Petrol Diesel price hike: పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం భారత్లోని సామాన్యుడి జేబుపై పడనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో దేశీయంగా పెట్రోల్.. డీజిల్ ధరలతో పాటు వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేందుకు కేంద్రం ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం రాబోయే 5 నుంచి 7 రోజుల్లో ధరల పెంపుపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
ఈ ప్రతిపాదిత పెంపు అమల్లోకి వస్తే పెట్రోల్.. డీజిల్ ధరలు లీటరుకు సుమారు రూ. 4 నుంచి 5 వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే గృహ అవసరాలకు వాడే ఎల్పీజీ (LPG) సిలిండర్ ధర రూ. 40 నుంచి 50 వరకు ప్రియం కానుంది. భారత్లో పెట్రోల్ ధరలను గత నాలుగేళ్లుగా దాదాపు స్థిరంగా ఉంచారు. ఒకవేళ ఇప్పుడు గనుక ధరలు పెంచితే 2022 తర్వాత జరుగుతున్న మొదటి భారీ మార్పు ఇదే కానుంది.
ముడిచమురు ధరలు పెరగడం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలపై (OMCs) తీవ్రమైన ఆర్థిక భారం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో సరఫరా అంతరాయాలు.. షిప్పింగ్ రిస్క్లు పెరగడం వల్ల ఇన్పుట్ ఖర్చులు భారమయ్యాయి. ఇప్పటివరకు ఈ కంపెనీలు నష్టాలను భరిస్తూ వస్తున్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ధరల పెంపు తప్పనిసరి అని విశ్లేషకులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముగిసిన వెంటనే ధరలు పెంచబోమని గతంలో ప్రభుత్వం ప్రకటించినా.. అంతర్జాతీయ ఒత్తిళ్ల వల్ల ఇప్పుడు వెనక్కి తగ్గక తప్పడం లేదు.
చమురు కంపెనీల ఆర్థిక ఒత్తిడిని తగ్గించడం.. అదే సమయంలో ద్రవ్యోల్బణం పెరగకుండా చూడటం వంటి అంశాలపై ప్రభుత్వం లోతుగా చర్చిస్తోంది. ధరల పెంపు వల్ల రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంది.