Uttam Kumar Reddy: హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల విస్తరణ, పునరుద్ధరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మేడారంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సవరించిన అంచనాలకు ఆమోదం తెలపడంతో, సోమవారం వీటికి పరిపాలనా పరమైన అనుమతులు మంజూరయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారికంగా వెల్లడించారు.
మొత్తం ఐదు ప్రధాన ప్రాజెక్టుల కోసం గతంలో ₹447 కోట్లు కేటాయించగా, కాలక్రమేణా పెరిగిన ఆయకట్టు అవసరాలకు అనుగుణంగా ఇప్పుడు ఆ మొత్తాన్ని ₹628.78 కోట్లకు పెంచారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో మొత్తం 1,58,300 ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు అందుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
ప్రధానంగా జవహర్ జానపహాడ్ ఎత్తిపోతల పథకం అంచనా వ్యయం ₹173 కోట్ల నుండి ₹292.98 కోట్లకు పెరిగింది. తొలుత 5,650 ఎకరాల కోసం ప్రతిపాదించిన ఈ పథకాన్ని, రైతాంగం విజ్ఞప్తి మేరకు ఇప్పుడు 10,000 ఎకరాలకు విస్తరించారు. దీనివల్ల పాలకీడు మండలంలోని జానపహాడ్, ఆలింగాపురం, బొత్తాలపాలెం వంటి గ్రామాలతో పాటు కొత్తగా యెల్లాపురం, నాగిరెడ్డి గూడెం వంటి ఇతర గ్రామాల రైతులకు కూడా లబ్ధి చేకూరనుంది.
ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన పంప్ హౌజ్ పనులు వేగంగా సాగుతున్నాయని, 2026 ఖరీఫ్ నాటికి వీటిని పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు మంత్రి తెలిపారు. అలాగే, కోదాడ నియోజకవర్గ పరిధిలోని ఆర్-9 ఎత్తిపోతల పథకం ద్వారా 2,300 ఎకరాలకు నీరందించే పనులకు కూడా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
మరోవైపు, హుజూర్నగర్ మరియు కోదాడ పరిధిలోని దాదాపు 1,08,000 ఎకరాలకు జీవనాడి అయిన ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ పునరుద్ధరణ మరియు ఆధునీకరణ పనులకు ప్రభుత్వం ₹222.22 కోట్లను మంజూరు చేసింది. దీనితో పాటు సాగర్ ఎడమ కాలువ (NSLBC) లైనింగ్ పనులకు ₹29.02 కోట్లు, జానపహాడ్ బ్రాంచ్ కెనాల్ సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ పనులకు ₹53.68 కోట్లు కేటాయించారు.
నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి ఈ ప్రాజెక్టులకు అనుమతులు తీసుకురావడం సంతృప్తిని ఇచ్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సాగునీటి కొరతతో ఇబ్బంది పడుతున్న చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరు అందించేలా యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Read Also: మా బట్టలకు మీరేమైనా పైసలిస్తున్నారా?: మహిళా ఐఏఎస్ అధికారుల ట్రోలింగ్పై రేణుక చౌదరి ఫైర్!