AIIMS Jobs: న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NORCET 11) కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 2,218 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలు.. ఎయిమ్స్ న్యూఢిల్లీతో పాటు ఇతర భాగస్వామ్య ఎయిమ్స్ సంస్థలు, ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 13, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నియామకం గ్రూప్ బి నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల కోసం నిర్వహిస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం లెవల్ 7 పే మ్యాట్రిక్స్ కింద వేతనం, ఇతర సౌకర్యాలు అందుతాయి.
ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ ప్రారంభ బేసిక్ పే రూ.44,900 (పే లెవల్-7). నెలకు సుమారు రూ.81,977 గ్రాస్ వేతనం లభిస్తుంది. NPS, PF కోతల తర్వాత చేతికి సుమారు రూ.65,000 నుంచి రూ.78,000 వరకు జీతం అందుతుంది.
అభ్యర్థులు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లేదా రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన సంస్థ నుంచి బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. అలాగే నర్స్ అండ్ మిడ్వైఫ్గా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లేదా రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ (GNM) డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారు కనీసం 50 పడకల ఆసుపత్రిలో రెండు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. ఈ అనుభవం కోర్సు పూర్తి చేసి, ఫలితాలు వచ్చిన తర్వాత, రిజిస్ట్రేషన్ పూర్తయిన అనంతరం సంపాదించి ఉండాలని ఎయిమ్స్ స్పష్టం చేసింది.
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు ఉంటుంది. ఆగస్టు 13, 2026 నాటికి ఉన్న వయస్సును పరిగణనలోకి తీసుకుంటారు.
జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.3,000 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు రూ.2,400గా నిర్ణయించారు. బెంచ్మార్క్ దివ్యాంగులు (PwBD) ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. సాధారణ అభ్యర్థులకు ఫీజు రీఫండ్ ఉండదు. అయితే పరీక్షకు హాజరై సర్టిఫికెట్ ధృవీకరణ పూర్తిచేసిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు తిరిగి చెల్లిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూలై 24 నుంచి ఆగస్టు 13, 2026 వరకు కొనసాగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్వోసీని ఆగస్టు 18లోపు సమర్పించాలి. పరీక్ష నగర సమాచారం సెప్టెంబర్ 3న విడుదల అవుతుంది. అడ్మిట్ కార్డులు సెప్టెంబర్ 9న అందుబాటులోకి వస్తాయి. నార్సెట్ తొలి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష సెప్టెంబర్ 12న, రెండో దశ పరీక్ష సెప్టెంబర్ 30న నిర్వహిస్తారు.
Also Read: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తొలిసారి తీసుకుంటున్నారా? ముందు ఈ 4 విషయాలు తప్పక చెక్ చేయండి
నార్సెట్ – 11 పరీక్ష.. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. దరఖాస్తు సమయంలో ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాన్ని తర్వాత మార్చేందుకు అవకాశం ఉండదని ఎయిమ్స్ స్పష్టం చేసింది.
Also Read: బ్యాంక్ క్లర్క్ జాబ్స్ గురూ.. రూ.40000 జీతం, డిగ్రీ ఉంటే చాలు
ప్రభుత్వ రంగంలో నర్సింగ్ ఉద్యోగం కోరుకునే వారికి ఎయిమ్స్ నార్సెట్ – 11 మంచి అవకాశం. అర్హతలు ఉన్న అభ్యర్థులు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకుని, రెండు దశల పరీక్షలకు సక్రమంగా సిద్ధమైతే ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది.
Also Read: ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేశాడు కట్ చేస్తే ఈ రోజు కోటీశ్వరుడు.. రోజుకు రూ.6.3 లక్షల ఆదాయం