AP Politics: ముందు చూస్తే గొయ్యి వెనుక చూస్తే నుయ్యి .. అన్న నానుడి అచ్చంగా వైసీపీ నుంచి బీజేపీలో చేరిన ఎమ్మెల్సీలకు వర్తిస్తుందంటున్నారు. వైసీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నామంటూ రాజీనామా లేఖలు అధిష్టానానికి పంపి, బీజేపీ కండువా కప్పేసుకున్నారు జకియా ఖానమ్, పోతుల సునీత… వారికి ఇప్పుడు పెద్ద సమస్యే తలెత్తిందంట. ఎమ్మెల్సీలుగా రాజీనామా చేసేశాం కాబట్టి ఏదో ఒకలా మరళా ఎమ్మెల్సీ వచ్చేస్తుందిలే అనుకున్నారు. కాని బీజేపీలో తిరిగి ఎమ్మెల్సీ కాదు కదా వారికి ఇప్పుటి దాకా పార్టీ లో ఏం పదవి ఇస్తున్నారో కూడా క్లారిటీ లేదంట.. దీంతో ఖంగుతింటున్న వారు డైలమాలో పడ్డారంట.
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానమ్, మరో ఎమ్మెల్సీ పోతుల సునీత ఇద్దరూ గతంలో వైసీపీ నుంచి శానసమండలికి ఎంపికయ్యారు. కాని వైసిపి పార్టీ అధికారం కోల్పోవడంతో జకియా ఖానమ్, పోతుల సునీత ఇద్దరు పార్టీ సభ్యత్వానికి, డిప్యూటీ చైర్మన్, ఎమ్మెల్సీ పదవులకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి బిజెపి కండువా కప్పుకున్నారు. అయితే డిప్యూటీ చైర్మన్ జకియా ఖానమ్ మండలి సభ్యత్వానికి చైర్మన్ ఫార్మేట్లో రాజీనామా చేయడంతో చైర్మన్ వద్ద కు ఫైల్ చేరింది. ఆయన వివరణ కోరగా ఆమె రాజీనామాను వెనక్కి తీసుకోవడం ప్రస్తుతం బీజేపీలో కలకలం రేపుతోందంట. జకియా ఖానమ్ ఎమ్మెల్సీ పదవి మరో ఆరు నెలల్లో ముగుస్తుండడంతో వెనక్కి తీసుకున్నారు అన్న చర్చ జరుగుతుంటే …బిజెపి లో ఎటువంటి పదవి ఇవ్వలేదు అందుకనే ఆ పదవిలో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు నిర్ణయించుకున్నారని సమాచారం.
మరో పార్టీ మారిన ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ఎదిగారు. ప్రత్యర్ధి పార్టీలపై విరుచుకుపడడం ఆమె నైజం. అందుకే టీడీపీలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వచ్చిన ఆమెకు జగన్ సైతం ఎమ్మెల్సీ పదవి ఇచ్చారనే ప్రచారం ఉంది. కాని జగన్ అధికారం కోల్పోవడం ఆ తర్వాత ఈమె కూడా బిజెపి లో చేరడం అన్నీ జరిగిపోయాయి. అయితే తనకు ఎమ్మెల్సీ పదవి కాలం ఉంది కాబట్టి, అది కూడా మరో రెండేళ్ళ పాటు పదవి సమయం ఉండడంతో తర్వాత కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఎమ్మెల్సీ ఇస్తారులే అనుకొని ఆశపడ్డారంట. కాని బిజెపి లో చేరిన తర్వాత ఇక్కడి పార్టీలో పరిస్ధితి చూసి ప్రస్తుతం ఆమె సైలెంట్ గా ఉండిపోయారంట.
శాసనమండలి చైర్మన్ రాజీనామాకు సంబంధించి నోటీసులు ఇచ్చినా.. ఆమె ఏ మాత్రం స్పందించడం లేదంట. కూటమి నుంచి ఎమ్మెల్సీ పదవి పునరుద్ధరిస్తారా అని అడిగితే మాత్రం జాయిన్ అయ్యాక చూద్దాములే అన్నారు కాని.. బీజేపీ నేతలు ఖచ్చితంగా హామీ మాత్రం ఇవ్వలేదంట. దీంతో ఆమె ఇప్పుడు ఎమ్మెల్సీకి రాజీనామా చేసేస్తే ఉన్న పదవి కూడా పోతుందేమో అన్న డైలమాలో ఉందంట.
బీజేపీలో డజన్ల కొద్దీ సీనియర్ నేతలు ఉన్నారు. దాంతో ఇప్పుడు ఎమ్మెల్సీలుగా జకియా ఖానమ్, పోతుల సునీత పార్టీలో చేరినా వాళ్ళను ఎమ్మెల్సీలుగా పునురుద్ధిరించే అవకాశం అయితే కనిపించడం లేదు. చాలా ఏళ్ళుగా పార్టీనే నమ్ముకొని ఉండి పోయిన వారిని కాదని కొత్తవారికిఇస్తే పార్టీలో ప్రకంపనలు వచ్చే అవకాశం లేకపోలేదు. దీంతో అధిష్టానం కూడా జకియఖానమ్, పోతుల సునీత ను పార్టీ కోసం పనిచేయండి పదవులు తర్వాత చూద్దామని చెప్పేశారట.
దీంతో ఎమ్మెల్సీల పదవీ కాలం అవ్వకుండానే రాజీనామాలు ఆమోదింపచేసుకుంటే ప్రోటోకాల్ ఉండదు కాబట్టి … పదవీ కాలం అయ్యాక నిర్ణయం తీసుకుందాంలే అని భావిస్తున్నారంట..బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు. మొత్తం మీద పార్టీ సభ్యత్వాలకైతే రాజీనామా చేసేశారు కాని ఆ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీలను మాత్రం వదులుకునేందుకు ఇష్టపడడం లేదు. ఏది ఏమైనప్పటికీ వైసిపికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన వారికి ఆ పార్టీలో ఎటువంటి సముచిత స్ధానం దక్కుతుందో చూడాలి మరి.
Story By Ramireddy, Big Tv