జంతర్ మంతర్ను పూర్తిగా ఎత్తేద్దామనే అనుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం. అచ్చంగా ఇక్కడ మన కేసీఆర్ ధర్నా చౌక్ విషయంలో చేసిన ఆలోచన మాదిరిగానే. కానీ పరిస్థితులు ఎలా ఉంటాయా? అని సమాలోచనలు చేస్తున్న వేళ.. ఓ పిల్ వేశారు ఒకరు సుప్రీం కోర్టులో. అక్కడ జంతర్మంతర్ ఉండటం వల్ల వస్తున్న ఇబ్బందులను ఏకరువు పెట్టాడు. ఇప్పటి వరకు రాని సమస్యలన్నీ కాక్రోచ్ జనతా పార్టీ మొన్న తలపెట్టిన ఉద్యమం నాటి నుంచి కేంద్రం దీనిపై సీరియస్గా నజర్ పెట్టింది. ఆ పిల్ కూడా సరిగ్గా తగిలింది సుప్రీంకు.
అందుకే అత్యున్నత న్యాయం స్థానం కూడా పిల్ వేసిన పిటిషన్ దారు అభిప్రాయాలతో దాదాపుగా అంగీకరించినట్టుగా మాట్లాడింది. ఇటు కేంద్ర ప్రభుత్వానికి, అటు ఢిల్లీ ప్రభుత్వానికి కూడా సూచనలు చేస్తూ.. మరో ప్రత్యామ్నాయం వెతుక్కోవడమే బెటర్ అని చెప్పేసింది. ఇప్పటికే దీనిపై డేగ కన్ను పెట్టింది కేంద్రం. మెరుపు ధర్నాలంటూ ఓ క్షణం లో ఎటువైపు నుంచి ఎవరు వచ్చి పడతారో తెలియని భయానక పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో.. భారీ సెక్యూరిటీని కూడా పెట్టింది అక్కడ.
కాకులు దూరని కారడవిలా.. ఇప్పుడు జంతర్ మంతర్ వద్దకు ఎంట్రీ ఇవ్వాలంటే అంత ఆశామాషీ కాదు. అక్కడ ఆందోళన చేయాలంటే ..అంతకు ముందుగా తీసుకోవాల్సిన పర్మిషన్.. జేజేమ్మలు దిగి వచ్చిన వచ్చేలా లేదు. అట్లాంటి కండిషన్లు పెట్టారు. సుప్రీం సూచనకు ముందే దీన్ని తన కబంధ హస్తాల్లోకి లాక్కున్నది కేంద్రం. పేరుకు మాత్రమే దాన్ని అలా మిగిల్చింది. ఇక్క అక్కడ ఎలాంటి ఆందోళనలు ఉండవు.. నినాదాలు హోరెత్తవు.. అన్నట్టుగా సైలెంట్ మోడ్లోకి తీసుకుపోయింది ఆ ఉద్యమ వేదికను.
ఇప్పుడు సుప్రీం వ్యాఖ్యలు కూడా కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు మరింత బలాన్నిచ్చాయి. కాగల కార్యం గంధర్వులు తీర్చిన చందంగా.. కేంద్రానికి కావాల్సిన కార్యం సుప్రీం ద్వారా పరిష్కారం కానుందని సంబరపడుతున్నది కేంద్రంలోని బీజేపీ.ఇంకేముంది..? ఇక దీని చుట్టూ ఇనుప కంచెలు అల్లేస్తారు కావొచ్చు. చీమ చిటుక్కుమన్నా అక్కడ కేంద్రంలోని పెద్దలకు వినిపించేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటారు కావొచ్చు. మ్యూజియంలో వస్తువులా ఇప్పుడు జంతర్ మంతర్ను చూడాలంటే.. చారిత్రక ఉద్యమాల నేపథ్యాన్ని తరిచి చూసుకోవాలంటే.. మొన్నటి బొద్దింకల వీరోచిత పోరాటానికి సాక్షంగా ఉన్న ఈ స్థలాన్ని సందర్శించాలంటే.. అంత ఈజీ కాదేమో. అసలు సాధ్యమే కాదేమో అంటే సబబేమో!
ఏలికల వారి ముడ్డి కిందకు నీళ్లొచ్చే పనులు జరుగుతున్నప్పుడు.. ఏ చిన్న నినాదం వినిపించినా గజ్జున వణుకుతారు. అలాంటి నిలదీతలు, ప్రశ్నలు వినాలని ఏండ్లుగా తిష్టవేసిన ఈ పాలకులు కోరుకోరు. ఆ కోరికల నోరు విప్పిన కోరలను కొరికేయాలనుకుంటారు. ఆ నోరే లేవకుండా చేద్దామనే భ్రమలో.. ఆ ప్రాంతానికి తాళం వేయడం ద్వారా ఆ నోళ్లకూ తాళం పడుతుందని ఆశించి ఊహిస్తారు. ఆ భ్రమలన్నీ తొలగించేలా మళ్లీ ఉద్యమాలు ఏదో ఒక మూల నుంచి లేస్తూనే ఉంటాయి. నినాదాలు వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రత్యామ్నాయం ఎక్కడో చూపాలి కేంద్రం. ఎక్కడో మారుమూల.. ఓ చిన్న ప్రాంతమేదైనా చూపిస్తారేమో!