Amazon-Walmart: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన డబుల్ టారిఫ్పై వ్యాపారవర్గాలు ఆలోచనలో పడ్డాయా? పన్నుల భారం ఎవరిపై పడనుంది? కొనుగోలు చేసేవారిపైనా? ఉత్పత్తి చేస్తున్న వారిపైనా? ఇవే ప్రశ్న చాలామందిని వెంటాడుతున్నాయి. ఇరుదేశాల మధ్య ట్రేడ్ వార్ నేపథ్యంలో అమెరికా రిటైల్ దిగ్గజాలు అలర్ట్ అయ్యాయి. ఈ వ్యవహారం సద్దు మణిగేవరకు భారత్ నుంచి వచ్చే వస్తువుల దిగుమతులను నిలిపి వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పగబట్టాడు. భారత్ వస్తువులపై 50 శాతం సుంకాలు వేయడంతో వ్యాపార వర్గాల్లో అయోమయం నెలకొంది. ఇరుదేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో అమెరికా రిటైల్ వ్యాపార దిగ్గజాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్ నుంచి స్టాక్ దిగుమతులను నిలిపి వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ, ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
దుస్తులు, ఫ్యాషన్ వస్తువులపై ఎగుమతులను నిలిపివేయాలని కోరుతూ అమెరికా వ్యాపారసంస్థలు భారత్లోని టోకు వర్తకులకు మెయిల్స్ పంపినట్లు అందులోని సారాంశం. వాటిలో వాల్మార్ట్, అమెజాన్, టార్గెన్, గ్యాప్ లాంటి సంస్థలు వాటిని పంపినట్లు తెలుస్తోంది. సుంకాల పెంపుతో ఉత్పత్తులపై పడే అదనపు భారం మోసేందుకు కొనుగోలుదారులు సిద్ధంగా లేరన్నది అసలు సారాంశం. ఒకవేళ పంపిస్తే ఆ ఖర్చును ఎగుమతిదారులు భరించాలని ఆయా సంస్థలు డిమాండ్ చేస్తున్నట్లు రాసుకొచ్చాయి.
అమెరికా సుంకాల పెంపుతో భారత ఉత్పత్తులపై ధరఅమాంతంగా పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నాయి. కొనుగోళ్లు ఆగిపోతే ఇండియా నుంచి అమెరికాకు వెళ్లే ఆర్డర్లు దాదాపు 50 శాతం తగ్గవచ్చని వస్త్ర పరిశ్రమ వర్గాలు అంచనా. ఫలితంగా ఆయా రంగాలకు భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. భారత్లో వెల్ స్పన్ లివింగ్, గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్, ఇండోకౌంట్, ట్రైడెంట్ సంస్థలు టెక్స్టైల్ వస్తువులను ఎగుమతులు చేస్తున్నాయి. 40 నుంచి 70 శాతం అమెరికాకు పంపిస్తున్నాయి.
ALSO READ: భారీ షాకిచ్చిన బంగారం ధరలు, తులం ఎంతో తెలుసా?
సుంకాల పెంపు నేపథ్యంలో అమెరికా నుంచి వచ్చే ఆర్డర్లు తగ్గుతాయని ఎగుమతిదారులు ఆందోళన. భారతీయ దుస్తులు, ఫ్యాషన్ ఉత్పత్తులకు అమెరికా అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. గతేడాది ఈ రంగానికి సంబంధించి 36.61 బిలియన్ డాలర్ల మేరా వస్తువులను భారత్ ఎగుమతి చేసింది. అందులో 28 శాతం అమెరికాకు వెళ్లాయి. బంగ్లాదేశ్, వియత్నాం లాంటి దేశాలపై 20 శాతం టారిఫ్లు వేసింది ట్రంప్ సర్కార్. అమెరికా సంస్థలు టెక్స్టైల్ ఉత్పత్తుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.