Gold: బంగారంపై ఆంక్షలు విధించేందుకు కేంద్రం సిద్ధమవుతుందా? బ్యాంకులకు ఆర్థిక శాఖ ఎందుకు ఆదేశాలు జారీ చేసింది? భవిష్యత్తులో కూడా మరిన్ని పరిమితులు విధించే అవకాశాలున్నాయా? జరుగుతున్న పరిణామాలు దేనికి సంకేతం? ఇవే ప్రశ్నలు సామాన్యులతోపాటు బులియన్ వర్గాలను వెంటాడుతున్నాయి.
బంగారంపై మరిన్ని ఆంక్షలకు సిద్ధమవుతున్న కేంద్రం?
బంగారం కొనుగోళ్లు ఏడాదిపాటు తగ్గించాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రానున్న రోజుల్లో పసిడిపై మరిన్ని ఆంక్షలకు సిద్ధమవుతోంది కేంద్రం. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది.
బంగారం రుణాలకు సంబంధించిన వివరణాత్మక సమాచారాన్ని అందించాలని ఆర్థిక శాఖ.. బులియన్ దిగుమతి చేసుకునే బ్యాంకులను ఆదేశించినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే దిగుమతులు 721 టన్నులకు తగ్గింది. అయినప్పటికీ 2025-26 ఏడాది దేశంలో బంగారు దిగుమతుల బిల్లు 24 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 71.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
బ్యాంకులకు ఆర్థికశాఖ లేఖ, ఏం జరుగుతోంది?
బంగారం దిగుమతుల్లో పాలు పంచుకుంటున్న దాదాపు డజను బ్యాంకులు అంతర్జాతీయ రుణదాతల నుండి బంగారాన్ని అప్పుగా తీసుకుంటాయి. బంగారు రుణాల ద్వారా నగల వ్యాపారులకు అందిస్తాయి. కన్సైన్మెంట్ ఒప్పందం కింద విదేశీ బ్యాంకుల నుండి బంగారాన్ని సేకరించి దేశీయ టోకు కొనుగోలుదారుల నుండి ధృవీకరించబడిన డిమాండ్ ఆధారంగా చెల్లింపులు చేయనున్నాయి.
ఇప్పటికే బంగారం దిగుమతులపై 15 శాతానికి సుంకం పెంచింది కేంద్రం. జూలై 2024కి ముందు స్థాయికి తీసుకురావడం, వెండి దిగుమతులపై ఆంక్షలు విధించడం వంటి పరిణామాల నేపథ్యంలో మరిన్ని చర్యలు ప్రకటించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. జూన్, జూలై నెలల్లో బంగారానికి డిమాండ్ తక్కువగా ఉంటుందని అంటున్నారు కొందరు వ్యాపారులు.
ALSO READ: మార్కెట్లో బంగారం ధరలు పతనం.. అదే దారిలో స్టాక్ మార్కెట్ పతనం
మే నెలలో దిగుమతులు తగ్గినందున విధానపరమైన ఎంపికలను పరిశీలించడానికి ప్రస్తుతం అనుకూలంగా ఉండవచ్చని చెబుతున్నారు. గోల్డ్ మెటల్స్ సామాన్య ప్రజలను ఉద్దేశించినది కాదని, బంగారు ఆభరణాల తయారీదారులు, ఎగుమతిదారులు కోసమని చెబుతున్నారు అధికారులు.
బ్యాంకులకు నగదుకు బదులు బంగారాన్ని లోన్గా ఇస్తాయని అంటున్నారు. బంగారాన్ని బ్యాంకులు ఎలా వినియోగిస్తున్నాయి? వంటి సమాచారాన్ని తెలపాలంటూ బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే రానున్న రోజుల్లో మరిన్ని పరిమితులు విధించే అవకాశాలు ఉందన్నది విశ్లేషకుల మాట.