తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కమర్షియల్ గ్యాస్ ధరలను భారీగా పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పెంపు సామాన్యుడి నడ్డి విరిచేలా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 19 కేజీల గ్యాస్ ధరను ఏకంగా 993 రూపాయలకు పెంచడం దుర్మార్గమని విమర్శించారు. అంటే సుమారు వెయ్యి రూపాయల మేర భారం పెరగడం పట్ల ఆయన మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ ధరలను పెంచడం పట్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం స్పందించారు. ఈ నిర్ణయం వల్ల చిరు వ్యాపారులు కోలుకోలేని దెబ్బ తింటారని ఆయన హెచ్చరించారు. ఒక్కసారిగా ధరలను 30 నుండి 35 శాతం మేర పెంచడం హేయమైన చర్యగా అభివర్ణించారు. హోటళ్లు, కేఫ్లు, రెస్టారెంట్లతో పాటు వీధి వ్యాపారులపై ఈ ప్రభావం నేరుగా పడుతుందని ఆయన స్పష్టం చేశారు. కమర్షియల్ గ్యాస్ ధర పెరిగితే ఆహార పదార్థాల ధరలు పెరిగి అంతిమంగా సామాన్యులే ఇబ్బందులు పడతారని గుర్తు చేశారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసిన కేవలం 24 గంటల లోపే ఈ పెంపును ప్రకటించడం ప్రజలను వంచించడమేనని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఒకలా ప్రవర్తించి.. ఓటింగ్ ముగియగానే భారాలు మోపడం కేంద్ర ప్రభుత్వానికి అలవాటుగా మారిందని విమర్శించారు. సామాన్యులను మోసం చేయడంలో బీజేపీ ప్రభుత్వం ముందు వరుసలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుత పెంపుతో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర మూడు వేల రూపాయల మార్కును దాటిపోయిందని మంత్రి వివరించారు. ఇంతటి భారీ ధరలతో వ్యాపారాలు నిర్వహించడం అసాధ్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీసే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తక్షణమే ఈ ధరల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సామాన్యుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పాత ధరలనే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న పేద, మధ్యతరగతి వర్గాల గొంతును కేంద్రం నొక్కుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా విమర్శించారు.
ALSO READ: తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు.. ఫస్ట్ ప్రెస్ మీట్లోనే కీలక అంశాల ప్రస్తావన