RBI: భారతీయ రూపాయి విలువ ఒక్కసారిగా క్షీణించడం ప్రారంభిస్తే దాని ప్రభావం మాములుగా ఉండదు. చమురు దిగుమతుల నుంచి విదేశీ రుణాల వరకు, ద్రవ్యోల్బణం నుంచి సాధారణ ప్రజల జీవన వ్యయాల వరకు అనేక రంగాలపై దాని ప్రభావం పడుతుంది. అందుకే రూపాయి విలువలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) రంగంలోకి దిగుతుంది. ఈ ప్రక్రియలో ఆర్బీఐ కేవలం మార్కెట్ను స్థిరీకరించడమే కాకుండా భారీ లాభాలను కూడా ఆర్జిస్తోంది.
మార్చి 31తో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో విదేశీ మారక లావాదేవీల ద్వారా ఆర్బీఐ రూ.1.69 లక్షల కోట్ల లాభాన్ని సంపాదించింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 52శాతం అధికం. రూపాయి విలువ వేగంగా పడిపోతున్న సమయంలో ఆర్బీఐ కొన్ని కీలక అడుగులు వేసింది. కరెన్సీ మార్కెట్లో స్థిరత్వాన్ని తీసుకురావడానికి ఆర్బీఐ తన విదేశీ మారక నిల్వల నుంచి భారీగా అమెరికన్ డాలర్లను విక్రయించింది. 2025-26లో రూపాయి విలువ దాదాపు 9.5 శాతం క్షీణించగా, ఈ కాలంలో స్పాట్ మార్కెట్లో రికార్డు స్థాయిలో 53.13 బిలియన్ డాలర్లను విక్రయించింది.
అయితే డాలర్లు అమ్మితే ఆర్బీఐకి లాభం ఎలా వస్తుందనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా కేంద్ర బ్యాంకు విదేశీ మారక నిల్వలను గతంలో తక్కువ ధరలకు కొనుగోలు చేసి నిల్వ ఉంచుతుంది. అదే సమయంలో మార్కెట్లో డాలర్ల సరఫరా పెరిగితే రూపాయిపై ఉన్న ఒత్తిడి కూడా కొంత మేర తగ్గుతుంది. ఈ విధంగా ఒకే చర్య ద్వారా మార్కెట్ స్థిరత్వంతో పాటు ఆర్థిక లాభం రెండూ సాధ్యమవుతాయి.
2025-26లో విదేశీ వనరుల నుంచి ఆర్బీఐ మొత్తం ఆదాయం 27 శాతం పెరిగి రూ.3.28 లక్షల కోట్లకు చేరింది. ఇందులో విదేశీ సెక్యూరిటీలపై వచ్చిన వడ్డీ ఆదాయం కీలక పాత్ర పోషించింది. విదేశీ ప్రభుత్వ బాండ్లతో పాటు ఇతర అంతర్జాతీయ పెట్టుబడుల్లో విదేశీ మారక నిల్వలను పెట్టుబడి పెట్టడం ద్వారా ఆర్బీఐకి రూ.1.08 లక్షల కోట్ల వడ్డీ ఆదాయం లభించింది. గతేడాది ఈ మొత్తం రూ.97,000 కోట్లుగా ఉంది.
Also Read : ఊళ్ళో చర్మం లేకుండా పుట్టే పిల్లలు… తల్లిదండ్రులే చంపి ఇదేం దారుణం భయ్యా ?
మార్చి చివరి నాటికి భారత్ విదేశీ మారక నిల్వలు 691 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ నిల్వలు దేశానికి సుమారు 11 నెలల దిగుమతుల అవసరాలను తీర్చగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇది అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల సమయంలో భారత ఆర్థిక వ్యవస్థకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇక దేశీయ వనరుల నుంచి కూడా ఆర్బీఐ ఆదాయం భారీగా పెరిగింది. రూపాయి ఆధారిత ప్రభుత్వ సెక్యూరిటీలపై వచ్చిన వడ్డీ ఆదాయం 38 శాతం పెరిగి రూ.1.18 లక్షల కోట్లకు చేరడంతో దేశీయ నికర ఆదాయం రూ.1 లక్ష కోట్ల స్థాయికి చేరుకుంది. మరోవైపు ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ పరిమాణం 21 శాతం పెరిగి రూ.91.97 లక్షల కోట్లకు చేరింది. ఇందులో భాగంగా రూ.1.09 లక్షల కోట్లను ఆకస్మిక నిధికి కేటాయించింది.
ఈ బలమైన ఆర్థిక ఫలితాల కారణంగా 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయిలో రూ.2.87 లక్షల కోట్ల మిగులును బదిలీ చేయనుంది. దీంతో ప్రభుత్వ ఆర్థిక నిర్వహణకు కూడా అదనపు ఊరట లభించనుంది. ఒకప్పుడు కేవలం కరెన్సీ నియంత్రణ సంస్థగా మాత్రమే భావించిన ఆర్బీఐ, ఇప్పుడు దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతూ భారీ ఆదాయాన్ని సృష్టించే శక్తివంతమైన సంస్థగా నిలుస్తోందని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.