Ashwini Vaishnaw: డిజిటల్ మీడియా రంగంలో న్యూస్ పబ్లిషర్లు.. కంటెంట్ క్రియేటర్ల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. న్యూఢిల్లీలో జరిగిన డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (DNPA) కాంక్లేవ్లో కేంద్ర ఐటీ.. సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రసంగిస్తూ డిజిటల్ ప్లాట్ఫామ్లకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. వార్తా సంస్థలు.. సృజనాత్మక కంటెంట్ అందించే వారికి డిజిటల్ మాధ్యమాలు ఇచ్చే రెవెన్యూ వాటా పారదర్శకంగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. పబ్లిషర్ల కష్టార్జితంతో లాభాలు గడిస్తున్న గ్లోబల్ టెక్ కంపెనీలు వారికి సరైన వాటా ఇవ్వకపోవడం ఆందోళనకరమని మంత్రి అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో వార్తలు.. సమాచారం వ్యాప్తిలో గూగుల్.. మెటా వంటి భారీ ప్లాట్ఫామ్ల పాత్ర పెరిగిపోయింది. అయితే ఈ ప్లాట్ఫామ్లు పబ్లిషర్ల కంటెంట్ను వాడుకుంటూ ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో సింహభాగాన్ని అవే ఉంచుకుంటున్నాయనే ఫిర్యాదులు పెరిగాయి. దీనిపై స్పందించిన అశ్వినీ వైష్ణవ్.. చెల్లింపుల విషయంలో పారదర్శకత లేకపోతే సహించేది లేదని స్పష్టం చేశారు. కంటెంట్ క్రియేటర్లకు న్యాయబద్ధంగా అందాల్సిన వాటా విషయంలో స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని సూచించారు. లేనిపక్షంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని కఠినమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
సమాచార వ్యవస్థ బలోపేతం కావాలంటే న్యూస్ పబ్లిషర్లు ఆర్థికంగా నిలదొక్కుకోవడం అత్యవసరమని మంత్రి పేర్కొన్నారు. నకిలీ వార్తల బెడదను అరికట్టడంలో.. వాస్తవాలను ప్రజలకు చేరవేయడంలో పబ్లిషర్ల కృషి వెలకట్టలేనిదని కొనియాడారు. ఇటువంటి పరిస్థితుల్లో డిజిటల్ ప్లాట్ఫామ్లు తమ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ పబ్లిషర్లను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. పారదర్శకమైన ఆదాయ పంపిణీ నమూనాను అమలు చేయడం ద్వారా మాత్రమే ఆరోగ్యకరమైన డిజిటల్ వాతావరణాన్ని నిర్మించగలమని ఆయన ఉద్ఘాటించారు.
మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఇప్పటికే ఐటీ నిబంధనలను బలోపేతం చేస్తున్నామని.. పబ్లిషర్ల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలను కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. డిజిటల్ ప్లాట్ఫామ్లు తమ బాధ్యతను గుర్తించి పబ్లిషర్లతో స్నేహపూర్వక ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు. లేదంటే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మంత్రి పరోక్షంగా హెచ్చరించారు.
Read Also: Rahul Gandhi: మోదీ జీ.. ఇది భారతదేశం.. ఉత్తర కొరియా కాదు.. రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు