EPFO UPI Withdraw: ఈపీఎఫ్ఓ.. చందాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. BHIM యాప్ యూపీఐ ద్వారా లావాదేవీలు అనుమతించేలా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నాటికి ఈపీఎఫ్ఓ సభ్యులు యూపీఐ ద్వారా తమ డబ్బులు విత్ డ్రా చేసుకోగలగుతారని అధికారులు అంటున్నారు. ఈ విధానం ద్వారా చందాదారులు తమ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, విత్ డ్రా అర్హత ఉన్న బ్యాలెన్స్ ఎంత, పీఎఫ్ లో 25 % బ్యాలెన్స్ను విడిగా చూపించడం, మొదటి విత్ డ్రాను రూ. 25,000కి పరిమితం చేయడం వంటి కీలక నిర్ణయాలపై ఈపీఎఫ్ఓ బోర్డు చర్చిస్తుంది.
యూపీఐ వ్యవస్థ అభివృద్ధికి మూడు పార్టీలు పాల్గొంటున్నాయి. ఈపీఎఫ్ఓ, C-DAC, NPCI, చెల్లింపుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ సిస్టమ్ రూపకల్పనలో పాల్గొంటున్నాయి. ముందుగా భీమ్ యూపీఐ యాప్ ద్వారా విత్ డ్రాలను అనుమతించనున్నారు. ఇందులో యూపీఐ లింక్డ్ బ్యాంక్ ఖాతాకు నేరుగా పీఎఫ్ డబ్బును జమ చేసుకోవచ్చు. ప్రతి ఈపీఎఫ్ఓ సభ్యుడు భీమ్ యాప్ ద్వారా యూపీఐ సౌకర్యాన్ని పొందగలుగుతారు.
ఈ సదుపాయం ముఖ్యంగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా విత్ డ్రా పొందలేని సభ్యులకు ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండడంతో ప్రతి లావాదేవీకి రూ. 25,000 పరిమితం చేయనున్నట్లు సమాచారం. చందాదారుడు 2-3 లావాదేవీలలో పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకుంటే, పూర్తి మొత్తం విత్ డ్రా పై పరిమితి విధించే అవకాశం ఉందని అధికారి చెప్పారు.
గతేడాది అక్టోబర్లో పీఎఫ్ విత్ డ్రా నిబంధనల సడలింపులో భాగంగా యూపీఐ సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. సోషల్ సెక్యూరిటీ కోడ్ లో మార్పులకు అనుగుణంగా 75%, 25% బ్యాలెన్స్ విత్ డ్రా నిబంధనలు ఏప్రిల్ నాటికి అందుబాటులో ఉంటాయని ఈపీఎఫ్ఓ అధికారి ఒకరు తెలిపారు. గత ఏడాది అక్టోబర్లో జరిగిన బోర్డు సమావేశం తర్వాత ఈపీఎఫ్ఓ విత్ డ్రా నిబంధనలు సడలించారు. విత్ డ్రా విధానాలను 13 నుంచి మూడుకి అంటే ముఖ్యమైన అవసరాలు (అనారోగ్యం, విద్య, వివాహం), గృహ అవసరాలు, మరియు ప్రత్యేక పరిస్థితులకు మార్పు చేశారు.
Also Read: EPFO New Rules: బ్యాంక్ అకౌంట్లా మారనున్న ఈపీఎఫ్, యూపీఐ పిన్తో క్షణాల్లో నగదు బదిలీ
ఉద్యోగం కోల్పోయిన సమయంలో విత్ డ్రా చేసుకునేందుకు కనీస బ్యాలెన్స్, అకాల తుది పరిష్కారం అని మరో రెండు మార్పులు చేసింది. అంటే చందాదారులు తమ పీఎఫ్ మొత్తంలోని 75% విత్ డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 25% కనీస బ్యాలెన్స్గా పీఎఫ్ అకౌంట్ లో మెయింటైన్ చేయాలి.