EPFO: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త చెప్పేసింది కేంద్రం. ఉపయోగంలో లేని పాత పీఎఫ్ ఖాతాలను యాక్టివేట్ చేసుకోవాలనుకునే ఉద్యోగులకు ఊహించని వార్త. యూఏఎన్- UAN అనుసంధానం కాకుండా పాత ఖాతాలను గుర్తించి సులభంగా యాక్టివేట్ చేసుకునేందుకు ‘ఈ-ప్రాప్తి’-E-PRAAPTI ఆధార్ ఆధారిత డిజిటల్ పోర్టల్ను తీసుకురానుంది. ఈ మేరకు కేంద్ర కార్మిక-ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించారు.
పీఎఫ్ ఖాతాదారులకు మరొక తీపి కబురు
ఈ-ప్రాప్తి పోర్టల్ పాత ఈపీఎఫ్ ఖాతాలను ట్రాక్ చేయడానికి వీలవుతుంది. అంతేకాదు యూఏఎన్ లింక్ చేయడానికి, ఖాతాలను యాక్టివేట్ చేయడానికి ఉద్దేశించిన డిజిటల్ ప్లాట్ ఫారమ్. ఈ పోర్టల్లో పటిష్టమైన ఆధార్ ఆధారిత అథెంటికేషన్ ధృవీకరణ సదుపాయం ఉంటుంది. తద్వారా సులభంగా ఉద్యోగులు తమ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవచ్చు.
తద్వారా యూఏఎన్ కు అనుసంధానం కావడం ఈజీ అవుతుంది. ప్రారంభ దశలో పాత మెంబర్ ఐడీలు, అందుబాటులో ఉన్న వారి కోసం ఈ-సేవలు ఉపయోగం లోకి రానున్నాయి. తమ ఐడీని మర్చిపోయిన వారు పాత ఖాతాలను తిరిగి పొందేలా రానున్న రోజుల్లో సేవలను విస్తరించనుంది సంబంధిత శాఖ. దీనిద్వారా మాన్యువల్ ప్రమేయం తగ్గిపోతుంది.
కొద్దిరోజుల్లో అందుబాటులోకి రానున్న ‘ఈ-ప్రాప్తి’ పోర్టల్
డాక్యుమెంటేషన్ తగ్గి పారదర్శకత వేగం పెరుగుతాయని సదరు మంత్రి చెప్పిన మాట. ఈపీఎఫ్వో సేవల విషయానికి వద్దాం. 2025-26లో రికార్డు స్థాయిలో 8.31 కోట్ల క్లెయిమ్లను పరిష్కరించినట్టు కేంద్రమంత్రి తెలిపారు. 2024-25లో ఆ సంఖ్య 6.01 కోట్ల క్లెయిమ్లు పరిష్కరించింది. 5.51 కోట్ల క్లెయిమ్లు అడ్వాన్స్, పాక్షిక ఉపసంహరణలకు సంబంధించినవి.
ఇక 71.11 శాతం అడ్వాన్సులను ఆటో మోడ్ ద్వారా మూడు రోజుల్లోనే పరిష్కరించారు. 1.59 కోట్ల మంది ఖాతాదారులు తమ యజమాని అవసరం లేకుండానే బ్యాంక్ సీడింగ్ పూర్తి చేసి క్లెయిమ్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. ఒక్క ఏప్రిల్ నెలలోనే పలు క్లెయిమ్లను పరిష్కరించినట్లు తెలిపారు.
అలాగే 29.34 లక్షల మంది ఖాతాదారులకు యజమానితో పని లేకుండా తమ పీఎఫ్ ప్రొఫైల్స్ను ఆన్లైన్లో సరిదిద్దుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో 61.03 లక్షల క్లెయిమ్లు పరిష్కారించారు. అందులో 74 శాతం పీఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్లు ఆటో మోడ్లో ప్రాసెస్ చేశారు. మొత్తం క్లెయిమ్లలో 98 శాతం పైగానే 20 రోజుల్లో పరిష్కారం చేసినట్టు తెలియజేశారు.