Carmakers Penalty : కర్భన ఉద్గారాల స్థాయిల్లో ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల్ని పాటించని కార్ల తయారీ సంస్థలు భారీ జరిమానాలు ఎదుర్కొంటున్నాయి. దేశంలోని ప్రధాన కార్ల తయారీ సంస్థలుగా ఉన్న మహీంద్ర, హోండా, కియా, హుందాయ్ తో పాటు మరో నాలుగు కార్ల తయారీ సంస్థలు సైతం ఈ జరిమానా కట్టాల్సి రావచ్చని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం నిర్వహించిన కర్భన ఉద్గారాల పరీక్షల్లో విఫలమైన ఎనిమిది కార్ల తయారీ సంస్థలు మొత్తంగా రూ.7,300 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.
ఇందులో అత్యధికంగా హుందాయ్ మోటార్స్ 2,800 కోట్లు జరిమానా కట్టాల్సి ఉంటుందని ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆ తర్వాత మహీంద్ర మోటార్స్ రూ. 1,800 కోట్లు, కియా మోటార్స్ రూ.1,300 కోట్ల జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. మిగతా మొత్తాల్ని ప్రముఖ కార్ల తయారీ సంస్థలైన రెనాల్డ్, స్కోడా, నిస్సాన్, ఫోర్స్ మోటార్స్ చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న కర్భన ఉద్గారాల ప్రమాణాల్ని పాటించని కారణంగానే ఈ జరిమానాలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
2022 ఆర్థిక సంవత్సరంలో భారత విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE), కార్పొరేట్ సగటు ఇంధన సామర్థ్యం (CAFE) నిబంధనలను కఠినతరం చేసింది.
2023 ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనల్ని అమల్లోకి తీసుకువచ్చింది. వీటి ప్రకారం.. దేశంలోని తయారై, వినియోగంలోకి వచ్చే కార్లు 100 కిలోమీటర్ల దూరానికి 4.78 లీటర్ల ఇంధనానికి మించి ఖర్చు చేయకూడదు. అలానే.. కార్బన్ డైయాక్సైడ్ ఉద్గారాలు సైతం కిలోమీటర్ కి 113 గ్రాములు మించకూడదని ప్రభుత్వం నిబంధనల్ని విధించింది. వీటి అమలులో విఫలమైన సంస్థలకు ప్రభుత్వం జరిమానాలు విధిస్తుందని ముందే హెచ్చరిస్తుంది.
అయితే.. ఈ నిబంధనలు 2023 ఏడాది ప్రారంభం నుంచి అమల్లోకి వచ్చాయి. కాబట్టి ఆ ఏడాదికి జరిమానాను విధించడం సరైంది కాదంటూ కార్ల తయారీ సంస్థలు వాదిస్తున్నాయి. ఏడాది పొడవునా విక్రయించిన నాన్-కంప్లైంట్ వాహనాల సంఖ్య ఆధారంగా జరిమానాలను విధిస్తున్నారు. 2023లో దేశీయంగా రూపుదిద్దుకుంటున్న 18 సంస్థల కార్లను భారత ప్రభుత్వం పరీక్షించింది. సిములేటెడ్ డ్రైవింగ్ పరిస్థితుల్లో ఈ వాహన పరీక్షలు నిర్వహించారు. ఇందులో.. వాహనం ప్రయాణించిన దూరం, ఖర్చు చేసిన ఇంధన వివరాలతో పాటు విడుదల చేస్తున్న కర్భన ఉద్గారాల స్థాయిల్ని పరీక్షించారు. ఈ నిబంధనలు.. 3,500 కేజీలో లోపు బరువుండే పెట్రోల్, డీజిల్, ఎల్ పీజీ, సీఎన్ జీ, హైబ్రీడ్, ఎలక్ట్రిక్ బ్యాటరీ వాహనాలు వర్తిస్తాయని కేంద్రం తెలిపింది. అంతకు ముందు వరకు భారత్ లో కార్పొరేట్ యావరేట్ కార్బన్ డైయాక్సైట్ ఉద్గారాల స్థాయి కిలోమీటర్ కు 130 గ్రాములు ఉండేది. దానిని 2022లో సవరించిన నిబంధనల ప్రకారం.. కిలోమీటర్ కు 113 గ్రాములుగా మార్చారు.
Also Read : ఫ్లాట్ కొంటున్నారా? కచ్చితంగా ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే!
వాతావారణంలోకి విడుదలయ్యే కర్భన ఉద్గారాల స్థాయిల్ని తగ్గించుకోవాలనే లక్ష్యాల్ని సాధించేందుకు గాను అన్ని దేశాలు వాహన కాలుష్యాల్ని కట్టడి చేసేందుకు నిబంధనల్ని రూపొందించాయి. అలా కార్పొరేట్ యావరేజ్ కార్బన్ డైయాక్సైట్ ఉద్గారల విషయంలో యూరోపియన్ యూనియన్ కఠిన నిబంధనల్ని అమలు చేస్తోంది. 2025 నుంచి దేశంలోని కార్ల తయారీ సంస్థలు తప్పనిసరిగా కార్బన ఉద్గారాలను తగ్గించుకుంటూ రావాలని.. 2029 నాటికి కిలోమీటరుకు 93.6 గ్రాముల స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించింది. 2030-2034 మధ్య ఇది 49.5 గ్రాములకు పరిమితం అవ్వాలని కార్ల తయారీ సంస్థలకు నిర్దేశించింది.