ATM transaction: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తీసుకొచ్చిన కొత్త నియమాలు బ్యాంకింగ్ లావాదేవీలపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ఏటీఎం వినియోగం విషయంలో వినియోగదారులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా మనం బ్యాంక్ ఖాతా తీసుకుంటే దానికి ఏటీఎం కార్డు ఇస్తారు. డబ్బు అవసరమైతే బ్యాంకుకి వెళ్లకుండానే సమీపంలోని ఏటీఎంలో నుంచి తీసుకోవచ్చు. ఒకే బ్యాంక్ ఏటీఎం కాకుండా, ఇతర బ్యాంకుల ఏటీఎంలను కూడా వాడుకోవచ్చు. కానీ ఇష్టం వచ్చి నన్ని సార్లు ఉచితంగా వాడుకోవచ్చని అనుకోవడం పొరపాటు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని పరిమితులు పెట్టింది. ఆ పరిమితిని దాటితే ప్రతి అదనపు లావాదేవీకి ఛార్జీలు కట్టాల్సిందే. ఒక్కో ట్రాన్సాక్షన్పై గరిష్టంగా రూ.23 వరకు వసూలు చేస్తారు.
ఆర్బీఐ నిబంధనలు
హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో నెలకు కేవలం 3 సార్లు మాత్రమే ఉచితంగా ఏటీఎం లావాదేవీలు చేసుకోవచ్చు. మెట్రో కాకుండా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 5 సార్లు ఉచితం. ఆ లిమిట్ దాటితే ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, పీఎన్బీ, ఐసీఐసీఐ వంటి బ్యాంకులు వేర్వేరు రీతుల్లో ఛార్జీలు విధిస్తాయి. అయితే ఎస్బీఐ మాత్రం పాత ఛార్జీలనే కొనసాగిస్తుండటం కాస్త ఊరట కలిగిస్తాయి.
Also Read: Vastu Secret: వాస్తు సీక్రెట్.. నెమలి ఈకలతో ఇలా చేస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే
క్యాష్ విత్డ్రా లిమిట్ దాటితే..
ఉచిత లావాదేవీలలో క్యాష్ విత్డ్రా మాత్రమే కాకుండా బ్యాలెన్స్ ఎంక్వైరీ, పిన్ మార్పు, మినీ స్టేట్మెంట్ లాంటివి కూడా చేరుతాయి. కానీ ఆ పరిమితి ముగిసిన తర్వాత ప్రతీ ట్రాన్సాక్షన్కి ఛార్జీలు పడతాయి. ఉదాహరణకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉచిత లావాదేవీలు అయిపోయిన తర్వాత క్యాష్ విత్డ్రా చేస్తే రూ.23 ప్లస్ జీఎస్టీ కట్టాలి. నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలకు రూ.11 ఛార్జ్ పడుతుంది. అయితే క్యాష్ రిసైక్లర్ మెషీన్ ద్వారా డబ్బు జమ చేయడం మాత్రం పూర్తిగా ఉచితం.
ఏటీఎం పరిమితులతో పాటు బ్యాంక్ ఖాతాలో డబ్బు జమలు, విత్డ్రాలకీ కూడా రూల్స్ ఉన్నాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలకంటే ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ లేదా విత్డ్రా చేస్తే పాన్, ఆధార్ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ లావాదేవీల సమాచారం నేరుగా ఇన్కమ్ ట్యాక్స్ శాఖకు వెళుతుందు. దీని ఉద్దేశం నల్లధనాన్ని అరికట్టడం, బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచడం. అందుకే ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలి. తమ ఖాతా ఉన్న బ్యాంక్ ఏటీఎంలోనే ఎక్కువగా ట్రాన్సాక్షన్లు చేయడం మంచిది. ఇలా చేస్తే అదనపు ఛార్జీలు తప్పించుకోవచ్చు.