని.. దాంతో పార్టీ వర్గాలు ..రాములమ్మా…. ఎక్కడమ్మా అంటున్నాయి. ఇక మరోవైవు ఎమ్మెల్సీ కాదు విజయశాంతి పదవి ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పదవి వచ్చాకే మౌనం వీడతారేమో? అని రాములమ్మ ఆశలపై సెటైర్లు వినిపిస్తున్నాయి.
Also Read: భూమా బ్రాండ్ ఇమేజ్కు సొంత మనుషులే డ్యామేజ్ చేస్తున్నారా? ఆళ్లగడ్డలో అసలేం జరుగుతోంది?
Story by: Apparao, Big Tv